జనం - జగన్

ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......

Thursday, September 9, 2010

అదను చూసి పంజా ఇది సోనియా నైజం.. జగన్‌పై మేడమ్ ఆగ్రహం


ఆయనపై చర్య ఖాయం.. సరైన సమయంలో అనూహ్య నిర్ణయం
మధ్యే మార్గానికి అవకాశం శూన్యం
పార్టీ వర్గాల స్పష్టీకరణ
ఎన్ని హెచ్చరికలు చేసినా, ఎలాంటి సంకేతాలు పంపినా పట్టించుకోని కడప ఎంపీ వైఎస్ జగన్‌పై అధిష్ఠానం వైఖరి ఏమిటి? ఆయనకు ఎలాంటి హానీ తలపెట్టబోరనే వాదనలో నిజం ఎంత? ఈ ప్రశ్నకు కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ వైఖరినే సమాధానంగా చూపిస్తున్నారు. "అదను చూసి పంజా విసరడం ఆమె నైజం. జగన్ విషయంలోనూ ఇదే జరుగుతుంది' అని చెబుతున్నారు.

జగన్ పట్ల సోనియాగాంధీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసినప్పటికీ ఆమె నుంచి తగిన ఆదేశాలు రానందునే ఇప్పటిదాకా 'ఓర్పు' ప్రదర్శిస్తున్నట్లు అభిప్రాయపడుతున్నారు. "జగన్ విషయంలో మేమేమీ చేయలేం. బంతి సోనియా కోర్టులో ఉంది. ఆమె జగన్ పట్ల ఏ చర్య తీసుకోవాలో నిర్దేశించేదాకా ఈ విషయంలో ఏమీ చెప్పలేం'' అని ఒక సీనియర్ నాయకుడు తెలిపారు. జగన్‌పట్ల మేడమ్ చాలా ఆగ్రహంగా ఉన్నారని తమకు తెలుసని... ఆయనను క్షమించే అవకాశమే లేదని కూడా తెలుసని చెప్పారు.

"అదను చూసి పంజా విసరడమే సోనియా తత్వం. తగిన సమయంలో ఆమె సంకేతాలు ఇస్తారు'' అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తామే కాదు, జగన్ స్వయంగా వచ్చి వివరణ ఇచ్చినా సోనియా వినిపించుకునే పరిస్థితి లేదని... మధ్యేమార్గానికి అవకాశం లేనే లేదని ఏఐసీసీ నేతలు అంటున్నారు. "జగన్ వలలో పడవద్దు. జాగ్రత్తగా ఉండండి. నాకు తెలుసు మీరు ఓదార్పు యాత్రకు జనాన్ని పంపించారు'' అని సోనియా పార్లమెంట్ సమావేశాల సమయంలో ఒక ఎంపీని హెచ్చరించడం ఆమె ఆలోచనా విధానానికి అద్దం పడుతుందని ఒక నేత చెప్పారు.

ఏ చర్య, ఎప్పుడు, ఏ సమయంలో తీసుకోవాలనే దానిపై అధిష్ఠానం ఒక స్పష్టతతో ఉందని... సరైన సమయంలో అనూహ్యమైన చర్యలుంటాయని ఒక సీనియర్ నాయకుడు అన్నారు. ఈ అంశంపై ఎవరైనా ప్రశ్నించినప్పుడు "మాకు లేని తొందర మీకెందుకు? చర్యలు ఎప్పుడు తీసుకోవాలో మాకు బాగా తెలుసు'' అని ఆయన అంటున్నారు. అయితే, ప్రస్తుతానికి మాత్రం టెన్ జనపథ్‌లో కదలిక కనపడకపోవడంతో ఏఐసీసీ నేతలు కూడా అయోమయంలో ఉన్నారని, అందుకే విలేకరులు అడిగిన వివిధ ప్రశ్నలకు రకరకాల సమాధానాలు చెబుతున్నారని పేర్కొంటున్నారు.

వైఎస్ మరణానంతరం ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు పార్టీయే సహాయం చేయాలనడం, ఓదార్పు యాత్రకు వెళ్లవద్దని చెప్పడం సోనియా ఆదేశాలకు అనుగుణంగానే జరిగిందని... పార్టీ నుంచి స్పష్టమైన సంకేతాలు వెళ్లడంతో జగన్ యాత్రకు పార్టీ శ్రేణుల రాక తగ్గిందని పేర్కొంటున్నారు. ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్ర తర్వాత అధిష్ఠానం మాట వింటానని జగన్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి వీరప్ప మొయిలీకి చెప్పినట్లు వార్తలు వచ్చాయి.

జగన్‌పై తీసుకోవాల్సిన చర్యలపై అధిష్ఠానం ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌తో పాటు ఒకరిద్దరు నేతలతో చర్చించింది. జగన్ వ్యాపార లావాదేవీలు, ఆయన, ఆయన ఆనుచరుల ఆర్థిక సంబంధాల గురించి సమగ్రమైన సమాచారమూ అధిష్ఠానం వద్ద పూర్తిగా ఉంది. ఒకరిద్దరు రాష్ట్ర మంత్రులు, గవర్నర్ నరసింహన్, కొందరు అధికారులు రాష్ట్రంలో పరిస్థితుల గురించి, జగన్ వ్యవహారాల గురించి కేంద్రానికి, పార్టీ పెద్దలకు పూర్తి సమాచారాన్ని అందించినట్లుతెలుస్తోంది.

No comments:

Post a Comment