జనం - జగన్

ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......

Friday, August 27, 2010

జగన్‌ ఆస్తులపై ఇక ఐటీ దాడులు ?

jagan-sad
అధిష్ఠానాన్ని ధిక్కరించేలా వ్యవహరిస్తోన్న కడప ఎంపీ వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని లొంగదీసుకునేందుకు పార్టీ నాయకత్వం రంగంలో దిగింది. జగన్‌ ఆర్థిక మూలాలను దెబ్బతీయడం ద్వారా ఆయనను దారికి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోన్న పార్టీ అధిష్ఠానం ఆ మేరకు తన చర్యలను ఆచరణలో అమలుచేస్తోంది. అందులో భాగంగా.. జగన్‌కు చెందిన వ్యాపార సంస్థల ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వ్యవహారాలపై ఆదాయపన్ను శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ విభా గాలు గత రెండు రోజుల క్రితం నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. వాటి వివరాలను ఇచ్చి, స్వయంగా హాజరుకావాలని ఆదేశించినట్లు ఢిల్లీ పార్టీ వర్గాలతో పాటు, రాష్ట్రానికి చెందిన కొందరు ఎంపిలు సైతం ధృవీకరిస్తున్నారు.

ఆ మేరకు ఢిల్లీలోని కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మధ్య ఇదే అంశానికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. జగన్‌ వ్యాపార సంస్థల వివ రాలు అందచేయాలని ఆ రెండు సంస్థలు నోటీసులు జారీ చేశారని, అందుకే జగన్‌ వైఖరి మార్చుకుంటు న్నారని రాష్ట్రానికి చెందిన ఎంపీలు మీడియా వద్ద వ్యాఖ్యానిస్తున్నారు. వ్యాపార సంస్థలను కాపాడుకు నేందుకే ఆయన ప్రణబ్‌ను ఎక్కువసార్లు కలుస్తున్నారని, తనపై ఉన్న వ్యతిరేకతను పోగొట్టడం ద్వారా తన ఆస్తులు కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారని జగన్‌ వ్యతిరేక వర్గానికి చెందిన ఎంపీలు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు.

ఇదిలాఉండగా.. కేంద్రఆర్థికమంత్రి, యుపిఏలో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న ప్రణబ్‌ముఖర్జీని జగన్‌ కలవడం వెనుక కారణం కూడా ఇదేనని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. తాను పార్టీని చీలుస్తున్నానంటూ కొందరు సీనియర్లు మీకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని, కానీ తనకు అలాంటి ఉద్దేశం లేదని జగన్‌ వివరణ ఇచ్చినట్లు తెలిసింది. తాను పార్టీని చీలుస్తున్నానన్న ఆగ్రహంతోనే తన సంస్థల ఆదాయ వ్యవహారాలపై నోటీసులు ఇస్తున్నట్లు కనిపిస్తోందని జగన్‌ ఆయన వద్ద అనుమానం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.

‘నాకయితే అలాంటి ఉద్దేశం లేదు. మీరు దాన్ని నమ్మి నాపై కక్ష సాధిస్తే నేను చేసేదేమీ లేదు. నాకూ న్యాయమార్గాలు తెలుసు’నని చెప్పినట్లు సమాచారం. అంటే తనపై వేధింపులు కొనసాగిస్తే న్యాయస్థానాల ద్వారా వాటిని ఎదుర్కొంటానని పరోక్షంగా చెప్పినట్టయిందని విశ్లేషిస్తున్నారు. ఓదార్పు యాత్ర తన వ్యక్తిగతమని, దానికి పార్టీతో సంబంధం లేదని, ఆ విషయంలో మిగిలిన పార్టీ వ్యవహారాల్లో నాయకత్వం మాట జవదాటనని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు సమాచారం. ఓదార్పు యాత్ర అంశాన్ని తన తండ్రి మృతి చెందిన తర్వాత బహిరంగంగా ప్రకటించానని, ఆ మాటకు కట్టుబడి ఉండటం తన ధర్మమని ప్రణబ్‌కు నచ్చచెప్పినట్లు సమాచారం. ఆయన విన్నపాన్ని ప్రణబ్‌ సావధానంగా ఆలకించి, తాను సోనియాతో మాట్లాడి, మీ అభిప్రాయాన్ని వెల్లడిస్తానని చెప్పినట్లు తెలిసింది.

ఆ తర్వాత జగన్‌ ఒక జాతీయ మీడియా సంస్థ ప్రతినిధితో కూడా దాదాపు ఇదేవిధంగా మాట్లాడినట్లు పార్టీ ఎంపీ వెల్లడించారు. తనకు పార్టీని చీల్చే యోచన లేదని, అలాంటి ఆలోచనతో ఉన్నానన్న అనుమానంతోనే తన ఆర్థిక మూలాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఒకవేళ తనపై వేధింపులు కొనసాగిస్తే న్యాయపోరాటం చేయడానికి సైతం సిద్ధంగా ఉన్నానని చెప్పినట్లు ఢిల్లీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Thursday, August 26, 2010

జగన్‌లో మార్పు కష్టం! చేతులెత్తేసిన మొయిలీ!

వచ్చే నెలలో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు
జగన్‌పై వేటే అధిష్ఠానం తొలి ప్రాధాన్యత
స్పష్టం చేస్తున్న ఏఐసీసీ వర్గాలు
రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటి వరకూ తటస్థంగా ఉన్నట్లు కనిపిస్తున్న ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి వీరప్ప మొయిలీ వైఖరిలోనూ గుణాత్మక మార్పు కనపడుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. ఓదార్పు యాత్ర విషయంలో జగన్ వైఖరిని మార్చేందుకు పలు విధాల యత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో.. మొయిలీ కూడా జగన్‌పై వేటు తప్ప మరో మార్గం లేదని కాంగ్రెస్ అధిష్ఠానానికి సూచించినట్లు తెలుస్తోంది.

ఇప్పటి వరకూ జగన్‌కు సన్నిహితుడుగా ముద్రపడ్డ మొయిలీ.. ఆ ముద్ర ను తొలగించుకునేందుకు సర్వయత్నాలూ చేస్తున్నారు. జగన్ మొండి ఘటమని, ఆయనలో మార్పు తేవడం కష్టమని మొయిలీతో సహా ఏఐసీసీలో సీనియర్ నేతలందరూ ఒక అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. జగన్ విషయంలో మొయిలీ కూడా పార్టీ ఎంపీలతో అహ్మద్ పటేల్ లాగానే మాట్లాడుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

కాగా.. పార్టీని జగన్ మరింత నష్టపరచకుండా త్వరలోనే కీలక చర్యలు తీసుకునేందుకు అధిష్ఠానం నడుంబిగించినట్లు తెలిసింది. ఈ మేరకు సెప్టెంబర్ 3న జగన్ ఓదార్పు యాత్ర ప్రారంభించిన తర్వాత ఏ క్షణంలోనైనా ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేస్తారని పార్టీ వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి. అయితే.. జగన్‌ను తప్ప ఏ ఎమ్మెల్యేనూ అధిష్ఠానం ప్రస్తుతం ముట్టుకునే అవకాశాలు లేవని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. ఎమ్మెల్యేలను జగన్ నుంచి దూరం చేసేందుకు చతుర్విధోపాయాలను ప్రయోగించడమే అధిష్ఠానం ధ్యేయంగా కనిపిస్తోంది.

జగన్ వ్యూహానికి ప్రతి వ్యూహం
జగన్ వ్యూహానికి అనుగుణంగా ప్రతి వ్యూహా న్ని తాము రచించామని రాష్ట్ర వ్యవహారాలను సన్నిహితం గా పరిశీలిస్తున్న ఏఐసీసీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. జగన్‌కు తాము చాలా అవకాశాలు ఇచ్చామని, అయినప్పటికీ ఓదార్పు యాత్ర తమ వ్యక్తిగతమంటూ, తాను తండ్రి సమాధి వద్ద ప్రజలకు చేసిన వాగ్దానమంటూ తమను జగన్ నమ్మించే యత్నం చేస్తున్నారని ఆయన అన్నారు.

కాంగ్రెస్ పార్టీ కోటలకు బీటలు వేస్తూ, ఎమ్మెల్యేలను చేరదీస్తూ, ఓదార్పు యాత్రను ఆడంబరంగా నిర్వహిస్తూ.. అది వ్యక్తిగతమంటే నమ్మేంత అమాయకులం తాము కాదని ఆయన చెప్పారు. "జగన్ వద్ద ఎంత డబ్బు ఉన్నప్పటికీ, మూడు సంవత్సరాల్లో కొండలైనా కరిగిపోతాయి. డబ్బుతో పార్టీలను నిర్మించగలమనుకోవడం అమాయకత్వం. 125 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్‌కు ఎంతటి డబ్బున్నవారితోనైనా ఎలా వ్యవహరించాలో తెలుసు.

జగన్ మూలంగా పార్టీ దెబ్బతినే అవకాశాలు లేవు. వ్యక్తులు పార్టీని నష్టపరచలేరు. అందునా, కాంగ్రెస్ ఇలాంటివ్యక్తులెందరినో చూసింది,'' అని ఆయనన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రతిష్ఠను జగన్ దిగజారుస్తున్నారని, ఆయన మూలంగా వైఎస్‌పై ప్రతి ఒక్కరూ బురద చల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలంతా దేవుడిగా కీర్తిస్తున్న వైఎస్‌ను ఇవాళ కొందరు బజారుకీడుస్తున్నారంటే దానికి జగనే బాధ్యత వహించాలని అభిప్రాయపడ్డారు. జగన్ పట్ల అధిష్ఠానం సంతోషంగా లేదని ప్రతి ఒక్కరికీ తెలుసుననని చెప్పారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలందరికీ అధిష్ఠానం వైఖరి తెలుసునని, వారికి కొత్తగా చెప్పాల్సిన పనిలేదన్నారు.

Jagan to form new party?

జగన్‌ను మందలిస్తే చాలు * హుటాహుటిన హస్తిన చేరిన గవర్నర్ * , తెలంగాణా ఇవ్వక తప్పకపోతే, హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయమంటున్న నరసింహన్


ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ నరసింహన్‌కు కేంద్ర హోమ్ శాఖ నుంచి పిలుపు వచ్చింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పరిస్థితిపై సమగ్ర నివేదికను తీసుకురావలసిందిగా కేంద్రం గవర్నర్‌ను కోరినట్టు తెలుస్తున్నది. అంతటితో హుటాహుటిన గవర్నర్ ఢిల్లీ చేరుకున్నారు.

జగన్‌వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని రోశయ్య ప్రభుత్వం ఇప్పటికిప్పుడు పడిపోయే ప్రమాదం ఏమీ లేదన్నది గవర్నర్ అభిప్రాయంగా కనిపిస్తున్నది. జగన్ వెంట ఎంత మంది ఉంటారన్న ప్రశ్నకు, సుమారు 27 మంది శాసనసభ్యులు, ముగ్గురు నలుగురు పార్లమెంటు సభ్యులు ఉండవచ్చునన్నది గవర్నర్ సమాధానంగా తెలుస్తున్నది. అయితే జగన్‌పై వేటు వేయడం కంటె గట్టిగా మందలించి ఆయన నడవడికను మార్పించాలన్నది గవర్నర్ సూచనగా కనిపిస్తున్నది.

తెలంగాణా అంశం కూడా గవర్నర్‌తో కేంద్ర హోమ్ శాఖ చర్చించే అవకాశం కనిపిస్తున్నది. ఒకవేళ తెలంగాణా సమస్యపై రాష్ట్రాన్ని విభజించవలసివస్తే, హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలన్నది కూడా నరసింహన్ సూచనగా తెలుస్తున్నది. తెలంగాణాకు హైదరాబాద్ గుండెకాయ కావడంవల్ల హైదరాబాద్ లేని తెలంగాణాను తెలంగాణా ఉద్యమ నేతలు అంగీకరిస్తారా అన్నది తేలవలసి ఉంది.

Tuesday, August 24, 2010

వైయస్ జగన్ ను సహించేది లేదు: రాహుల్ గాంధీ * ఇక ఉపేక్షించేది లేదు, జగన్‌పై రాహుల్ సీరియస్

Rahul Gandhi
కడప పార్లమెంటు సభ్యుడు వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ యువనాయకుడు రాహుల్ గాంధి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ వ్యవహార సరళి రోజురోజుకూ హద్దులు మీరుతున్నదని ఆయన అన్నారు. జగన్ ఆదడాలను ఇక సహించరాదని యువనేత అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం పోయినా సరే, జగన్‌ను ఇక ఉపేక్షించరాదని అయన అన్నారు.

జగన్ ఒత్తిళ్ల రాజకీయాలను అనుమతించేది లేదని, ఇలాంటి శక్తులకు లొంగితే, ఇక ఎవరూ ఏ పార్టీనీ నడపలేరని రాహుల్ అన్నారు. తాను అనుకున్నది సాధించడానికి ఎంతకైనా సిద్ధపడిన జగన్‌ను ఇక ఉపేక్షించదలచుకోలేదని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోయినా ఫరవాలేదని అధిష్ఠానం భావిస్తున్నదంటే జగన్ వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రంగా పరిగణిస్తున్నట్టు పరిగణించాలని ఢిల్లీ రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. 


YS Jagan
కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పై కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు, పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ తీవ్రంగా ప్రతిస్పందించారు. ఈ మేరకు టీవీ న్యూస్ చానెల్ వార్తను ప్రసారం చేసింది. తాను అనుకున్నది సాధించడానికి ఎంతకైనా తెగించడానికి జగన్ సిద్దపడ్డారనేది స్పష్టమని, జగన్ ఆగడాలను సహించేది లేదనేది కూడా అంతే స్పష్టమని రాహుల్ అన్నారు. జగన్ ఒత్తిళ్లకు, బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. వాటికి పార్టీ అధిష్టానం లొంగబోదని ఆయన స్పష్టం చేశారు.

జగన్ ఒత్తిళ్లకు, బ్లాక్ మెయిల్ రాజకీయాలకు లొంగితే ప్రతి రాష్ట్రంలోనూ ఓ జగన్ ముందుకు వస్తాడని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ వెళ్లిపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ లో పార్టీ నష్టపోయినా ఫరవా లేదని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం కూలిపోయినా తాము జగన్ ఒత్తిళ్లకు, బ్లాక్ మెయిల్ రాజకీయాలకు లొంగబోమని ఆయన స్పష్టం చేశారు.

9 నెలలుగా ఏం జరుగుతోందో మీకు తెలుసు లోతుపాతులకు వెళ్లను.. బోరు కొట్టించను

 

మీ ఆశీర్వాదంతోనే ఈ చిరునవ్వు
నాన్నలాగే నన్నూ ఆదరించండి
పులివెందుల ఓదార్పులో జగన్ వ్యాఖ్యలు
హాజరైన మంత్రి అహ్మదుల్లా తనయుడు
కడప ఎంపీ వెంట ఆరుగురు ఎమ్మెల్యేలు
తొలి రోజు కనిపించని బాబాయి
"మీకు బోరు కొట్టించను. లోతుపాతులకు వెళ్లను. 9 నెలలుగా ఏం జరుగుతోందో మీకు తెలుసు. పత్రికల్లో చదువుతున్నారు. మీ అందరి ఆశీర్వాదం, ఆప్యాయతలతోనే మీ ముందు చిరునవ్వుతో ఉన్నాను'' అని కడప ఎంపీ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. సోమవారం పులివెందుల నుంచి ఓదార్పు యాత్రను ఆయన ప్రారంభించారు. "నాన్నను ఎలా ఆదరించారో, ఆప్యాయత చూపారో అలాగే నన్ను కూడా ఆశీర్వదించండి'' అని విజ్ఞప్తి చేశారు.

ఇడుపులపాయలోని తన తండ్రి వైఎస్ సమాధి వద్ద ఆయన ఉదయం నివాళులర్పించారు. అనంతరం 10.30 గంటలకు పులివెందులకు చేరుకున్నారు. పులివెందుల- కడప బైపాస్ సర్కిల్లో వైఎస్ విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు. ఆ తర్వాత కొన్ని ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొని పార్నపల్లె, పులివెందుల మున్సిపల్ కార్యాలయాల్లో విగ్రహావిష్కరణలు చేశారు. ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్న ప్రజలనుద్దేశించి మాట్లాడారు. "రాష్ట్రంలో ఎన్నో వైఎస్ విగ్రహాలు ఆవిష్కరించాను.

ఇక్కడ మీ ఆప్యాయత మధ్య వైఎస్ విగ్రహం ఆవిష్కరించడంలో గల ఆనందం ఈ మధ్య కాలంలో అరుదుగానే కలిగింది. ఎక్కువగా మాట్లాడను. ఒక్క విషయం మాత్రం చెపుతాను. 9 నెలలుగా ఏం జరుగుతోందో మీకు తెలుసు. ఈ రోజు చిరునవ్వుతో మీ ముందు ఉండగలుగుతున్నానంటే మీ ఆప్యాయత, ప్రేమానురాగాలే కారణం'' అని జగన్ చెప్పారు.

"ఈ వీధుల్లో తిరిగాను. మీ అందరి మధ్య పెరిగాను. మీ ఆశీర్వాదం నాకు కావాలి'' అని కోరారు. అభిమానులు.. కాబోయే సీఎం జగన్, జగన్ సీఎం కావాలి.. అంటూ నినాదాలు చేసినపుడు కూడా ఆయన "తొమ్మిది నెలలుగా ఏం జరుగుతోందో తెలుసు'' అని మాత్రమే మాట్లాడారు.

జగన్ వెంట ఆరుగురు ఎమ్మెల్యేలు
ఓదార్పు యాత్రలో కడప జిల్లా రాజంపేట, రాయచోటి, బద్వేల్, రైల్వే కోడూరు, జమ్మలమడుగు ఎమ్మెల్యేలు అమరనాథ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కమలమ్మ, కొరముట్ల శ్రీనివాసులు, ఆదినారాయణ రెడ్డిలతో పాటు అనంతపురం జిల్లాకు చెందిన గురునాథ రెడ్డిలు పాల్గొన్నారు.

వీరితో పాటు జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి అహ్మదుల్లా కుమారుడు అష్రఫ్ కూడా జగన్‌ను కలిసి వెళ్లారు. తాను రాజమండ్రికి వెళ్తున్నానని జగన్‌కు ముందే చెప్పానని.. ఆయన ఆమోదం పొందానని.. మంగళవారం నుంచి ఓదార్పులో పాల్గొంటానని మంత్రి అహ్మదుల్లా ప్రకటించడం పార్టీలో చర్చనీయాంశమైంది. మంత్రిగా ముఖ్యమంత్రి అనుమతిని తీసుకుంటారా.. లేక.. జిల్లా ఎంపీ ఆమోదం పొందుతారా? అనే సందేహం పార్టీలో నెలకొంది.

ప్రకాశం జిల్లా పర్యటన గురించి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో మాట్లాడిన ముఖ్యమంత్రి రోశయ్య.. ఇప్పుడు అహ్మదుల్లాతోనూ మాట్లాడతారా అనేది అసక్తికరంగా మారింది. జడ్పీ చైర్మన్ జ్యోతిరెడ్డి, డీసీసీబీ చైౖర్మన్ పల్లం బ్రహ్మానంద రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు సురేష్‌బాబు, పులివెందుల మునిసిపల్ చైర్‌పర్సన్ రుక్మిణిలు కూడా హాజరయ్యారు. వీరితో పాటు ఆయన జగన్ కుటుంబ సభ్యులు భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, డాక్టర్ ఈసీ గంగిరెడ్డిలు కూడా ఓదార్పు యాత్రలో పాల్గొన్నారు.

జగన్ బాబాయి.. ఎమ్మెల్సీ వివేకానందరెడ్డి మొదటి రోజు ఓదార్పు యాత్రలో కనిపించలేదు. ఇటీవల సోనియాకు రాసిన లేఖ రాజకీయ దుమారం రేపిన నేపథ్యంలో ఆయన గైర్హాజరు చర్చనీయాంశమైంది. అయితే.. అమెరికాలో కూడా వైఎస్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించనున్నందున ఆ ఏర్పాట్ల కోసం హైదరాబాద్ వెళుతున్నానని ముందు రోజే వివేకా చెప్పారు. జిల్లాకు చెందిన సీనియర్ శాసనసభ్యులు డీఎల్ రవీంద్రారెడ్డి, వీరశివారెడ్డిలు ఓదార్పునకు దూరంగా ఉన్నారు. కోస్తాతో పోలిస్తే సొంత జిల్లాలో ఓదార్పునకు అంతస్థాయిలో జన స్పందన కనిపించలేదు.

నలుగురికి ఓదార్పు
మొదటి రోజు నాలుగు కుటుంబాలను జగన్ ఓదార్చారు. పులివెందుల్లో దేరంగుల జయరామ్ అనే వ్యక్తి వైఎస్ మృతి చెందిన ఆరు రోజుల తర్వాత చనిపోయారు. అలాగే అంబకపల్లెలో లోమడ వెంగముని అనే వృద్ధ్దుడు వారం తర్వాత చనిపోయాడు. ఈ ఇద్దరి కుటుంబాలను జగన్ పరామర్శించారు. అలాగే దిగువ పల్లెలో చాపల వెంకటరమణ అనే వ్యక్తి కుటుంబాన్ని, పార్నపల్లెలో మృతి చెందిన అంకె పుల్లన్న అనే వ్యక్తి కుటుంబాలను కూడా జగన్ ఓదార్చారు. వీరితోపాటు ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన మరో నలుగురి కుటుంబాలను కూడా ఆయన పరామర్శించారు.

ఓపిగ్గా, ఓర్పుగా సాగిన ఓదార్పు
పులివెందులలో జగన్ ఓదార్పు యాత్ర ఓర్పుగా, ఓపిగ్గా సాగింది. ఉదయం 8.30 గంటలకు మొదలై మధ్యాహ్నం ఒకటిన్నరకు పూర్తి కావాల్సి ఉండగా 10.30 గంటలకు మొదలై రాత్రి 7.30 గంటలకు కూడా పార్నపల్లెకు చేరుకోలేక పోయారు. ఆలస్యం కావడంతో వేముల ఓదార్పును రద్దు చేసుకున్నారు. మార్గమధ్యంలో వివిధ గ్రామాల ప్రజలతో మాట్లాడుతూ.. వారి సమస్యలను అడిగి తెలుసుకుని, ఫిర్యాదులు స్వీకరించారు. పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.

పెద్దకుడాలలో జిలిటెన్‌స్టిక్స్ లభ్యం
ఓదార్పు యాత్రకు ముందుగా లింగాల మండలం పెద్దకుడాలలో పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం జగన్ ఓదార్పు యాత్రలో భాగంగా పెద్దకుడాలలో వైఎస్ విగ్రహావిష్కరణ జరగాల్సి ఉంది. దీనికి కొన్ని గంటల ముందే విగ్రహం ఏర్పాటు చేసిన సమీప ప్రాంతంలో 52 జిలిటెన్‌స్టిక్స్‌ను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతాన్ని ఏఎస్పీ కార్తికేయన్ పరిశీలించారు. పలు కోణాల్లో వీటిపై పరిశీలన చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.

Monday, August 23, 2010

వేరుబాటే...!

jagan-console
అధిష్ఠానంపై ధిక్కార అస్త్రాలను పరంపరగా వదులుతున్న కడప ఎంపీ వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తాను ఏర్పాటు చేయదలచు కుంటున్న కొత్త పార్టీకి ఇప్పటినుంచే పునాదులు వేసుకుంటున్నారు. అధిష్ఠానం నుంచి ఎదురవు తున్న ‘అవమానాలను’ సహిస్తూ ఇక ఎంతోకాలం పార్టీలో ఇమడలేనని గట్టి నిర్ణయానికి వచ్చిన జగన్‌, గత కొద్ది రోజుల నుంచీ కొత్త పార్టీ నిర్మా ణం, స్వరూప స్వభావాలు, నామకరణం వంటి వాటిపై పలువురితో మంతనాలు జరుపుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఒకవైపు ఓదార్పు యాత్రకు సన్నద్ధం అవుతూనే పార్టీ విషయమై తీరిక చిక్కినప్పుడల్లా అన్ని జిల్లాల నాయకులతో మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. అన్నీ కలసి వస్తే సెప్టెంబర్‌ రెండున వైఎస్‌ఆర్‌ప్రథమ వర్ధంతి రోజునే ఆలోచనను ఆవిష్కృతం చేయాలనుకుంటున్న జగన్‌, ఒకటి, రెండు రోజులు అటూ ఇటూ అయినా పార్టీ పెట్టి తీరాల్సిందే అనే గట్టి నిర్ణయానికి వచ్చేసినట్టు తెలిసింది.

క్షేత్ర స్థాయి సర్వేలు...
ఒకసారి పార్టీ పెట్టటం అంటూ జరిగితే అది టీడీపీ, కాంగ్రెస్‌ ఉత్తమమైన, బలమైన ప్రత్యామ్నాయంగా నిలిచిపోవాలన్న ఆలోచనతో జగన్‌ ఉన్నట్టు సమాచారం. ప్రజారాజ్యం పార్టీ మాదిరిగా హడావుడి ఏర్పాట్లు, టికెట్ల పంపిణీలో అవకతవకలు, చిట్ట చివరకు పట్టుమని 50 స్థానాలు అయినా రాని దుస్థితి, ఆ తర్వాత వరుస ఓటముల వంటివి ఎదురు కాకుండా అతి జాగ్రత్తగా పార్టీ నిర్మాణం జరగాలన్న ఆలోచనతో జగన్‌ అడుగులు వేస్తున్నట్టు చెబుతున్నారు.

ఇందుకోసం క్షేత్ర స్థాయిలో ముమ్మరంగా సర్వేలు ప్రారంభమయ్యాయంటున్నారు. తనకు అత్యంత నమ్మకస్థులైన గ్రామ, మండల, తాలూకా స్థాయి యువతతో అతి గోప్యంగా ఆయా ప్రాంతాల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు. మండలాలు, పంచాయతీలు, నియోజకవర్గాలలో వీరంతా ఎవరికీ తెలియకుండా జనం మధ్యనుంచి సమాచారం సేకరించటం, హైదరాబాద్‌కు చేరవేయటం జరిగిపోతున్నది.

పోటీ ఇచ్చిన వారికి ప్రాధాన్యం

పార్టీకి అండగా నిలిచే వారిని ఎంపిక చేసుకోవటంలోనూ జగన్‌ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గత ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చి ఓటమిపాలైన వారు, ఆయా పార్టీలలో అసంతృప్తితో ఉన్న వారు, ఇక తమకు మనుగడ లేదని నిరాశతో ఉన్న వారు, అంగ, అర్ధబలాలతో పాటు జనంలో మంచి పేరు ఉన్న వారు, అవసరం అయితే దేనికైనా వెనుకాడని వారు...ఇలా విభజించి వీరిలో తమకు ఎవరు అనుకూలంగా ఉంటారో, పార్టీపరంగా వారికి ఎలాంటి గుర్తింపు ఇవ్వాలో అభిప్రాయ సేకరణ జరుగుతున్నది. ఇందులో కేవలం ఒకే పార్టీ నుంచే లాగాలనే ఆలోచన కాకుండా అన్ని పార్టీల నుంచి ఆకర్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.

ప్రాంతాల వారీగా వివరాలు...
ఇలా వివరాలు సేకరించటంలో జగన్‌ కానీ, ఆయన సలహాదారులు కానీ ఎలాంటి తొందరపాటు కనబరచటం లేదు. ఒకేసారి రాష్ట్రం మొత్తం నుంచి సమాచారం తెప్పించుకుని హడావుడి నిర్ణయాలు తీసుకోకుండా, ప్రాంతాల వారీగా వివరాలు సేకరిస్తున్నట్టు చెబుతున్నారు. ఉత్తరాంధ్ర, కోస్తా, ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, రాయలసీమ...ఇలా ఒక్కో ప్రాంతం నుంచి కొన్ని నియోజకవర్గాలను ఎంపిక చేసి అక్కడి పరిస్థితులు, బలంగా ఉన్న పార్టీలు, నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాల్లో బలమైన నేతలు, వారికి ఉన్న పలుకుబడి వంటి వాటిపై దృష్టి సారిస్తున్నారు. అవసరం అనుకున్న పక్షంలో తన అనుయాయులతో మంతనాలు జరిపిస్తున్నారు. మొదట సన్నిహితులు, సలహాదారులు ఎంపిక చేసిన వారితో మాట్లాడి ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత వారితో సంప్రదించిన అనంతరమే దగ్గరకు తీసుకోదలచిన వారితో జగన్‌ స్వయంగా మాట్లాడతారని తెలిసింది. ఇప్పటికే కొందరు నేతలతో మంతనాలు పూర్తి అయ్యాయని చెబుతున్నారు.

ప్రధాన టార్గెట్‌ కాంగ్రెస్‌...
కాంగ్రెస్‌ నాయకత్వం తనను అవమానాల పాలు చేస్తున్నదని ఆగ్రహంతో ఉన్న జగన్‌, పార్టీ ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్‌నే ప్రధాన లక్ష్యం చేసుకోవాలని భావిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. వైఎస్‌ఆర్‌ విషాదాంతం తర్వాత కొంతకాలం తన వెంట ఉన్న ట్టు ‘నటించి’, ఇప్పుడు అధిష్ఠానం పేరు చెప్పి ముఖాలు చాటేస్తున్న వారిపై గుర్రుగా ఉన్నారు.

అలాంటి వారిని ప్రధాన లక్ష్యాలుగా చేసుకుని, వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా వారు గెలవకుండా చేయాలన్న దృక్పథంతో వ్యూహ రచన చేస్తున్నట్టు తెలిసింది.ఆ తర్వాత ఓదార్పు యాత్రకు గైర్హాజరయ్యేవారు, కొంత తగ్గి అధిష్ఠానం మాట వినాలని హితవు పలికిన వారు, తనపైన, తన తండ్రి పైన దురుసు వ్యాఖ్యలు చేస్తున్న వారు...ఇలా ఒక్కో స్థాయి వారందరినీ ఒక చూపు చూడాలన్న ఆలోచనతో జగన్‌ ముందుకు సాగుతున్నట్టు కాంగ్రెస్‌లో బలమైన వర్గాలు చెబుతున్నాయి.

పేరు ఓదార్పు... ప్రయత్నం సమాచార సేకరణ
ప్రస్తుతం సొంత జిల్లాలో ఓదార్పు యాత్ర జరుపుతున్న జగన్‌, వచ్చేనెలలో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆ యాత్రకు ఎంతమంది వచ్చేదీ ఇంకా తేలకపోయినా, యాత్ర మాత్రం జరిగితీరుతుందని ఇప్పటికే స్పష్టమైంది. అయితే తనకు కావలసిన సమాచారాన్ని సేకరించటానికి ఓదార్పు యాత్ర కూడా ఉపకరిస్తుందని జగన్‌ విశ్వసిస్తున్నారు. పార్టీలోకి రాజకీయ నాయకులను లాగడానికి తాను ఏర్పాటు చేసుకున్న ప్రాతిపదికల ప్రకారం వెళ్ళిన చోటల్లా అలాంటివారు ఎవరెవరు ఉన్నారో కూపీ లాగుతున్నారు. ఈ విషయంలో జగన్‌కు అత్యంత విశ్వసనీయమైన నెట్‌వర్క్‌ టీమ్‌ పూర్తిగా సహకరిస్తున్నట్టు తెలిసింది.

హై కమాండ్‌ ఆరా?
సొంత కుంపటి పెట్టుకునేందుకు జగన్‌ ప్రయత్నిస్తున్నట్టు వస్తున్న వార్తలు ఢిల్లీ దాకా చేరినట్టు సమాచారం. ఇందులో వాస్తవాలేమిటో తెలుసుకునేందుకు హై కమాండ్‌ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే జగన్‌ ఉంటే ఎంత? పోతే ఎంత? అని ప్రణబ్‌ ముఖర్జీ లాంటి వారు వ్యాఖ్యానించటంతో జగన్‌కు ఇక కాంగ్రెస్‌లో ఎలాంటి గుర్తింపూ ఉండబోదని తేలిపోయింది. అయినప్పటికీ వేరు కుంపటి పెట్టే విషయం వాస్తవమే అయితే ఆ వ్యూహాన్ని ఎదుర్కునేందుకు ఏమి చేయాలన్న దానిపై అంత సీరియస్‌గా కాకపోయినా ఒక కన్ను మాత్రం వేసి ఉంచాలని హైకమాండ్‌ పెద్దలు భావిస్తున్నట్టు చెబుతున్నారు. రాష్ట్ర, కేంద్ర ఇంటిలిజెన్స్‌ వర్గాల ద్వారా జగన్‌ పార్టీ ప్రయత్నాలపై ఎప్పటికప్పుడు కూపీలు లాగుతున్నారు. పార్టీ ఏర్పాటు నిజమే అయితే పార్టీలో ఉన్న వారు ఎంత మంది అటువైపు దూకుతారన్న స్థాయిలో ఆలోచించకపోయినా ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకుంటూ, జగన్‌ వ్యూహాలను గమనిస్తూ ఉండాలని మాత్రం అధిష్ఠానం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.

జగన్‌పై వేటు ఖాయం సెప్టెంబర్ 4న షోకాజ్ నోటీసు!

పార్టీలో ఉంటూ పార్టీకే చిచ్చు
ఇక ఏ మాత్రం ఉపేక్షించరాదు
ఇదీ అధిష్ఠానం భావన
డీఎస్‌తో సోనియా చర్చలు
మెయిలీకి మార్గ నిర్దేశం
  "ఓదార్పుపై పార్టీ శ్రేణుల్లో అయోమయం సృష్టిస్తున్నారు. అధిష్ఠానం వైఖరిపై అర్ధ సత్యాలు, అసత్యాలు ప్రచారం చేశారు. మొత్తంగా పార్టీలోనే చిచ్చు పెడుతున్నారు. కడప ఎంపీ జగన్‌ను ఇక ఏమాత్రం ఉపేక్షించరాదు'' అని అధిష్ఠానం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. పార్టీ నుంచి ఎందుకు తొలగించరాదో చెప్పాలని కోరుతూ ఆయనకు వచ్చేనెల 4న షోకాజ్ నోటీసు జారీ చేయాలని యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెప్పాయి.

ఓదార్పు యాత్ర వల్ల పార్టీలో లేనిపోని అయోమయం ఏర్పడిందని, వైఎస్ మరణించిన నాటి నుంచే జగన్ పార్టీకి తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తున్నారని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలిసింది. జగన్ పార్టీ నుంచి పోకుండా, పార్టీలోనే చిచ్చు రేపుతున్నారని... అందువల్ల ఆయనను సాధ్యమైనంత త్వరగా పార్టీ నుంచి తప్పించడమే మంచిదని పార్టీకి చెందిన ఒక సీనియర్ నాయకుడు సోనియాకు సలహా ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

"ఒకసారి జగన్‌పై చర్య తీసుకుంటే రాష్ట్ర రాజకీయాల్లో స్పష్టత ఏర్పడుతుంది. పార్టీపరంగా, ప్రభుత్వపరంగా చేయాల్సిన పనులు సాఫీగా జరిగిపోతాయి. ఎన్నికలు జరిగేందుకు ఇంకా నాలుగు సంవత్సరాలున్నందువల్ల జగన్ నిలదొక్కుకోవడం కష్టం. ఎమ్మెల్యేలు కూడా జగన్ వైపు వెళ్లేందుకు వెనుకాడతారు'' అని ఆ నేత సోనియాకు చెప్పినట్లు తెలిసింది.

ఓదార్పు విషయంలో అధిష్ఠానం ఇప్పటికే జగన్‌కు తన వైఖరి స్పష్టం చేసినందున ఇక ఉపేక్షించడం సరైంది కాదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. వైఎస్ మరణించిన ఏడాదిలోపే జగన్‌పై చర్యలు తీసుకుంటే తప్పుడు సంకేతాలు వెళతాయని... అందుకే ఏడాది పూర్తయిన తర్వాత, ఆయన ప్రకాశం జిల్లా యాత్ర ప్రారంభించిన వెంటనే చర్య తీసుకోవాలని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

మేడమ్ మంతనాలు
సోమవారం తనను కలిసిన పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌తో సోనియా దాదాపు అరగంటసేపు చర్చించారు. డీఎస్ తనను కలిసే ముందు ఆమె ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి వీరప్ప మొయిలీని కూడా పిలిపించుకుని రాష్ట్రంలో పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. తదుపరి తీసుకోవాల్సిన చర్యలను మొయిలీకి నిర్దేశించారు.

కాగా, డీఎస్‌తో అధిక భాగం ఓదార్పుపైనే సోనియా చర్చించినట్లు సమాచారం. అయితే, తమ మధ్య ఓదార్పుపై చర్చ జరగలేదని డీఎస్ విలేకరులకు తెలిపారు. అదే సమయంలో... 'నేను చెప్పాల్సిన విషయాలను అధిష్ఠానానికి చెప్పాను. పార్టీ అంతర్గత విషయాల గురించి బయట మాట్లాడను. అవసరమైన దానికంటే ఎక్కువ ప్రశ్నలు వేయకూడదు'' అని మీడియాకు సూచించారు.

ఇటీవల జరిగిన ఉప ఎన్నికలపై సోనియాకు నివేదిక ఇచ్చానని, ఎన్నికల ఫలితాలను విశ్లేషించామని చెప్పారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అ«ధ్యక్షురాలిని మొట్టమొదటిసారి కలిశానని, రాష్ట్రంలో పార్టీ పరిస్థితుల గురించి చర్చించానని చెప్పారు.

జాతీయ స్థాయికి డీఎస్?
జగన్‌పై డీఎస్ ద్వారానే చర్యలు తీసుకోవాలని సోనియా భావిస్తున్నట్లు తెలిసింది. డీఎస్ హయాంలోనే జగన్‌పై వేటుపడుతుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. జగన్ వ్యవహారానికి సంబంధించి పార్టీని ప్రక్షాళన చేసిన తర్వాతే కొత్త పీసీసీ అధ్యక్షుడు వస్తారని అంటున్నారు. సోనియా డీఎస్‌ను చాలా సాదరంగా ఆహ్వానించారని, ఆయనతో అన్ని విషయాలు అరమరికలు లేకుండా మాట్లాడారని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఉప ఎన్నికల్లో ఓటమి చెందినందుకు బాధపడవద్దని డీఎస్‌ను సోనియా అనునయించినట్లు సమాచారం. పార్టీ ఆదేశాల మేరకు పోటీ చేసినందుకు డీఎస్‌ను అభినందించారని కూడా తెలిసింది. తనను ఢిల్లీకి (జాతీయ స్థాయి) పిలిపించుకుంటే పూర్తి అండగా నిలుస్తానని డీఎస్ చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తనకు ఏ పదవి ఇచ్చినా ఫర్వాలేదని, ఆ బాధ్యతలను శిరోధార్యంగా భావిస్తానని చెప్పినట్లు తెలిసింది. జగన్‌కు అధిష్ఠానం ఇప్పటికే ఎంతో స్పష్టంగా తన వైఖరి చెప్పిందని, మళ్లీ మళ్లీ ఆ విషయం చెప్పనవసరం లేదని సోనియాను కలిసిన తర్వాత డీఎస్ తన సన్నిహితులకు చెప్పినట్లు తెలిసింది.

"ఆయన పర్యవసనాలను ఎదుర్కొనాల్సిందే. అధిష్ఠానానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఎన్నికలు జరిగేందుకు ఇంకా మూడు సంవత్సరాల 9 నెలలుంది'' అని డీఎస్ చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. డీఎస్ సోనియాతో భేటీ తర్వాత వీరప్ప మొయిలీని కలిసి రాష్ట్ర రాజకీయాల గురించి డీఎస్ చర్చించారు. బుధవారం ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ, సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌ను కలుసుకుంటారు.

Sunday, August 22, 2010

రెచ్చగొట్టే ధోరణి ?

Jagan9
కడప ఎంపి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి శిబిరానికి చెందిన నేతలు రాష్ట్ర కాంగ్రెస్‌లో ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలను రెచ్చగొట్టే ధోరణి అవలంబిస్తున్నారంటూ పార్టీలో విమర్శలు గుప్పుమంటున్నా యి. మరో వైపు జగన్‌ శిబిరం నేతల వైఖరి చూస్తుంటే ఈ విమ ర్శ లకు బలం చేకూరుతున్నది. ఓదార్పు యాత్రకు బ్రేకు వేసేం దుకు పార్టీ అధిష్ఠానం ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు ఎవరూ కూడా యాత్రలో పాల్గొనవద్దంటూ నేతల ద్వారా తమ వైఖరి స్పష్టం చేసిన నేపథ్యంలో జగన్‌ శిబిరం దాన్ని తిప్పి కొట్టేందుకు రంగంలో దిగింది. ఓదార్పు యాత్రలో పాల్గొనకుంటే, యాత్ర ను వ్యతిరేకించినా జనం రాళ్ళతో కొడతారంటూ తాజాగా ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలపై ఒత్తిడి పెంచడానికి సరికొత్త తరహా ప్రచారాన్ని ప్రారంభించింది. తద్వారా ఓదార్పును వ్యతిరేకిస్తున్న వారిని, ఓదార్పు యాత్రలో పాల్గొనే విషయంలో ఊగిసలాడు తున్న వారికి జనం భయం చూపించి యాత్రకు రప్పించే ప్రయ త్నాలను ఆ శిబిరం ముమ్మరం చేసినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అప్పటికి యాత్రకు రాని నేతలపై కార్యకర్తల రూ పంలో తమ వర్గం క్యాడర్‌ను రెచ్చగొట్టి, దాడులు చేయిం చేందుకు వ్యూహ రచన చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.

తాజాగా ఆదివారం ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కొండా సురేఖ తదితరులు చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే జగన్‌ ఓదార్పు యాత్రను వ్యతిరేకిస్తున్న ప్రజా ప్రతినిధులపై పార్టీ ద్వితీయశ్రేణు నేతలు, క్యాడర్‌ను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని పలువురు నేతలు విమర్శించారు. కేంద్ర మంత్రులు దగ్గుబాటి పురంధేశ్వరి, పనబాక లక్ష్మి ద్వారా అధిష్ఠానం ఓదార్పు యాత్ర విషయంలో ఇచ్చిన సంకేతాలు జగన్‌ వర్గానికి ఎంత మాత్రం మింగుడు పడటం లేదు. హైకమాండ్‌ పేరుతో పురంధేశ్వరి మాట్లాడటమేమిటి, యాత్ర విషయంలో అధిష్ఠానం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలనుకుంటే పార్టీ అధికార ప్రతినిధులు, ఎఐసీసీ ప్రధాన కార్యదర్శుల ద్వారా విడుదల చేస్తుందని, అలా కాకుండా పురంధేశ్వరి ద్వారా ఓదార్పు యాత్రకు ఆదేశాలివ్వాల్సిన కర్మ పార్టీకి పట్టలేదని ఇప్పటికే జగన్‌ శిబిరం నిప్పులు చెరిగింది. దగ్గుబాటి దంపతులే ఓదార్పును అడ్డుకునేందుకు ఈ వ్యూహం వేశారని ఆరోపించింది. కాగా సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్‌ పటేల్‌ చెప్పమన్న విషయాలను మాత్రమే తాను చెప్పడం జరిగిందని, పైగా ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీల ఎదుట హైకమాండ్‌ ఓదార్పు యాత్రపై తన వైఖరి స్పష్టం చేసిందని పురంధేశ్వరి ఆదివారం వైజాగ్‌లో స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన మరో ఎంపి పనబాక లక్ష్మి కూ డా స్పందిస్తూ ఓదార్పు యాత్ర పార్టీకి లాభమా? నష్టమా అన్నది ప్రజలే నిర్ణయిస్తారని, తాను మాత్రం యాత్ర కు వెళ్ళేది లేదని, ఇప్పటికే తన వైఖరి స్పష్టం చేశాను, ఇక పదే పదే దీనిపై మాట్లాడాల్సిన అవసరం లేదని ఆమె ఆదివారం తేల్చి చెప్పారు.

ఒక వైపు అధిష్ఠానం యాత్రకు వెళ్ళొద్దంటూ ఆదేశించినట్లు వార్తలు రావడం, మరో వైపు ప్రకాశం జిల్లాకు చెందిన ఎంపీలు, మరి కొందరు ఎమ్మెల్యేలు తాము అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని, అందుకే యాత్రకు వెళ్ళబోమని స్పష్టం చేయడంతో జగన్‌ శిబిరం ఆందోళనలో పడింది. ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్రను సక్సెస్‌ చేయడానికి, అధిష్ఠానం కల్పిస్తున్న అడ్డంకులను అధిగమించేందుకు జగన్‌ శిబిరం సరికొత్త వ్యూహంతో ముందుకు వస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ‘ఓదార్పు యాత్రకు వెళ్ళక పోతే జనం రాళ్ళతో కొడతారు’ అనే సరికొత్త నినాదాన్ని జగన్‌ శిబిరం తెరమీదకు తీసుకొచ్చి బహుళ ప్రచారం సాగిస్తోంది. ‘90 శాతం మంది వైఎస్‌ అభిమానులు ఉన్నారు, వైఎస్‌ను వ్యతిరేకించినా, ఓదార్పు యాత్రను వ్యతిరేకించినా జనం సహించే పరిస్థితుల్లో లేరు, రాళ్ళతో కొట్టే పరిస్థితి ఉంది’ అని ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ప్రకటించడం, ‘ఓదార్పు యాత్రలో పాల్గొనవద్దని పార్టీ హైకమాండ్‌ స్పష్టంగా ఎక్కడా చెప్పలేదు.

ఈ యాత్రకు వెళ్ళక పోతే ప్రజలు నిలదీస్తారు. రాళ్ళతో కొడతారు. యాత్రను వ్యతిరేకించే నేతలకు కనిగిరి ఎమ్మెల్యేకు పట్టిన గతే పడుతుంది’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొండా సురేఖ నెల్లూరులో చేసిన వ్యాఖ్యలు పార్టీ ప్రజా ప్రతినిధుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలను రెచ్చగొట్టడం ద్వారా ఓదార్పుకు దూరంగా ఉండే ప్రజా ప్రతినిధులపై ఉసిగొల్పే వ్యూహంలో ఇది భాగమేనని పార్టీ నేతలు కొందరు భగ్గుమంటున్నారు. ఢిల్లీ వెళ్ళి అహ్మద్‌ పటేల్‌తో కలిసి వచ్చిన ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలలో సభ్యుడైన కనిగిరి ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి ఓదార్పు యాత్రలో పాల్గొనే విషయంలో తమ కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆ మేరకు రెండు రోజుల క్రితం తన నియోజకవర్గం కనిగిరిలో కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసి అభిప్రాయం తెలుసుకున్నా రు.

జగన్‌ శిబిరం నేతలు, కార్యకర్తలుగా చెబుతున్న వారు యాత్రకు వెళ్ళవలసిందే నని పట్టుబట్టి ఒక దశలో ఎమ్మెల్యేపై దాడికి దిగినంత పనిచేశారు. దీంతో ఇదే ఘటన ను జగన్‌ శిబిరం తెరపైకి తీసుకొచ్చి విస్తృత ప్రచారం సాగిస్తూ ప్రజాప్రతినిధుల్లో భయాందోళనలు కల్పిస్తున్నదనే కొందరు నేతలు విమ ర్శిస్తున్నారు. మరో వైపు ఓంగోలు ఎంపి మేకపాటి రాజ్‌మోహ న్‌రెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే, మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి తాము జగన్‌ యాత్రలో ఎట్టి పరిస్థితుల్లో పాల్గొంటామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా మరో వైపు జగన్‌ శిబిరం ఓదార్పు యాత్రలో పాల్గొనాలంటూ ప్రజా ప్రతినిధులపై ఒత్తిడి పెంచడా నికి వివిధ జిల్లాల్లో పలు కార్యక్రమాలు చేపట్టింది. అనం తపురం, ఖమ్మం జిల్లాల్లో జగన్‌ శిబిరం నేతలు ఓదార్పు యాత్ర కు మద్దతుగా ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించారు. అనంతపు రంలో రఘువీరాను సైతం ఘెరావ్‌ చేసినంత పనిచేశారు.

విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్‌ మరో అడుగు ముందుకు వేసి జగన్‌కు బాసటగా నిలిచారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలను జిల్లాకు ఒకటి చొప్పున ఆవిష్కరించాలంటూ హైకమాండ్‌ ఆంక్షలు విధించడాన్ని తప్పుపట్టారు. కేంద్ర మంత్రి పురంధేశ్వరి ద్వారా అహ్మద్‌ పటేల్‌ ఇదే చెప్పించారు. అంతే కాకుండా జిల్లాల్లో వైఎస్‌ విగ్రహాం ఆవిష్కరించే చోటనే బాధితులను పిలిపించి ఆర్ధిక సహాయం చేయాలని ఆయన సూచించారు. అయితే హైకమాండ్‌ సూచనలను లగడపాటి వ్యతిరేకించడమే కాకుండా పరోక్షంగా జగన్‌ కు బాసటగా నిలిచిచారని పార్టీ వర్గాల్లో విమర్శలు భగ్గుమన్నాయి.

కౌంట్‌డౌన్‌ ! * సెప్టెంబర్‌లో సంక్షోభమేనా?

Sonia-gandhi
కాంగ్రెస్‌లో ఇక ఇమడగలిగే పరిస్థితులు కనిపించటం లేదని నిర్ధారణకు వచ్చిన కడప ఎంపీ వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి కొత్త పార్టీ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తు న్నారా? ఆ పార్టీకి తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ పేరు కానీ, ఇందిరాగాంధీ పేరు కానీ ఖాయం చేయబోతున్నారా?...కాంగ్రెస్‌ వర్గాలలో ఆసక్తిరంగా సాగుతున్న చర్చ ఇది. పార్టీ నుంచి జగన్‌ పోతే పోనీ అని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్‌ కుమార్‌ ముఖర్జీ ఘాటైన వ్యాఖ్యలు చేసినా బెదరని జగన్‌ సోమ, మంగళవారాలలో తన తండ్రి అనాదిగా ప్రాతినిధ్యం వహించి, ప్రస్తుతం తల్లిగారైన విజయమ్మ ఎమ్మెల్యేగా ఉన్న పులి వెందుల నియోజకవర్గం నుంచి రెండురోజుల పాటు ఓదార్పు యాత్ర జరపబోతున్నారు.

జగన్‌ ఎలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడినా చర్యలు తప్పవంటూ ప్రణబ్‌ తొలిసారిగా ఘాటైన హెచ్చరిక చేసినా పట్టించుకోకుండా తన ప్రయ త్నాలు తాను చేసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ నాయకత్వం తనపై చర్య తీసుకున్నా, లేకపోయినా కొత్త పార్టీ స్థాపించి ఎఐసిసికి తన దెబ్బ ఏమిటో రుచి చూపించాలన్న ధోరణి జగన్‌లో కనిపిస్తున్నదని పార్టీ వర్గాలు చెబు తున్నాయి. అయితే అధిష్ఠానం మాత్రం నోటి మాటలుగా తప్ప జగన్‌ విషయంలో చేతల్లో ఏ తీవ్రమైన చర్యా తీసుకోవటం లేదు. జగన్‌ ము న్ముందు ఏమి చేయబోతున్నారో తేలిన తర్వాతనే ఏదైనా నిర్ణయించాలని హై కమాండ్‌ భావిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.

పార్టీ ఏర్పాటు జరిగితే...
ఒకవేళ జగన్‌ ఊహాగానాలను నిజం చేస్తూ స్వంతంగా పార్టీ పెట్టాలనుకుంటేదాని నామకరణం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను రెండుసార్లు ఒంటి చేత్తో అధికారంలోకితీసుకు వచ్చిన తన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేరు పెట్టాలా? లేక అనాదిగా తమ కుటుంబం నమ్ముకుని ఉన్న కాంగ్రెస్‌కు మకుటం లేని మహారాణిలా వెలిగిన ఇందిరాగాంధీ పేరు పెట్టాలా అనే ఆలోచనలో ఆయన ఉన్నట్టు చెబుతున్నారు. అయితే ఇందిరాకాంగ్రెస్‌ అనే పేరు ఖాయం చేయటానికి కొన్ని ఇబ్బందులున్నాయని ఆంతరంగికులు చెబుతున్నట్టు తెలిసింది.

jagan-speach
ఎఐసిసి అధినేత్రి సోనియా గాంధీ స్వయంగా ప్రతి బహిరంగ సభలో ఇందిర పేరును ప్రస్తావించకుండా ఉపన్యాసాన్ని కొనసాగించని నేపథ్యంలో ఇందిర పేరును తాము వాడుకుంటే రాజకీయంగా పెద్ద ప్రయోజనం ఉండదన్న ఆలోచనను కొందరు అనుయాయులు జగన్‌ వద్ద బయట పెట్టినట్టు చెబుతున్నారు. ఎలాగూ వైఎస్‌ పేరిటనే ఓదార్పు యాత్ర చేస్తున్నారు కాబట్టి పార్టీ పేరును సైతం ఆయన పేరుతోనే కొనసాగిస్తే రాజకీయంగా మనుగడ ఉంటుందన్న ఆలోచన అనుయాయుల నుంచి వస్తున్నట్టు తెలిసింది. పైగా ఈ తరం వోటర్లకు సోనియాగాంధీ తప్ప ఇందిర అంతగా తెలియకపోవ చ్చునని, అలాంటప్పుడు ఆమె పేరు పెడితే మరోరకమైన ఇబ్బంది ఎదురు కావచ్చునని కొందరు జగన్‌తో మాట్లాడినప్పుడు అభిప్రాయపడినట్టు చెబుతున్నారు.

సెప్టెంబర్‌లో సంక్షోభమేనా?
జగన్‌ తీసుకునే ఏ నిర్ణయం అయినా కాంగ్రెస్‌లో సంక్షోభం సృష్టించక తప్పదన్న వాదనలు సర్వత్రా వినిపిస్తున్నాయి. జగన్‌ పార్టీ నుంచి బయటకు వెళ్తే ఆయన వెంట ఏమేర ఎమ్మెల్యేలు, ఎంపీలు వెళ్తారన్న దానిపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ఒకవేళ జగన్‌ గణనీయమైన సంఖ్యలో ఎమ్మెల్యేలను చీల్చుకుపోతే రోశయ్య సర్కారు భవితవ్యం ఎలా ఉంటుందన్న చర్చ సైతం పార్టీ వర్గాలో జోరుగానే సాగుతున్నది. అంటే తన తండ్రి ప్రథమ వర్ధంతి వచ్చేనెల రెండున జరగనున్న నేపథ్యంలో ఆ రోజు కానీ, ఆ తర్వాత కానీ జగన్‌ తీసుకునే ఏ నిర్ణయం అయినా పార్టీలో సంక్షోభానికి తెర తీయక తప్పదన్న ఊహాగానాలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

వచ్చేనెలలో ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో జరపబోయే ఓదార్పు యాత్రకు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, నెల్లూరు ఎంపీ మేకపాటిరాజమోహన్‌రెడ్డి, ఆయన సోదరుడు చంద్రశేఖరరెడ్డి, మరి కొందరు నేతలు బహిరంగంగా మద్దతు పలికారు. ఓదార్పు యాత్ర ఏర్పాట్లన్నీ బాలినేని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. యాత్ర జరపటం ఖాయం అని, ఇష్టం ఉన్న వారు రావచ్చునని, లేనివారు రాకపోయినా బలవంతం ఏమీ లేదని బాలినేని ఇప్పటికే స్పష్టం చేశారు. ఇటీవల ఢిల్లీలో తనను కలిసిన నేతలకు జగన్‌ సైతం ఇదే మాట చెప్పినట్టు వార్తలు వచ్చాయి. ఈ లెక్కన పార్టీలో పెను సంక్షోభం సృష్టించి తన సత్తా ఏమిటో కాంగ్రెస్‌ నాయకత్వానికి చూపించాలని జగన్‌ వ్యూహ రచన చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. సోమ, మంగళ వారాలలో స్వంత జిల్లాలో జరిపే ఓదార్పు యాత్ర సందర్భంగా తనకు అనుకూలురైన ఎమ్మెల్యేలతో భవిష్యత్‌ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి.

బల సమీకరణ మొదలు...
ఢిల్లీ వెళ్ళి అధిష్ఠానం మనుషులతో మాట్లాడిన తర్వాత ఇక తనను పార్టీ పట్టించుకునే స్థితిలో లేదని నిర్ణయానికి వచ్చినజగన్‌, శనివారం తన మద్దతుదారులతో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. తన రాజకీయ భవిష్యత్తుపై నీలి నీడలు ముసిరేలా దగ్గుబాటి దంపతులు చేశారని ఆగ్రహంగా ఉన్న జగన్‌, తన మనుషులతో వారిపై కారాలు, మిరియాలు నూరిస్తున్నారు. వరంగల్‌ జిల్లా ఎమ్మెల్యే కొండా సురేఖ, ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి లాంటి వారి ద్వారా కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధ్రీశ్వరిని, మరో మంత్రి పనబాక లక్ష్మిని తీవ్రంగా విమర్శించేలా చేస్తున్నారు.

అలా చేస్తూనే మరోవైపు ప్రముఖులు అనుకున్న వారితో స్వయంగా మాట్లాడి అనుకూలంగా మలచుకుంటున్నారు. అలా రోజు రోజుకూ తనకు మద్దతు దారులు పెరిగేలా చూసుకుంటున్నారు. తాజాగా విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ రంగ ప్రవేశం చేశారు. ఓదార్పు యాత్ర విషయంలో కానీ, మరో అంశంపై కానీ ఎక్కువగా వ్యాఖ్యలు చేయని లగడపాటి, హఠాత్తుగా తెరపైకి వచ్చి జిల్లాకు ఒక వైఎస్‌ఆర్‌ విగ్రహం ఉంటే సరిపోతుందని అధిష్ఠానం చెప్పినట్టు వచ్చిన వార్తలపై మండి పడ్డారు. అది సరైన నిర్ణయం కాదని స్పష్టం చేశారు. ఇప్పటికే నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి యాత్రకు మద్దతు ఇచ్చిన నేపథ్యంలో లగడపాటి అదనంగా జగన్‌కు అండగా మిగిలారు.

హడావుడి లేకుండానే...
తన పట్ల అధిష్ఠానం అనుసరిస్తున్న వైఖరికి రగిలిపోతున్న జగన్‌ ఎలాంటి హడావుడీ లేకుండా తన పని తాను చేసుకుపోతున్నారు. ఏమి చేస్తున్నదీ పది మందికి తెలియకుండా అత్యంత జాగరూకతతో వ్యవహరిస్తున్నా రు. ప్రతి జిల్లాలో తన వారెవరో, పరాయివారెవరో అంచనాలు వేసుకుంటున్నారు. తన సర్వేలు తనకు ఉన్నాయని ప్రకాశం, నెల్లూరు జిల్లాల ఎమ్మెల్యేలతో కొద్ది రోజుల క్రితమే చెప్పిన ఆయన వాటి ప్రకారమే తన బలం ఎంతో, స్థాయి ఏమిటో అంచనాలు వేసుకుంటున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ పరిణామాలన్నిటి నేపథ్యంలో సెప్టెంబర్‌ మాసం కాంగ్రెస్‌ పార్టీ పాలిట సంక్షోభ మాసం అవుతుందా? సామరస్యంగా ముగుస్తుం దా అనేది చూడాల్సి ఉందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు కొందరు అభిప్రాయపడ్డారు.

అధిష్ఠానం చెప్పిందే చెప్పా - పురంధేశ్వరి
D.Purandhareswar
ఓదార్పు యాత్రపై వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్పలేదు, రాష్ట్ర నేతలందరి సమక్షంలో అహ్మద్‌ పటేల్‌ ఏం మాట్లాడారో అదే మీడియాకు చెప్పా.

రోశయ్య సర్కారుపై కుట్ర - జి. వెంకటస్వామి
venkataswami
రోశయ్య ప్రభుత్వాన్ని కూల్చడానికి ఒక వర్గం కుట్ర పన్నుతున్నది. సీడబ్యూసీలో సభ్యుడినైనందున కుట్ర దారుల పేర్లు వెల్లడించలేను

రాకపోతే ప్రతిఘటన తప్పదు - మేకపాటి
mekapatichandra
ఓదార్పునకు రాకపోతే జనం నుంచి తీవ్ర ప్రతిఘట నలను నేతలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రాష్ట్రానికి జగన్‌లాంటి నేత కావాలి.

విషం చిమ్ముతున్న నేతలు - కొండా సురేఖ
sureka
జగన్‌పై కాంగ్రెస్‌ పార్టీలోనే కుట్ర జరుగుతున్నది. ఓదార్పుయాత్రపై మాట్లాడే అర్హత దగ్గుబాటి దంపతులకు ఏమాత్రం లేదు.

ఓదార్పు ఎంత లాభం ?

jagan-sir
తమను కలుసుకునేందుకు వచ్చిన వారితో ఓదార్పు యాత్రకువెళ్ళొద్దని చెప్పటమే తప్ప అధికారికంగా కాంగ్రెస్‌ అధిష్ఠానం ఏ ప్రకటనా చేయని నేపథ్యం లో కడప ఎంపీ వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి సోమ, మంగళవారాలలో మరోసారి ఓదార్పు యాత్రకు సిద్ధమయ్యారు. దశాబ్దాల తరబడి తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలిన కడప జిల్లాలో, అందులోనూ ఆయన ఎంతో ఇష్టపడే పులివెందుల శాసనసభా స్థానం నుంచి ఈ యాత్ర మొదలు కావటం ప్రస్తుత రాజకీయ వాతావరణంలో ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్నది.

ఓదార్పు యాత్రకు ఎవరూ వెళ్ళటానికి వీలు లేదని హై కమాండ్‌ కరాఖండిగా తేల్చి చెప్పినట్టు కేంద్ర మంత్రులు పురంధ్రీశ్వరి, పనబాక లక్ష్మి, మరి కొందరు సీనియర్‌ నేతలు బాహాటంగా ప్రకటనలు చేయటం, యాత్రలో పాల్గొనవద్దని అధినేత్రి సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్‌ పటేల్‌ తనకు చెప్పినట్టు ముఖ్యమంత్రి రోశయ్య అందరితో చెబుతున్న నేపథ్యంలో జగన్‌ వాటిని గమనంలోకి తీసుకోకుండా, ఏమాత్రం ఖాతరు చేయకుండా మరోసారి ఓదార్పు యాత్రకు సిద్ధమయ్యారు. దీని పర్యవసానాల మాట ఎలా ఉన్నా స్వంత జిల్లాలో తన సత్తా ఏమిటో హై కమాం డ్‌కు చూపాలన్న జగన్‌ ఆరాటం స్పష్టంగా బయటపడుతున్నది.

లాభ నష్టాల బేరీజు?
రెండు రోజుల ఓదార్పు యాత్ర విజయవంతం అవుతుందా లేదా అనే సందేహం జగన్‌కు లేదు. అయితే సమీప భవిష్యత్తులో తాను రాజకీయంగా వేయబోయే అడుగులకు సానుకూల వాతావరణం స్వంత జిల్లాలో ఉందా లేదా అనే బేరీజు వేసుకోవ టానికే ఆయన ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. తన యాత్రకు జనం మద్దతు ఉందని, ఎమ్మెల్యేలు వచ్చినా రాకపోయినా భవిష్యత్తులో పార్టీకి అండగా ఉండేది ప్రజలే కాబట్టి వారి కోరిక మేరకే యాత్ర జరుపుతున్నానని అధిష్ఠానానికి మరోసారి జగన్‌ గుర్తు చేయదలచుకున్నారు. అదే సమయంలో భవిష్యత్తులో తనకు ఈ యాత్ర ఏమేర మేలు చేయగలదో బేరీజు సైతం వేసుకోనున్నారు.

అధికారంలో ఉండగా రాజశేఖరరెడ్డి జిల్లాకు అందులోనూ పులివెందుల నియోజకవర్గానికి చేసిన మేలు అక్కడి ప్రజలు అంత సులభంగా మరచిపోరు. ఇడుపులపాయలో ఆర్‌జెయు గేట్‌ ఏర్పాటు చేయించి విద్యాపరంగా, బ్రహ్మాండమైన రహదారులకు నిధుల కేటాయింపు, సాగు, తాగునీటి రంగానికి ప్రాధాన్యం...ఇలా జిల్లాకు తన శక్తి మేరకు ఏమేమి చేయాలో అన్ని ప్రయోజనాలనూ వైఎస్‌ సమకూర్చారు. ఫలితంగా ఆయన అన్నా, జగన్మోహన్‌రెడ్డి అన్నా జిల్లా ప్రజానీకానికి అభిమానం ఉండటం సహజమే. అయితే ఈ అభిమానం జగన్‌ వేరు కుంపటి పెట్టుకున్నా కొనసాగుతుందా లేక అది కాంగ్రెస్‌ పార్టీ వైపు బదిలీ అవుతుందా అనేదే ఇప్పుడు ప్రశ్న. వచ్చేనెలలో ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో సుదీర్ఘంగా ఓదార్పు యాత్ర జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న జగన్‌కు స్వంత జిల్లాలో ఎదురయ్యే అనుభవం పైనే తర్వాతి యాత్రల పరిస్థితి అంచనా వేయ వచ్చునని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

వద్దంటున్నది ముగ్గురే...
జిల్లాలో 10 మంది ఎమ్మెల్యేలు ఉండగా ఒకరు (ప్రొద్దుటూరు ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి-టీడీపీ) మినహా మిగిలిన వారంతా కాంగ్రెస్‌ వారే. అయితే ప్రాథమిక విద్య, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అహ్మదుల్లా సయ్యద్‌ (కడప), డీఎల్‌ రవీంద్రరెడ్డి (మైదుకూరు), జి.వీరశివారెడ్డి (కమలాపురం) తప్ప మిగిలిన ఆరుగురూ వైఎస్‌ వీరాభిమానులే...వైఎస్‌ స్థానంలో ఎన్నికైన జగన్‌ తల్లిగారు విజయమ్మ, కె.శ్రీనివాసులు (కోడూరు), జి.శ్రీకాంత్‌రెడ్డి (రాయచోటి), ఆదినారాయణరెడ్డి (జమ్మల మడుగు), అమరనాథరెడ్డి (రాజంపేట), కమలమ్మ (బద్వేలు) ఓదార్పు యాత్రకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారు.

ప్రొద్దుటూరు నియోజకవర్గంలో గత ఎన్నికల్లో ఓటమిపాలైన వరదరాజులు రెడ్డి లాంటి సీనియర్లు యాత్రకు దూరంగా ఉంటారన్న వార్తలు వస్తున్నాయి. వైఎస్‌ జీవించి ఉన్నంత దాకా ఆయనకు తిరుగు లేదు కాబట్టి జిల్లాలో పలువురు సీనియర్‌ నేతలు ఆయనకు అండగా ఉన్నారు. డీఎల్‌ లాంటి వారు అలాంటి వారే. ఇప్పుడు ఆయన లేకపోవటంతో డీఎల్‌, వీరశివ లాంటి వారు గళాలు పెంచారు. ఈ నేపథ్యంలో జగన్‌ నిర్వహించ తలపెట్టిన స్వంత జిల్లా ఓదార్పు యాత్ర రాజకీయంగా ప్రాధాన్యం సంతరించు కోవటంతో పాటు సమీప భవిష్యత్తులో ఆయన అనుసరించ బోయే వ్యూహాలకు సైతం నాందిగా నిలవనున్నది.

పులి జూదం.. క్లైమాక్స్ దిశగా యాక్షన్ సీన్ సొంత గడ్డ పులివెందులలో సోమ, మంగళవారాల్లో జగన్ పర్యటన

12 కుటుంబాలకు ఓదార్పు
ప్రకాశం యాత్రకు ముందు బల ప్రదర్శన
ఇది 'సెమీఫైనల్' అంటున్న నేతలు
సన్నిహితులతో జగన్ మంతనాలు
ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచే వ్యూహం
నిశితంగా గమనిస్తున్న అధిష్ఠానం
గీత దాటే వారిపై వేటు ఖాయం!
ఈటెల్లాంటి మాటల వేట కొనసాగుతుండగానే, అసలు ఆటకు తెర లేస్తోంది. క్లైమాక్స్ దిశగా యాక్షన్ సీన్ మొదలవుతోంది. అధిష్ఠానం ఆదేశాలను తోసిరాజంటూ, హెచ్చరికలను బేఖాతరు చేస్తూ కడప ఎంపీ జగన్, ఓదార్పు యాత్రతో ముందుకు వెళ్లడానికే నిర్ణయించుకున్నారు. ఓదార్పును పార్టీపరంగా చేయాలన్న హైకమాండ్ హితబోధను ఏమాత్రం పట్టించుకోకుండా ఆయన వ్యక్తిగతంగానే యాత్రకు వెళ్లబోతున్నారు.

స్వస్థలమైన కడప జిల్లాలో, కంచుకోట వంటి పులివెందులలో సోమ, మంగళవారాల్లో జగన్ పర్యటించబోతున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన 12 మంది కుటుంబాలను ఆయన ఈ సందర్భంగా ఓదారుస్తారు. ఓదార్పునకు సంబంధించిన కార్యాచరణపై జగన్ ఆదివారం పలువురు నేతలతో చర్చించారని ఆయన సన్నిహిత వర్గాలు చెప్పాయి. వైఎస్ వర్ధంతి మరుసటి రోజు నుంచి ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్రను ఎట్టి పరిస్థితుల్లోనూ చేపట్టి తీరాలని ఈ సందర్భంగా నిర్ణయించినట్టు తెలిసింది.

తూర్పు గోదావరి జిల్లాలో ఓదార్పు ముగిశాక, సంధి-సయోధ్య కోసం జరిగిన పలు యత్నాలు విఫలమైన నేపథ్యంలో... దశాబ్దాలుగా తమ కుటుంబాన్ని ఆదరిస్తున్న కడప జిల్లాలో పర్యటన తలపెట్టడం ద్వారా జగన్, అధిష్ఠానానికి నేరుగా సవాలు విసురుతున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో చేపట్టే యాత్రకు ముందే, సొంత జిల్లాలో సత్తా చాటడం జగన్ లక్ష్యమని వారు విశ్లేషిస్తున్నారు. కడప జిల్లాలో జగన్ యాత్రను 'సెమీ ఫైనల్'గా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇక 'ఫైనల్'కు చేరుకునే దాకా... అం టే ప్రకాశం యాత్ర చేపట్టే సెప్టెంబర్ 3 దాకా అధిష్ఠానం ఆగుతుందా? లేక ఆ లోగానే చర్యలు తీసుకుంటుందా? అన్నది అసలు ప్రశ్న. పార్టీ శ్రేణుల్లో ఇప్పుడు దీనిపైనే జోరుగా చర్చ సాగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓదార్పు యాత్రకు వెళ్లవద్దని స్పష్టం చేసిన సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ, ఏకంగా 'జగన్ పార్టీలో ఉంటే ఎంత? పోతే ఎంత?' అని వ్యాఖ్యానించడంతో, గీత దాటితే జగన్‌పై క్రమశిక్షణ చర్య తప్పదని స్పష్టమైంది. అయితే అది ఎప్పుడు? ఎవరు ముందుగా అడుగు ముందుకు వేస్తారు? అన్నవే ఇప్పుడు కీలక ప్రశ్నలు.

వ్యూహ ప్రతివ్యూహాలు
ఆఖరి అంకానికి సమయం సమీపిస్తుండడంతో, రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం కూడా అదే స్థాయిలో తీవ్రమవుతోంది. పురందేశ్వరి, పనబాక లక్ష్మి, కేశవరావు, హర్షకుమార్, సర్వే సత్యనారాయణ, మధుయాష్కీ వంటి వారు ఒకవైపు మోహరించగా, అంబటి రాంబాబు, వైఎస్ వివేకానందరెడ్డి, సబ్బం హరి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కొండా సురేఖ, పుల్లా పద్మావతి వంటివారు మరోవైపు మోహరించారు.

స్థూలంగా చూస్తే, ఇప్పుడు పార్టీలో హైకమాండ్ వర్గం, జగన్ వర్గం అనే రెండు గ్రూపులు, వాటి మధ్య విభజన రేఖ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వ్యక్తుల కంటే పార్టీ ప్రధానమని అధిష్ఠానం చెబుతున్నప్పటికీ, వైఎస్ తనయుడిగా ప్రజల్లో కరిష్మా ఉ న్న జగన్ వెంట వెళ్లేందుకే తాము మొగ్గు చూపుతామని ఆయన వర్గం చెబుతోంది. పలువురు ప్రజా ప్రతినిధులు, ముఖ్యంగా శాసనసభ్యులు మాత్రం అధిష్ఠానం మాటను శిరసావహిస్తామని స్పష్టంచేస్తున్నారు.

దీంతో వారిని దారిలోకి తెచ్చుకునేందుకు జగ న్ వర్గం ఒత్తిడిని పెంచుతోంది. ఈ వర్గానికి చెందిన వారు గత 2 రోజులుగా కేంద్ర మంత్రులు పనబాక లక్ష్మి, దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్మెల్యేలు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఉగ్ర నరసింహారెడ్డిల దిష్టిబొమ్మలు దహనం చేస్తున్నారు. "వైఎస్ వల్లే అసెంబ్లీకి ఎన్నికైనందున, శాసనసభ్యులు ఓదార్పు యాత్రలో పాల్గొనాలని ఈ ప్రాంత ప్రజలు అడుగుతున్నారు'' అని వైఎస్ కుటుంబానికి సన్నిహితుడైన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు.

ప్రజా ప్ర తినిధుల్లో అత్యధికులు అధిష్ఠానం బాట పట్టడంతో, జగన్ వర్గం, జిల్లాల వారీగా కింది స్థాయి నాయకులతో మాటా మంతీ జరుపుతోంది. పంచాయతీల్లోనూ, మునిసిపాలిటీల్లోనూ, పార్టీ సమావేశాల్లోనూ ఓదార్పు యాత్రకు అనుకూలంగా తీర్మానాలు చేయిం చి ఒత్తిడి పెంచే వ్యూహాన్ని అమలు చేస్తోంది. దీన్ని గమనించిన ప్రజా ప్రతినిధులు కూడా ఓదార్పును అధిష్ఠానం ఏ మాత్రం వద్దన లేదని, జిల్లా కేంద్రంలో బాధితులతో కలిపి పార్టీ పరంగా చేయాలని చెబుతోందని, అయితే జగన్ అందుకు అంగీకరించడం లేదని కార్యకర్తలకు వివరిస్తున్నారు.

మరోవైపు 'తిరుమలలో అక్రమాలు- తనపై ఆరోపణల'కు నిరసనగా నిరాహార దీక్ష చేపట్టిన టీటీడీ పాలకమండలి మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డికి జగన్ వర్గీయులు సంఘీభావం ప్రకటిస్తున్నారు. సెప్టెంబర్ 2న తిరుపతిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన నేపథ్యం లో ఇప్పటి నుంచే వేడి రాజేస్తున్నారు. యాత్ర జరిగే ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యే కొండా సురేఖ పర్యటిస్తూ, దగ్గుబాటి దంపతులపై విమర్శనాస్త్రాలు గుప్పిస్తూ, కాక పుట్టిస్తున్నారు.

రాష్ట్రంలో పరిణామాలను నిశితంగా గమనిస్తున్న అధిష్ఠానం, కట్టుదాటిన వారిపై క్రమశిక్షణ వేటు వేసేందుకే సిద్ధమవుతున్నట్టు సీనియర్ నేతలు చెబుతున్నారు. రెండు వర్గాలూ దేనికవి పట్టిన పట్టు వీడకుండా, ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతుండడంతో, ఈ నెలాఖరులో, సెప్టెంబర్ తొలి వారంలో కాంగ్రెస్ రాజకీయాల్లో పెను మార్పులు తప్పవని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీలో జగన్ ఉంటే ఎంత? పోతే ఎంత? జగన్‌ను బుజ్జగించం ఓదార్పు వద్దే వద్దు కోల్‌కతాలో ప్రణబ్ స్పష్టీకరణ

జగన్ వర్గం ఒత్తిడి రాజకీయం
ఎమ్మెల్యేలపై కార్యకర్తలే అస్త్రాలు
ద్వితీయ శ్రేణితోనే ముందుకు
అధిష్ఠానానికి సవాల్
భూమన దీక్షకు మద్దతు
  ఓదార్పుపై జగన్ వర్గం వాదనలు, వేదనలు వినే మూడ్‌లో అధిష్ఠానం లేదని మరోమారు స్పష్టమైంది. ఓదార్పు వద్దని జగన్‌తో ఆంతరంగికంగా చెప్పిన కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ తన సొంత రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్ బహిరంగంగానే ఈ విషయం స్పష్టం చేశారు.

పైగా... జగన్ పార్టీలో ఉంటే ఎంత, పోతే ఎంత అని వ్యాఖ్యానించారు. శనివారం కోల్‌కతాలో బెంగాలీ విలేఖరులతో ప్రణబ్ మాట్లాడారు. "ఓదార్పు యాత్ర వద్దని జగన్‌కు స్పష్టంగా చెప్పాం. ఒక వ్యక్తి గురించి ఇంతగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనను బుజ్జగించే ప్రసక్తే లేదు. జగన్ పార్టీలో ఉంటే ఎంత? లేకపోతే ఎంత?'' అని ప్రణబ్ వ్యాఖ్యానించారు. ఆయన తన వైఖరిని స్పష్టం చేయడం ఇదే మొదటిసారి కాదు.

జగన్ ఓదార్పు యాత్ర చేపట్టడం పార్టీని ధిక్కరించినట్లు భావిస్తున్నామని రెండు నెలల క్రితమే ప్రణబ్ బెంగళూరులో విలేకరులతో అన్నారు. ఆయనపై చర్య తీసుకుంటామని కూడా సంకేతాలు పంపారు. తాజాగా ప్రణబ్‌తో జగన్ చర్చలు జరిపిన నేపథ్యంలో అధిష్ఠానం వైఖరి మారుతుందేమో అని ఆయన సన్నిహిత వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. అయితే... ఈ ఆశ అడియాసే అని ప్రణబ్ ముఖర్జీ తాజా స్పందనతో స్పష్టమైంది.

అధిష్ఠానానికి సవాల్
ఓదార్పు పట్ల అధిష్ఠానం వైఖరి స్పష్టం కావడంతో... ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలలో ప్రస్తుతానికి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మరో ఎమ్మెల్యే శివప్రసాదరెడ్డి మాత్రమే యాత్రలో పాల్గొనేందుకు సన్నద్ధమయ్యారు. జగన్ తన యాత్రపై అధిష్ఠానం వైఖరి గురించి కొన్ని విషయాలు దాచారని స్పష్టం కావడంతో... రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆలోచనా ధోరణి కూడా మారింది.

జగన్ హైదరాబాద్‌లో బస చేసినప్పుడు ఆయనను కలిసేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు ఉత్సుకత చూపే వారు. కానీ, శనివారం జగన్‌ను మంత్రి బాలినేనితోపాటు ఎమ్మెల్యేలు ఆళ్ల నాని, కమలమ్మ, శ్రీకాంత్‌రెడ్డి, అమర్నాథ రెడ్డి మాత్రమే కలవడం గమనార్హం. యాత్రపై బాలినేని, జగన్‌లు గంటకు పైగా చర్చించుకున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలు, ఎంపీలు వెంట వచ్చే అవకాశాల్లేకపోవడంతో ద్వితీయ స్థాయి నేతలను భాగస్వాములను చేయాలనే నిర్ణయానికి వచ్చారు.

ఎమ్మెల్యేలు, ఎంపీలు వచ్చినా రాకున్నా యాత్రను విజయవంతం చేయాలని జగన్ వర్గీయులు తీర్మానించారు. ఇదే సమయంలో కిందిస్థాయి కార్యకర్తల ద్వారా ఎమ్మెల్యేలపై ఒత్తిడి చేయించే వ్యూహాన్ని మరింత చురుగ్గా అమలు చేయాలని జగన్ వర్గం నిర్ణయించినట్లు తెలిసింది. యాత్రలో పాల్గొనాల్సిందేనని డిమాండ్ చేయడం, దూరంగా ఉండే ఎమ్మెల్యేల దిష్టిబొమ్మలు దహనం చేయడం, ఆ నాయకులను ఘెరావ్ చేయడం వంటి చర్యలకు దిగాలని భావిస్తున్నారు.

యాత్రలో పాల్గొనరాదని భావిస్తున్న ఎమ్మెల్యేలకు 'మేం నియోజకవర్గ ప్రజలం' అంటూ ఇప్పటికే భారీగా ఫోన్లు వస్తున్నాయి. ఏదిఏమైనా ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్రను విజయవంతం చేసి అధిష్ఠానానికి ఒక సవాల్ విసరాలనే కృత నిశ్చయం జగన్ వర్గంలో కనిపిస్తోంది. పార్టీకే తమ అవసరం ఉందనే సంకేతాలు పంపేందుకు జగన్ వర్గం కార్యాచరణను రూపొందిస్తోంది.

సబ్బం హరి ఆశాభావం అనకాపల్లి ఎంపీ సబ్బం హరి ఇప్పటికీ ఓదార్పు యాత్ర విషయంలో అధిష్ఠానం వైఖరిని మార్చగలమని నమ్మకం వ్యక్తం చేయడంపై పరిశీలకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. "తన యాత్రలో రాజకీయాలు లేవని, అందులో రాజకీయాలు చూడరాదని జగన్ పదే పదే అందర్నీ అభ్యర్థిస్తున్నారు. జగన్‌పై కక్షతో కొందరు శక్తులు చేస్తున్న కుట్ర వల్లే అధిష్ఠానానికీ, ఆయనకూ మధ్య అగాధం పెరిగిందనే ప్రచారం జరుగుతోంది.

జగన్‌కు కానీ, మాకు కానీ సోనియాను ధిక్కరించే ఆలోచనే లేదు'' అని సబ్బం హరి ఢిల్లీలో విలేకరులతో అన్నారు. ఒక్క ఓదార్పు యాత్ర విషయంలోనే తన కోణాన్ని అర్థం చేసుకోవాలని కోరుతున్నామన్నారు. మొయిలీ విందు ఏర్పా టు చేయడం, జగన్‌ను ప్రణబ్ రెండుసార్లు కలుసుకోవడం మంచి పరిణామాలలో భాగమని సబ్బం హరి తెలిపారు.

"అధిష్ఠానం మాతో కూడా మాట్లాడుతుంటుంది. అయితే... మేము మైకులకు ఎక్కి ఆ విషయాలను బయటికి చెప్పం'' అంటూ పరోక్షంగా దగ్గుబాటి దంపతులను విమర్శించారు. ఓదార్పు యాత్రకు వెళ్లవద్దని అధిష్ఠానం ఎవరికైనా చెప్పడంలో ఆశ్చర్యం లేదని, నిజానికి జగనే ఎవరూ తమ పనులు మానుకుని యాత్రకు రావద్దని విజ్ఞప్తి చేశారని సబ్బం హరి గుర్తు చేశారు. ఏ అంశాన్నైనా సానుకూల మనసుతో అర్థం చేసుకుంటే సానుకూలంగానే అర్థమవుతుందని అ న్నారు.

ఓదార్పు యాత్ర రాష్ట్రమంతటా జరుగుతుందని... దానిని అధిష్ఠానానికి వ్యతిరేకంగా భావించనవసరం లేదన్నారు. "కాంగ్రెస్‌కు, సీఎంకు వ్యతిరేకంగా జగన్ ఒక్క మాటైనా మాట్లాడారా? మాట్లాడితే బయటపెట్టండి'' అని సవాల్ విసిరారు. మొయిలీ, అహ్మద్ పటేల్, ప్రణబ్ తమతో కూడా మాట్లాడుతున్నారని అన్నారు. ఓదార్పు యాత్ర వద్దని అధిష్ఠానం చెబుతున్నట్లు వస్తున్న ఊహాగానాలకు తాము జవాబిచ్చే ప్రసక్తే లేదన్నారు. జగన్ యాత్ర వల్ల కాంగ్రెస్ పార్టీయే బలపడుతుందని సబ్బం హరి తెలిపారు.
వేడెక్కుతున్న రాజకీయం
'ఓదార్పు' యాత్ర సమీపించే కొద్దీ రాష్ట్ర రాజకీయం వేడెక్కుతోంది. అవకాశం దొరకడమే ఆలస్యమన్నట్లుగా 'వైరి వర్గాలు' కత్తులు దూసుకుంటున్నాయి. యాత్రలో పాల్గొనాల్సిందిగా ఒత్తిడి రాజకీయం కొనసాగుతోంది. ఇది మున్ముందు మరింత ఉధృతం కానుంది. శనివారం అనంతపురం జిల్లాలో మంత్రి రఘువీరారెడ్డిని కార్యకర్తలు నిలదీశారు.

ఓదార్పుపై వైఖరేమిటో చెప్పాలంటూ ఆయనను ప్రశ్నించారు. అటు... ప్రకాశం జిల్లాలో దగ్గుబాటి దంపతులు, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి దిష్టిబొమ్మల దహనం రెండోరోజూ కొనసాగింది. ఓదార్పును అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే తగిన బుద్ధి చెబుతామంటూ కార్యకర్తలు హెచ్చరించారు. టీటీడీలో అక్రమాలకు పాల్పడినట్లుగా తనపై వచ్చిన ఆరోపణలపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ తిరుపతిలో భూమన కరుణాకరరెడ్డి చేపట్టిన దీక్ష రాజకీయ రంగు పులుముకుంటోంది.

జగన్ వర్గీయులు ఒక్కొక్కరుగా వచ్చి దీక్షకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. శనివారం అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి, ఎమ్మెల్యేలు అమర్‌నాథ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి నిరశన శిబిరాన్ని సందర్శించారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి వైఎస్ కుటుంబానికి తన పూర్తి విధేయత ప్రకటించారు.

Saturday, August 21, 2010

తెగతెంపులే !

pranab 
కాంగ్రెస్‌తో తెగ తెంపులు చేసుకునేందుకు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి సిద్ధమయ్యారు. ఏ నెపం పెట్టి పార్టీ నుంచి బయటకు రావాలో మార్గాలు అన్వేషిస్తున్నారు. ఓదార్పు యాత్ర వద్దన్నందుకే పార్టీ నుంచి బయటకు వస్తే అలిగి వెళ్ళిపోయారన్న మాట వస్తుందని, అంతకు మించిన బలమైన కార ణాన్ని చూపిస్తూ, ఇటు ముఖ్యమంత్రి రోశ య్యను, అటు అధిష్ఠానాన్ని టార్గెట్‌ చేసి పదు నైన, పరుషమైన పదజాలంతో మాట్లాడిన తర్వాత ఇక మూటా ముల్లె సర్దుకోవాలని జగన్‌ ఆలోచిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. అటుఅధిష్ఠానం సైతం పోతే పోనీ అనే రీతిలో వ్యవహరి స్తున్నది.
పార్టీలో సోనియా తర్వాత అంతటి స్థానంలో ఉన్న కేంద్ర ఆర్థికమంత్రి ప్రణబ్‌ ముఖర్జీ శనివారం కోల్‌కతాలో మాట్లా డుతూ జగన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయటం, పార్టీనుంచి పోతే పోనీ అని స్పష్టంగా ప్రకటిం చటంతో జగన్‌ తెగతెంపుల దిశగానే ఆలోచిస్తు న్నారనటానికి సూచన. తన ఓదార్పు యాత్ర పార్టీకి వ్యతిరేకం కాదని, తిరుగుబాటుఅంతకన్న కాదని, ఇందులో రాజకీయాలేవీ లేవని ఎంత చెబుతున్నా అధిష్ఠానం ఆ మాటే పట్టించుకోకుండా యాత్రపై ఆంక్షలు విధిం చటం, ఎమ్మెల్యేలు, ఎంపీలకు హుకుం జారీ చేయటం వంటి చర్యలు తీసుకుంటుండటంతో ఇక తాను ఇమిడే అవకాశం కనిపించటం లేదని, పొమ్మనక ముందే దుమ్మెత్తిపోసి వెళ్ళిపోతే తర్వాత సంగతి చూసుకోవచ్చునని జగన్‌ తన ఆంతరంగికులతో తరచుగా చెబుతున్నట్టు సమాచారం.

వచ్చేనెల రెండున దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రథమ వర్ధంతిని తన తెగతెంపుల వ్యూహానికి ముహూర్తంగా జగన్‌ నిర్ణయించే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ మాట నిజమే అన్నట్టుగా జగన్‌ విధేయులు అంబటి రాంబాబు లాంటి వారు ఓదార్పుయాత్రకే జగన్‌ కట్టుబడి ఉన్నారని బల్లగుద్ది మరీ చెబుతు న్నారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తన ఉద్యోగం ఊడినా ఫరవాలేదన్న రీతిలో మాట్లాడుతూ ఓదార్పు యాత్రకు చురుకుగా ఏర్పాట్లు చేస్తున్నారు.

బాలినేనితో జోరుగా మంతనాలు...
తన పట్ల అధిష్ఠానం వైఖరి మారే అవకాశం లేదని, ప్రణబ్‌ ముఖర్జీ, వీరప్ప మొయిలీ లాంటివారిని కలసి దగ్గుబాటి దంపతులపైన ఫిర్యాదు చేసినప్పటికీ హై కమాండ్‌ తనవైపే వేలెత్తి చూపిస్తున్నదన్న నిర్ణయానికి వచ్చిన జగన్‌, తెగతెంపులు చేసుకుని తన ప్రయత్నాలు తాను చేసుకోవాలన్న ఆలోచనతో కనిపిస్తు న్నారు. అందుకోసం తనవారనుకున్న వారితో ఎడతెరిపి లేని మంతనాలు సాగిస్తున్నారు. శుక్రవారం ఢిల్లీలో ప్రణబ్‌ ముఖర్జీని రెండు సార్లు, మొయిలీని చివరి ఆశగా మరోసారి కలసిన తర్వాత జగన్‌ రాత్రికి హైదరాబాద్‌ చేరుకున్నారు. శనివారం మంత్రి, వైఎస్‌ బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి, మరి కొందరు నేతలు జగన్‌తో కలసి ఓదార్పు యాత్రపై మంతనాలు జరిపారు. అధిష్ఠానం అనుసరిస్తున్న వైఖరిపై సైతం ఈ చర్చల్లో ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది.

jagan-sirజగన్‌తో మంతనాలు జరిపిన తర్వాత బాలినేని మీడియాతో మాట్లాడుతూ ఓదార్పు యాత్ర జరిగి తీరుతుందని, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చెప్పటాన్ని బట్టి చూస్తే జగన్‌ ఎంత గట్టి నిర్ణయానికి వచ్చారో అర్థం అవుతుంది. బాలినేనితో పాటు మరి కొందరు నేతలు సైతం జగన్‌ను కలుసుకుని చర్చించారు. జగన్‌ పట్ల అధిష్ఠానానికి ఎలాంటి సానుకూలతా లేదని ఇటీవలే మరోసారి రుజువైంది. లోక్‌సభలో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ వెళ్తుండగా జగన్‌ తన స్థానం నుంచి లేచి అభివాదం చేసినా పట్టించుకోకుండా వెళ్ళిపోవటం ఇందుకు సంకేతం. సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్‌ పటేల్‌ ఓదార్పు యాత్ర విషయంలో మేడం తరఫున గట్టి ఆదేశాలు జారీ చేశారు. వీటన్నిటి నేపథ్యంలో పార్టీలో తాను ఇక ఇమిడే వాతావరణం లేదన్న నిర్ణయానికి జగన్‌ వచ్చినట్టు స్పష్టమవుతున్నది.

ప్రణబ్‌ ధమ్‌కీ...
ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలో జగన్‌ ఏ స్థాయికీ సరిపోరన్న నిర్ణయానికి అధిష్ఠానం వచ్చేసింది. యాత్రకు వెళ్ళరాదని ఆదేశాలు జారీ చేయటం తోనే ఆయనను సమర్థించిన వారు చల్లగా వెనక్కి తగ్గటమే అందుకు ఉదాహరణ అని హైకమాండ్‌ భావిస్తున్నది. జగన్‌ పట్ల అధిష్ఠానం పెద్దగా ఆలోచించటం లేదనటానికి ప్రణబ్‌ ముఖర్జీ శనివారం కోల్‌కతాలో చేసిన వ్యాఖ్యలే తాజా ఉదాహరణ. ఆయన ఏమన్నారంటే ‘ఓదార్పు యాత్రకు వెళ్ళవద్దని ఆయనకు స్పష్టంగా చెప్పాం...జగన్‌ పార్టీలో ఉంటే ఎంత? పోతే ఎంత?...ఒక వ్యక్తి గురించి ఇంతగా చెప్పాల్సినఅవసరం అధిష్ఠానా నికి లేదు...ఆయనను బుజ్జగించే ప్రసక్తే లేదు...’ అంటూ అధిష్ఠానం మదిలో ఏమున్న దో తేటతెల్లం చేశారు. ప్రణబ్‌ కానీ, అధిష్ఠానం నేతలు అహ్మద్‌ పటేల్‌ లాంటివారు కానీ ఇలా చెప్పటం ఇదే మొదటిసారి కాదు...గతంలోనూ ఓదార్పు యాత్ర విషయంలో తనను కలిసేందుకు వచ్చినప్పుడు సైతం ప్రణబ్‌ ఘాటుగానే మాట్లాడారు. బెంగళూరులో పత్రి కల వారితో కొద్దిరోజుల క్రితం మాట్లాడుతూ జగన్‌ ఇలాగే వ్యవహరిస్తే చర్యలు తీసుకునే అవ కాశాలు లేకపోలేదని కూడా సంకేతం ఇచ్చారు.

మాటల దాడికి మరింత పదను...
ప్రణబ్‌ వ్యాఖ్యలు అలా ఉంటే, అధిష్ఠానానికి, సోనియాగాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడుగా పేరు పొందిన రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావు సైతం మాటల దాడిని మరింత పెంచారు. ముఖ్యమంత్రి రోశయ్య సర్కారును కూల్చేందుకు గాలి జనార్దనరెడ్డిని, ఆయన సోదరులను రంగంలోకి దించి, వారితో కుమ్మక్కయి కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని వీహెచ్‌ శనివారం బాహాటంగా వ్యాఖ్యానించారు. జగన్‌ పేరును ప్రస్తావించకపోయినా ఆయన ఎవరిని ఉద్దేశించి విమర్శించిందీ అందరికీ సులభం గానే తెలిసిపోయింది.

దింపుడు కళ్ళం ఆశ...
ఒకవైపు అధిష్ఠానం ఇంత స్పష్టంగా సంకేతాలు ఇస్తుంటే, ఇక వారితో మాటలేమిటి? తెగతెంపులు చేసుకుందామని జగన్‌, ఆయన ఆంతరంగికులు భావిస్తుంటే...మరి కొందరు మాత్రం దింపుడు కళ్ళం ఆశలు వదులుకోవటం లేదు. అనకాపల్లి ఎంపీ సబ్బం హరి లాంటి వారు ఏదో ఒక మూల తమకు ఇంకా ఆశ మిగిలి ఉందన్నట్టు మాట్లాడుతున్నారు. జగన్‌ తలపెట్టిన యాత్రకు రాజకీయ రంగు పులమాల్సిన అవసరం లేదని సబ్బం మళ్ళీ మళ్ళీ చెబుతున్నారు.

కాంగ్రెస్‌ పార్టీపై కానీ, ముఖ్యమంత్రి రోశయ్యపై కానీ జగన్‌ ఒక్కసారైనా వ్యతిరేక వ్యాఖ్యలు చేశారా అని సవాల్‌ విసిరారు. జగన్‌పై రాజకీయ, వ్యక్తిగత కక్షలతో కొన్ని శక్తులు చేస్తున్న కుట్ర వల్లనే అధిష్ఠానానికీ, జగన్‌కూ మధ్య అగాథం పెరిగిందని వెనకేసుకు వచ్చే ప్రయత్నం చేశారు. ఓదార్పు యాత్ర వల్ల పార్టీకి మరింత బలం చేకూరుతుందని సబ్బం హరి పదే పదే చెప్పారు. మరోవైపు నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి సోదరుడు, ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి సైతం ఓదార్పుయాత్రను, జగన్‌ను సమర్థిస్తూ మాట్లాడారు.

డెడ్‌లైన్‌ సెప్టెంబర్‌ రెండు?...
తాను ఏమి చెప్పినా అధిష్ఠానం వినే ప్రసక్తి లేదని తేల్చుకున్న జగన్‌, ఇక తెగతెంపులు చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. తన తండ్రి ప్రథమ వర్ధంతి రోజున కానీ, ఆ తర్వాత ఏ క్షణంలో అయినా తెగతెంపుల ప్రకటన బహిర్గతమవుతుందని, ఆలోగా తన వెంట ఎవరెవరు వస్తారో చూసుకుని, రాని వారి నియోజకవర్గాలలో వారి ప్రత్యర్థులు, రెండవ శ్రేణి నేతలందరినీ తన వైపు తిప్పుకునే కార్యక్రమం పూర్తి అయిన తర్వాత కడపలో లేదా మరో ప్రాంతంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి తెగతెంపులు చేసుకుంటున్నట్టు ప్రకటిస్తారని విశ్వసనీయ సమాచారం. అటు అధిష్ఠానం మాత్రం ఈ అంశాలను పెద్దగా పట్టించుకోవటం లేదు.

ఒక వ్యక్తికి ఇంత ప్రాధాన్యం ఇస్తే ఇక పార్టీ మనుగడ కష్టతరమవుతుందని, ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచటమే మేలన్న ఆలోచనతో హై కమాండ్‌ ఉంది. జగన్‌ తెగతెంపులు చేసు కున్నా ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో రోశయ్య సర్కార్‌కు ముంచుకు వచ్చే ప్రమాదం ఏమీ లేదన్న ధీమా హైకమాండ్‌లో వ్యక్తం అవుతున్నది. ఒకవేళ ఏ కొందరు ఎమ్మెల్యేలో ఆయన వెంట వెళ్ళినా ఆదుకోవటానికి ప్రజా రాజ్యం పార్టీ, మజ్లిస్‌ తదితర పార్టీలు ఉండనే ఉన్నాయి కనుక పెద్ద ఇబ్బందేమీ ఎదురుకాదన్నది హై కమాండ్‌ ఆలోచన. ఒకవేళ జగన్‌ మరీ గణనీయ సంఖ్యలో ఎమ్మెల్యేలను చీల్చి మధ్యంతర ఎన్నికలకు మార్గం వేసే వ్యూహాన్ని అనుసరిస్తే దాన్ని కూడా ఎదుర్కునేందుకు లేదా రాష్టప్రతి పాలన విధించి, ఆరు మాసాల్లోగా మళ్ళీ పుంజుకుని ఎన్నికలకు వెళ్ళేందుకైనా వెనుకాడకూడదన్న ఆలోచనతో హై కమాండ్‌ ఉన్నట్టు చెబుతున్నారు.

జగన్ పార్టీలో ఉంటే ఉండవచ్చు... వెళితే వెళ్లవచ్చు... ఓదార్పుపై నిప్పులు చెరిగిన ప్రణబ్


ఓదార్పు యాత్ర తిరుగుబాటు కాదని, పార్టీకి వ్యతిరేకం కావని, ఇందులో రాజకీయాలు లేవని జగన్ కాంగ్రెస్ అధిష్ఠానానికి స్పష్టంగా చెబుతున్నప్పటికీ అధిష్ఠానం వినే మూడ్‌లో లేదని తేలిపోయింది. గత వారం సీనియర్ నాయకుడు ప్రణబ్ ముఖర్జీని కలిసిన జగన్ తన కోణాన్ని వివరించే ప్రయత్నం చేశారని ఆయన అస్మదీయులే చెబుతున్నారు. అయితే ప్రణబ్ మాత్రం ఓదార్పు యాత్రను మానుకొమ్మని జగన్‌కు స్పష్టంగా చెప్పారని కూడా తేలిపోయింది. శనివారం కోల్‌కటాలో ప్రణబ్ బెంగాలీ విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఓదార్పు యాత్ర వద్దని ఆయనకు స్పష్టంగా చెప్పామని వెల్లడించడం గమనార్హం. జగన్ పార్టీలో ఉంటే ఎంత? పోతే ఎంత? ఒక వ్యక్తి గురించి ఇంతగా చెప్పాల్సిన అవసరం లేదని, ఆయనను తాము బుజ్జగించే ప్రసక్తే లేదని చెప్పారు.

ప్రణబ్ తన వైఖరిని స్పష్టం చేయడం ఇది మొదటి సారి కూడా కాదు. రెండు నెలల క్రితమే జగన్ ఓదార్పు యాత్ర చేపట్టడం పార్టీని ధిక్కరించినట్లు భావిస్తున్నామని ప్రణబ్ బెంగళూర్‌లో విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. ఆయనపై చర్య తీసుకుంటామని కూడా సంకేతాలు ఇచ్చారు. తాజాగా జగన్ ప్రణబ్‌తో చర్చలు జలిగిననేపథ్యంలో అధిష్టానం వైఖరి ఏమైనా మారుతుందోనేమోనని ఆయన సన్నిహిత వర్గాలు ఆశాభావాన్ని వ్యక్తం చేశాయి. కాని ప్రకాశం ఎమ్మెల్యేలతో అహ్మద్ పటేల్ వ్యాఖ్యలు, సోనియా ఎంపిలకు స్వయంగా ఓదార్పు యాత్రకు వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేయడం, ప్రణబ్ కూడా కోల్‌కటాలో జగన్ వైఖరి పట్ల అసహనం వ్యక్తం చేయడంతో అధిష్టానం మనసు మార్చుకునే అవకాశమే లేదని మరింత స్పష్టమైనది.

అయినప్పటికీ అనకాపల్లి ఎంపి సబ్బం హరి ఇప్పటికీ ఓదార్పు యాత్ర విషయంలో అధిష్ఠానం వైఖరిని మార్చగలమన్న నమ్మకాన్ని వ్యక్తం చేయడంపై పరిశీలకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తన యాత్రలో రాజకీయాలు లేవని, అందులో రాజకీయాలు చూడరాదని జగన్ పదే పదే అందర్నీ అభ్యర్థిస్తున్నారని సబ్బం హరి శనివారం విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. జగన్ పై రాజకీయ, వ్యక్తిగత కక్షలతో కొందరు శక్తులు చేస్తున్న కుట్ర వల్లే అధిష్టానానికీ, ఆయనకూ మధ్య అగాధం పెరిగిందన్న ప్రచారం జరుగుతున్నదని సబ్బం హరి అన్నారు. నిజానికి జగన్‌కు కానీ, తమకు కానీ, అధిష్టానాన్ని, సోనియాను ధిక్కరించే ఆలోచనే లేదన్నారు. ఒక్క ఓదార్పు యాత్ర విషయంలోనే తన కోణాన్ని అర్థం చేసుకొమ్మని కోరుతున్నామని ఆయనచెప్పారు.

వీరప్ప మొయిలీ విందు ఏర్పాటు చేయడం, జగన్ ను ప్రణబ్ రెండుసార్లు కలుసుకోవడం మంచి పరిణామంలో భాగమని అన్నారు. అధిష్ఠానం తమతో కూడా మాట్లాడుతుంటుందని, అయితే తాము మైకులకెక్కి ఆ విషయాన్ని చెప్పుకోబోమనని ఆయన పరోక్షంగా దగ్గుబాటి దంపతులను విమర్శించారు. తమకూ బాధ్యతలు, పరిధులు ఉంటాయన్నారు. ఓదార్పు యాత్రకు వెళ్లవద్దని అధిష్టానం ఎవరికైనా చెప్పడంలో ఆశ్చర్యం లేదని, నిజానికి జగనే ఎవరూ తమ పనులు మానుకుని ఓదార్పు యాత్రకు రావద్దని ప్రజా ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారని సబ్బం హరి అన్నారు.

తన యాత్ర వ్యక్తిగతమని, ఎవరైనా తమంతట తాము వస్తే తనకు అభ్యంతరం లేదని చెప్పారని తెలిపారు. ఏ అంశాన్నైనా సానుకూల మనసుతో అర్థం చేసుకుంటే సానుకూలంగానే అర్థమవుతుందని, వ్యతిరేక కోణంతో ఆలోచిస్తే అంతా వ్యతిరేకంగానే కనపడుతుందని అన్నారు. ఓదార్పు యాత్ర రాష్ట్రమంతటా జరుగుతుందని దాన్ని అధిష్ఠానానికి వ్యతిరేకంగా ఎవరూ భావించనవసరంలేదని సబ్బం హరి అన్నారు.

కాంగ్రెస్ పార్టీకి కానీ, ముఖ్యమంత్రికి కానీ వ్యతిరేకంగా గానీ జగన్ ఒక్క మాటైనా మాట్లాడారా, మాట్లాడితే బయటపెట్టండి.. అని ఆయన సవాలు విసిరారు .మొయిలీ, అహ్మద్‌పటేల్, ప్రణబ్ తమతో కూడా మాట్లాడుతున్నారని అన్నారు. ఓదార్పు యాత్ర వద్దని అధిష్టానం చెబుతున్నట్లు వస్తున్న ఊహాగానాలకు తాము జవాబిచ్చే ప్రసక్తే లేదన్నారు. జగన్ యాత్ర వల్ల కాంగ్రెస్ పార్టీ యే బలపడుతుందని ఆయన అన్నారు.

ఓడలు బళ్ళు...

jagan3
కాలం కలసి రానప్పుడు ఓడలు బళ్ళు అవుతాయన్న సామెత కడప ఎంపీ వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పట్ల అక్షరాల నిజమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. మహబూబాబాద్‌లో ఓదార్పు యాత్ర అర్ధంతరంగా నిలిపివేసి, చాలాకాలానికి ఉభయ గోదావరి జిల్లాల్లో జగన్‌ ఆ యాత్రను ప్రారంభించినప్పుడు మొదట్లో ఎమ్మెల్యేలు ఎవరూ ఆసక్తి కనబరచకపోయినా వారి సమీప బంధువులు, అన్నదమ్ములు తదితరులు జగన్‌కు అండగా నిలిచారు. ఉదాహరణకు శ్రీకాకుళంలో ఎంపీ కిల్లి కృపా రాణి బంధువులు, మంత్రి ధర్మాన ప్రసాదరావు కుమారుడు లాంటివారు ఓదార్పుయాత్రలో బాహాటంగానే పాల్గొన్నారు. ఉభయ గోదావరి జిల్లాలకు వచ్చేసరికి మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ లాంటివారు అడుగడుగునా వెంట ఉన్నారు. యాత్ర ముగింపు సందర్భంగా కాకినాడలో జరిగిన బిహ రంగ సభకు దాదాపు 25 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు, ఇద్దరు మంత్రులూ హాజరయ్యారు.

మారిన సీన్‌...
ఇప్పుడు వాతావరణం, పరిస్థితీ మారిపోయాయి. ఓదార్పు యాత్రకు అనుమతి లేదని, ఎవరూ వెళ్ళకూడదని ఎప్పుడైతే అధిష్ఠానం కరాఖండిగా చెప్పేసిందో ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు కిక్కురుమనకుండా మౌనం వహించారు. కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి లాంటి వారు తాము యాత్రకు వెళ్ళటం లేదని బహిరంగంగానే చెప్పేశారు. జగన్‌ బంధువు, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే శివప్రసాదరెడ్డి మినహా ఓదార్పు యాత్రలో పాల్గొం టామని ఇప్పటిదాకా ఎవరూ బాహాటంగా ప్రకటించలేదు.

నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇప్పటికైతే యాత్రలో పాల్గొంటానని చెప్పినా, తనకు అధిష్ఠానం నుంచి స్పష్టమైన ఆదేశాలంటూ ఏవీ రాలేదని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మరోవైపు కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసిం హారెడ్డి శుక్రవారం నియోజకవర్గ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి అభిప్రాయం అడిగినప్పుడు యాత్రకు వెళ్ళా ల్సిందే అని అందరూ చెప్పినట్టు వార్తలు వచ్చాయి. దాన్ని మొదట్లో ఉగ్రనరసింహారెడ్డి అంగీకరించినా, ఆ తర్వాత మాట మార్చి ఈ నెల 24 తర్వాత కానీ ఏ విషయం చెప్ప బోనని స్పష్టం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజ శేఖరరెడ్డికి సన్నిహితులుగా పేరున్న సీనియర్‌ మంత్రులు గాదె వెంకటరెడ్డి, శిల్పా మోహన్‌రెడ్డి లాంటి వారు అధిష్ఠానం సూచన మేరకే నడుచుకుంటే బాగుంటుందని హిత వాక్యా లు పలుకుతున్నారు.

దగ్గుబాటి దంపతుల లాబీయింగ్‌?...
మరోవైపు ఢిల్లీలో కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధ్రీశ్వరి, ఆమె భర్త, ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఓదార్పు యాత్రకు, ప్రత్యేకించి వైఎస్‌జగన్‌కు వ్యతిరేకంగా భారీ ఎత్తున లాబీయింగ్‌ జరుపుతున్నట్టు వార్త లు తెలుపుతున్నా యి. జగన్‌కుతాము అందించిన నోట్‌ను పత్రికలు లీక్‌ చేద్దా మని దగ్గుబాటి చెప్పినప్పుడు తాను తీవ్రంగా వ్యతిరేకించా నని ప్రకాశం జిల్లా ఎమ్మెల్యే, వైఎస్‌ సన్నిహితుడు మహీధర రెడ్డి బహిరంగంగానే చెప్పేశారు. తనకు అడ్డం తగులుతున్న దగ్గుబాటి దంపతులపై జగన్‌ కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీకి ఒకటికి రెండుసార్లు ఫిర్యాదు చేయటం విశేషం. తనకు వ్యతిరేకంగా ఈ స్థాయి ప్రయత్నాలు జరగటాన్ని జగన్‌ జీర్ణించుకోలేకపోతున్నారనటానికి ఈ ఫిర్యాదు అద్దం పడుతుంది.

ఈ నేపథ్యంలో జగన్‌ పరిస్థితి ఒక అడుగు ముందుకు, ఆరడుగులు వెనక్కు చందంగా తయారైంది. ఏకంగా అధిష్ఠానమే తనకు రెడ్‌ సిగ్నల్‌ ఇచ్చినప్పుడు ఏమి చేయాలో తెలియక కొట్టుమిట్టాడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఒకరిద్దరు మద్దతుదారులు గట్టిగా తనను సమర్థించినా, పార్టీలో మెజారిటీ నేతలు అధిష్ఠానం మాటే తమ మాట అంటుండటం, అందులోనూ నిన్న మొన్నటిదాకా తానే ముఖ్యమంత్రి కావాలని సంతకాలు పెట్టిన వారు సైతం ఇప్పు డు తనకే హితోక్తులు నూరి పోసే ప్రయత్నాలు చేస్తుండటం జగన్‌కు ఏమాత్రం మింగుడు పడటం లేదు

రాజకీయ రణరంగం హోరా... హోరీ

 jagan roshiah
రాష్ట్ర కాంగ్రెస్‌లో రెండు శిబిరాల మధ్య దాడి... ఎదురు దాడి జరుగుతోంది. ప్రత్యేకించి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి కుమారుడు, కడప ఎంపి జగన్మోహన్‌రెడ్డి నిర్వహి స్తున్న ఓదార్పు యాత్ర ఈ రెండు శిబిరాల మధ్య యుద్ధ వాతావర ణానికి నాంది పలుకుతోంది. పార్టీ నేతలు జగన్‌ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా చీలిపోరుు పోరు తీవ్రతరం చేశారు. పార్టీ అధిష్ఠానాన్నే లెక్క చేయని రీతిలో జగన్‌ వర్గం వ్యవహరిస్తుండగా, హైకమాండ్గ ఆదేశాలే మాకు శిరోధార్యమంటూ జగనే టార్గెట్‌గా వ్యతిరేక వర్గం ఎదురు దాడికి దిగు తున్నది. ఓదార్పు యాత్రే కాంగ్రెస్‌లో కల్లోలానికి దారి తీస్తున్నది. పార్టీ శ్రేణుల్లో అంతా అయోమయ పరిస్థితి నెలకొంది.

jaganఓదార్పు యాత్రపై కాంగ్రెస్‌ పార్టీలో ఇరు వర్గాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నది పరస్పర విమర్శలతో రాష్ట్ర రాజ కీయం వేడెక్కింది. ఇంత వరకూ యాత్రపైనే దృష్టి పెట్టిన జగన్‌ ఇప్పుడు తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న నేతలపై దూకుడుగా వ్యవహరించడం ప్రారంభించారు. పార్టీలో తనను ఏకాకిని చేసేందుకు కొందరు నేతలు చేస్తున్న ప్రయత్నాలపై జగన్‌ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఇప్పటికే రెండు విడతల్లో నాలుగు జిల్లాల్లో ఓదార్పు యాత్ర పూర్తయిన తరుణంలో హైకమాండ్‌ ద్వారా ఎటూ అడుగు వేయలేని పరిస్థితి కల్పిస్తున్న నేతల పట్ల జగన్‌ భగ్గుమంటున్నారు. అధిష్ఠానాన్ని రంగంలో దించి తన యాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే నేపంతో దగ్గుబాటి దంపతులపై జగన్‌, ఆయన వర్గం కారాలు, మిరియాలు నూరుతున్నది. వచ్చే నెల 3 నుంచి ప్రకాశం జిల్లాలో తన ఓదార్పు యాత్ర ప్రారంభం కానున్న తరుణంలో ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలను, ఎంపీలను ఢిల్లీ పిలిపించుకుని హైకమాండ్‌తో సమావేశాలు ఏర్పాటు చేసిన దగ్గుబాటి దంపతులు, చివరకు సోనియా, అహ్మాద్‌పటేల్‌లను రంగంలోకి దింపి ఓదార్పు అడ్డుకునేందుకు ప్రయత్నిం చారంటూ జగన్‌, అతని వర్గానికి చెందిన నేతలు మండిపడుతు న్నారు.

పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు ఎవరు కూడా ఓదార్పు యాత్రకు వెళ్ళవద్దని సోనియా, అహ్మద్‌ పటేల్‌ చెప్పారంటూ కేంద్ర మంత్రి పురంధేశ్వరి ఢిల్లీలో ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ తరువాత ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ చెప్పారు. మరో వైపు ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వర్‌రావు కూడా జగన్‌ ఓదార్పు యాత్ర విషయంలో కామెంట్లు చేశారు. గత రెండు రోజులుగా ఢిల్లీలో దగ్గుబాటి దంపతులు ఓదార్పు యాత్ర ఎపిసోడ్‌లో వ్యవహరించిన పాత్ర యువనేత జగన్‌కు అగ్రహాన్నే తెచ్చిపెట్టింది. ఆయన అనుచరగణం కూడా దగ్గుబాటి దంపతులపై ఎదురు దాడికి దిగారు.

roshiahజగన్‌ ఒక మరో అడుగు ముందుకు వేసి ఏకంగా దగ్గుబాటి దంపతులపై ఫిర్యాదు చేశారు. తనకు వ్యతిరేకంగా వ్యవహరించే నేతలు, ప్రత్యేకించి ఓదార్పు విషయంలో ఆటంకాలకు ప్రయత్నించే వారి పట్ల తగిన రీతిలోనే స్పందిస్తామంటూ జగన్‌ ఈ ఫిర్యాదు ద్వారా సంకేతాలు అందించారు. ప్రకా శం జిల్లా ఎమ్మెల్యేలను ఢిల్లీకి తీసుకొచ్చి తనకు నీతులు చెప్పించే ప్రయత్నాలు చేయడం, అధిష్ఠానంతో ఓదార్పు యాత్రను అడ్డుకునేందుకు వ్యూహాలు రచించారంటూ దగ్గుబాటి దంపతులపై జగన్‌ నిప్పులు చెరుగుతున్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహరాల ఇన్‌చార్జీ డాక్టర్‌ వీరప్ప మొయిలీ హస్తినాలో రాష్ట్ర ఎంపీలకు ఇచ్చిన విందులో కూడా జగన్‌ పట్టుపని పదినిమిషాలు కూడా ఉండకుండా వెళ్ళిపోయారు. అక్కడి నుంచి ఆయన ఆనకాపల్లి ఎంపి సబ్బం హరిని వెంటబెట్టుకుని కాంగ్రెస్‌లో కీలక నేత, సీడబ్ల్యూసీ సభ్యుడు, కేంద్ర ఆర్ధిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ ఇంటికి వెళ్ళి కొంత సేపు ఆయనతో సమావేశ మయ్యారు. ఈ భేటి సారాంశమేమిటో అధికారికంగా వెల్లడించనప్పటికీ దగ్గుబాటి దంపతులు, ఓదార్పు యాత్ర విషయంలోనే జగన్‌, ప్రణబ్‌తో చర్చించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. హైదరాబాద్‌కు వచ్చే ముందు శుక్రవారం ఉదయం జగన్‌ మరో సారి ప్రణబ్‌తో భేటి అయ్యారు. ఆ తరువాత ఆయన సాయంత్రం వీరప్ప మొయిలీతో సమావేశ మయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఇద్దరు నేతల వద్ద కూడా దగ్గుబాటి దంపతుల వ్యవహార శైలీపై ఫిర్యాదు చేసి తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. సోనియాగాంధీ తనకు చెప్పారంటూ పురంధేశ్వరి ప్రకటన చేసిన కొంత సేపటికే జగన్‌, ప్రణబ్‌ను కలువడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నది.

ఇలా ఉండగా జగన్‌ వర్గం నేతలు కూడా దగ్గుబాటి దంపతుల నిప్పులు చెరుగుతున్నారు. ఓదార్పు యాత్ర విషయంలో పార్టీ అధిష్టానం ఏదైనా చెప్పా ల్సి ఉంటే నేరుగా జగన్‌నే పిలిపించి చెప్పవచ్చు, అలా కాకుండా తమతో సోనియా, పటేల్‌ చెప్పారంటూ దగ్గుబాటి దంపతులు జగన్‌ ఓదార్పు యాత్ర ను అడ్డుకునే రాజకీయాలు చేస్తున్నారంటూ పీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. అదే విధంగా జగన్‌ వర్గ నాయకు లుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే గోనే ప్రకాష్‌రావు, పార్టీ నేత గట్టురామచంద్ర రావు తది తరులు కూడా దగ్గుబాటి దంపతులపై చిందులు తొక్కారు.

ఎన్టీఆర్‌ను గద్దె దించడంలో కీలక పాత్ర వహించారంటూ దగ్గుబాటి వెంకటేశ్వర్‌రావు మండి పడ్డారు. మరో వైపు తిరుపతిలో ఉన్న జగన్‌ బాబాయ్‌ వైఎస్‌ వివేకానందరెడ్డి కూడా ఓదార్పు విషయంలో పురంధేశ్వరి, ఆమె భర్త వెంకటేశ్వర్‌రావు అతిగా స్పందించారంటూ ఢిల్లీలో వారు వ్యవహరించిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో దగ్గుబాటి దంపతులు కీలక పాత్ర పోషించిన దాఖలాలు లేవని, పదవులు కాపాడుకోవడానికే కొందరు జగన్‌ను టార్గెట్‌ చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. ఇక మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మరో అడుగు ముందుకు వేసి మంత్రి పదవులు తనకు శాశ్వతం కాదని, అధిష్ఠానం వద్దన్నా తాను ఓదార్పు యాత్రకు వెళ్ళి తీరుతానని మరో సారి పునరుద్ఘాటించి జగన్‌కు విధేయతను ప్రకటించుకున్నారు.

ఎదురుదాడి....
ఇదిలా ఉండగా జగన్‌ వ్యతిరేక వర్గం అతనిపై ఎదురు దాడి ప్రారంభిం చింది. అధిష్ఠానం ఆదేశాలను సైతం లెక్క చేయకుండా, పార్టీని శాసించే స్థా యిలో జగన్‌ వ్యవహరిస్తున్న తీరుపై ఆ వర్గం కన్నెర్ర చేస్తున్నది. రోజు వారిగా జగన్‌పై విమర్శలు సంధిస్తున్న నేతలతో పాటు శుక్రవారం ముఖ్యమంత్రి రోశయ్య, పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హన్మంత రావు తదితరులు జగన్‌ పేరు ప్రస్తావించకుండానే పరోక్షంగా అతనిపై బాణాలు ఎక్కుపెట్టారు. ఈ ముగ్గురు నేతలు కూడా రాజీవ్‌ జయంతి వేడుకల కార్యక్రమాన్ని వేదికగా చేసుకుని జగన్‌పై తమదైన శైలీలో మండిపడ్డారు. నిజమైన నాయకులు ఎవరూ కూడా పదవుల కోసం పాకులాడరంటూ ముఖ్య మంత్రి రోశయ్య చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా జగన్‌ను ఉద్దేశించి మాట్లాడిన వేనని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

అదే విధంగా పీసీసీ చీఫ్‌ డిఎస్‌ కూడా యుననేత జగన్‌పై గురిపెట్టి కొందరు నేతలు పార్టీలో కాలుమోపగానే పదవు ల కోసం పోటీ పడుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని, రాహుల్‌ గాంధీని ఆదర్శంగా తీసుకుని ముందుకు నడవాలని హితవు పలికారు. మరో సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు విహెచ్‌, జగన్‌ పేరు ప్రస్తావించకుండానే నాడు రాజీవ్‌ గాంధీ ఆశీస్సుల వల్లే వైఎస్‌కు పీసీసీ అధ్యక్ష పదవి దక్కిందని, రాజీవ్‌ లేక పోతే వైఎస్‌కు ఆ పదవి వచ్చేదా? అని ప్రశ్నించారు. అంబేద్కర్‌ కాదు, గాంధీ కాదు, అంతా మా నాన్నేనని కొందరంటున్నారు, అది సరికాదు, పార్టీకి సేవచేయకుండా పదవులు ఎలా వస్తాయి? హైకమాండ్‌ను నమ్ముకుంటేనే పదవులు వస్తాయన్న విషయాన్ని అందరు గ్రహించాలని ఆయన జగన్‌కు చురకలంటించారు. మరో సీనియర్‌ నేత, మాజీ మంత్రి శంకర్‌రావు కూడా ఓదార్పు యాత్ర వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, జగన్‌ చుట్టు ఉన్న నేతలందరు నీళ్ళ తరహాలాంటి వారేనంటూ జగన్‌ వర్గంపై ధ్వజమెత్తారు.

జగన్ స్వయంకృతం!

మబ్బులు విడిపోతున్నాయి- ముసుగులు తొలగిపోతున్నాయి. కాంగ్రెస్ అధిష్ఠాన వర్గానికి, కడప ఎం.పి. వై.ఎస్.జగన్మోహనరెడ్డికి మధ్య ఇంతకాలంగా ప్రచ్ఛన్నంగా సాగిన దోబూచులాట ఇప్పుడు ప్రత్యక్ష పోరుకు దారితీయనుందా? గడచిన కొన్ని రోజులుగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ స్వయంగా రంగంలోకి దిగి, జగన్ చేపట్టిన ఓదార్పు యాత్రలో పాల్గొనవద్దని పార్టీ ఎం.పి.లు, ఎం.ఎల్.ఎ.లకు స్పష్టంచేయడంతో.. జగన్ విషయంలో పార్టీ వైఖరి తేటతెల్లమైంది.

ఇక ఇప్పుడు బంతి జగన్ కోర్టులోకి చేరింది. పార్టీ అధినాయకత్వంతో సంధి కుదుర్చుకోవడమా? లేక సమరానికి సిద్ధం కావడమా? అన్నది తేల్చుకోవలసిన పరిస్థితి జగన్‌కు ఎదురైంది. అటు కాంగ్రెస్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు, ఇటు జగన్ గానీ, ఆయన అనుచరులు గానీ చేస్తున్న ప్రకటనలను గమనిస్తే.. సంధి అవకాశాలు తక్కువనే చెప్పవచ్చు.

జగన్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలంటే, పార్టీ అధిష్ఠానం ఆదేశాలను ఆయన శిరసావహించి, ప్రకాశం జిల్లాలో తలపెట్టిన ఓదార్పు యాత్రను పార్టీ తరఫున నిర్వహించడానికి అంగీకరించాలి. అదే సమయంలో తన పోకడల వల్ల పార్టీ అధిష్ఠానం ఆగ్రహానికి గురైన ఆయన.. ముఖ్యమంత్రి పదవిపై కనీసం పదేళ్లపాటు ఆశలు వదలుకోవలసి ఉంటుంది.

జగన్‌ను ముఖ్యమంత్రి పదవికి కాంగ్రెస్ అధిష్ఠానం ఏ మాత్రం పరిశీలించడం లేదనడానికి, ఆయనను ఉద్దేశించి "ఆ పిల్లాడికి పిచ్చా''అని అహ్మద్ పటేల్, "ఆ పిల్లాడు ఎందుకలా ప్రవర్తిస్తున్నాడు'' అని సోనియాగాంధీ స్వయంగా వ్యాఖ్యానించడమే నిదర్శనం. ముఖ్యమంత్రి పదవి చేపట్టే స్థాయి జగన్‌కు లేదన్నది వారి ఉద్దేశంగా ఆ వ్యాఖ ్యలు చెప్పకనే చెబుతున్నాయి.

జగన్ మనస్తత్వం తెలిసినవారెవరూ ఆయన లొంగిపోతారని భావించలేరు. ఒక వ్యవస్థకు లోబడి గానీ, ఒక చట్రం పరిధిలో పనిచేయగల లక్షణాలు గానీ జగన్‌లో లేవని ఆయనను ఎరిగిన వారు ఇట్టే చెబుతారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఇడుపులపాయకు వెళ్లిన సందర్భాలలో.. జగన్‌కు, వైఎస్‌కు మధ్య జరిగిన సంభాషణలను ఆ జిల్లాకు చెందిన పలువురు అధికారులు తమ సన్నిహితుల వద్ద పదే పదే ఉదహరిస్తూ ఉంటారు.

జగన్ దూకుడుగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించిన ప్రతి సందర్భంలోనూ, రాజశేఖరరెడ్డి వారించే వారనీ, "నీకు తెలియదు. అది అలా చేయకూడదు. నాకొదిలేయ్'' అని రాజశేఖరరెడ్డి అంటూ ఉండేవారని ఆ జిల్లా అధికారులు చెప్పేవారు.

కాంగ్రెస్ పార్టీలో సోనియాగాంధీ తర్వాత అంతటి బలమైన నాయకుడిగా వ్యవహరిస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీని గురువారం రాత్రి కలిసిన తర్వాత కూడా జగన్ వైఖరిలో మార్పు వచ్చిన దాఖలాలు లేవు. ఆయన తన సొంత పత్రికలో వేయించుకున్న కార్టూన్ ఇందుకు నిదర్శనం. వాస్తవానికి కాంగ్రెస్ అధిష్ఠానానికి, జగన్‌కు మధ్య దూరం పెంచడానికి కొంతమంది కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని, ఆయన అనుయాయులు తరచూ ఆరోపిస్తూ ఉంటారు.

ఇందుకు భిన్నంగా తనకు-మృతుల కుటుంబాలకు మధ్య.. అంటే తనకు-ప్రజలకు మధ్య అంతరం సృష్టించడానికి కొన్ని పత్రికలు, తన వ్యతిరేకులు ప్రయత్నిస్తున్నారన్న అర్థం వచ్చేలా ఆయన తన పత్రికలో కార్టూన్ గీయించుకున్నారు. అంతేకాకుండా తనను కలిసిన ప్రకాశం జిల్లా ఎం.ఎల్.ఎ.లతో మాట్లాడుతూ, తన సర్వేలు తనకు ఉన్నాయనీ, జనం తనతోనే ఉన్నారనీ జగన్ చేసిన వ్యాఖ్యలు కూడా ఆయన ఆలోచనలకు అద్దం పడుతున్నాయి.

సోనియాగాంధీ రాజకీయ సలహాదారుడు అహ్మద్ పటేల్ తరఫున ముఖ్యమంత్రి కె.రోశయ్య.. మంత్రి బాలినేనికి ఫోన్ చేసినప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా జగన్ శిబిరం ఆలోచనలకు అద్దం పట్టేవే.

మరోవైపు ఏది ఏమైనా తన విధేయత పార్టీ అధినాయకత్వానికేనంటూ సోనియాగాంధీకి లేఖ రాసిన రాజశేఖరరెడ్డి సోదరుడు, ఎం.ఎల్.సి. వివేకానందరెడ్డి, రెండు రోజుల్లోనే స్వరం మార్చుకున్నారు. సోనియా ఆదేశాల మేరకు ఆమె భావాలను వెల్లడించిన కేంద్ర మంత్రి పురందేశ్వరి దంపతులపై విరుచుకుపడ్డారు.

మరోవైపు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సైతం స్వరం పెంచి.. ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్రను ఎనిమిది రోజులపాటు నిర్వహించాలని తొలుత భావించామనీ, ఇప్పుడు దాన్ని 15 రోజులకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ పరిణామాలన్నింటినీ పరిశీలిస్తే.. పార్టీ అధిష్ఠానంతో రాజీకి జగన్ ఏ మాత్రం సిద్ధంగా లేరనీ, తన సొంత ఎజెండా ప్రకారమే ముందుకు వెళ్లాలని ఆయన నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతున్నది.

ఏదిఏమైనా ఓదార్పు యాత్రను ఆపేది లేదని, సెప్టెంబర్ 3 నుంచి యథాతథంగా జరిగి తీరుతుందని శుక్రవారం ఢిల్లీలో కరాఖండీగా ప్రకటించిన జగన్.. అక్కడి నుంచి బయల్దేరి హైదరాబాద్‌కు వచ్చేశారు కూడా. మొత్తంమీద అధిష్ఠానంతో సున్నం పెట్టుకున్న తర్వాత, ఇప్పుడు మనసు చంపుకొని రాజీ పడినా తన లక్ష్యమైన ముఖ్యమంత్రి పదవి దరిదాపుల్లో లభించదన్న విషయాన్ని గ్రహించలేనంత అమాయకుడేమీ కాదు జగన్!

ఇక జగన్ ఆలోచనలను పసిగట్టలేని పరిస్థితిలో కాంగ్రెస్ నాయకత్వం ఉందనుకోవడమూ పొరపాటే! ప్రజల్లో రాజశేఖరరెడ్డి పట్ల ఉన్న సానుభూతి జగన్‌వైపు మళ్లకుండా కాంగ్రెస్ అధిష్ఠానం ఆచితూచి వ్యవహరిస్తున్నది. ఈ క్రమంలోనే సోనియాగాంధీ- జగన్‌ల మధ్య జరిగిన సంభాషణ వివరాలను శాసనసభ్యులు, ఎం.పి.లు, కేంద్ర మంత్రుల ద్వారా బయటి ప్రపంచానికి వెల్లడి చేయించారు.

దీంతో ఓదార్పు యాత్రను సోనియాగాంధీ వద్దన లేదనీ, పార్టీ తరఫున నిర్వహించాలని సూచించారనీ, రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా చనిపోయినందున, ఆయన మరణ వార్తతో మృతి చెందిన వారి కుటుంబాలకు కూడా పార్టీ తరఫునే ఆర్థిక సహాయం అందించవలసిందిగా సోనియా సూచించారని లోకానికి తెలిసింది. వాస్తవానికి వేరే ఆలోచనలు, ఉద్దేశాలు లేకపోతే సోనియాగాంధీ చేసిన సూచనలను తప్పుపట్టవలసిన అవసరం లేదు.

రాజశేఖరరెడ్డి పట్ల ప్రజల్లో ఉన్న సానుభూతి తన పార్టీకే దక్కాలని ఒక పార్టీ అధ్యక్షురాలిగా సోనియాగాంధీ ఆశించడం సహజం. అయితే జగన్ మాత్రం ఆ సానుభూతి తనకే పరిమితం కావాలన్న ఆలోచనతో.. తన ఓదార్పు యాత్ర వ్యక్తిగతమైనదంటూ ప్రకటనలు చేశారు.

పేచీ అంతా ఇక్కడే ఉంది. ప్రజల్లో ఉన్న సానుభూతితో పాటు రాష్ట్రంలో మొత్తం పార్టీని హస్తగతం చేసుకోవడానికి జగన్ ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయానికి వచ్చిన పార్టీ అగ్ర నాయకత్వం.. నేరుగా రంగంలోకి దిగింది. ఓదార్పు యాత్రపై తమ అభిప్రాయాన్ని లోకానికి వెల్లడించడంతో పాటు, జగన్‌ను ఒంటరిని చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అధిష్ఠానం ఆదేశాలను పాటిస్తారన్న నమ్మకం ఉన్న వారినే ఢిల్లీ పిలిపించుకుని అహ్మద్ పటేల్ మంత్రాంగం నెరపుతున్నారు.

తనకు పూర్తి విధేయులని నమ్మకం కుదిరిన వారితో సోనియాగాంధీ నేరుగా తన మనోభావాలను పంచుకుంటున్నారు. అదే సమయంలో ఆర్థిక నేరాలకు సంబంధించి జగన్‌పై వచ్చిన ఆరోపణల విషయంలో పూర్తి సమాచారాన్ని సేకరించి పెట్టుకున్నారు.

ఐ.బి. డైరెక్టర్ స్వయంగా ఒకే నెలలో రెండు పర్యాయాలు హైదరాబాద్‌ను సందర్శించారంటే, అధిష్ఠానం జగన్ పట్ల ఎంత సీరియస్‌గా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి జగన్ విషయంలో ఇంత ఆచితూచి వ్యవహరించవలసిన అవసరం కాంగ్రెస్ కేంద్ర నాయకత్వానికి లేదు.

రాష్ట్రానికి సంబంధించి విభజన సమస్య తమ ముందున్నందున భవిష్యత్తులో తాము తీసుకునే నిర్ణయం వల్ల జగన్ లాభపడకూడదన్నది అధిష్ఠానం ఆలోచనగా చెబుతున్నారు. ఒకవేళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అంగీకరించే పక్షంలో.. ఇప్పటికే సమైక్య నినాదం అందిపుచ్చుకున్న జగన్, సీమాంధ్రలో ఆ నినాదంతో పుంజుకోకూడదన్నది ఢిల్లీ పెద్దల ఆలోచన. ఈ కారణంగానే ఆచితూచి వ్యవహరించడం ద్వారా జగన్‌ను అన్ని రకాలుగా నిర్వీర్యం చేయాలన్న వ్యూహంతో కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ఉంది.

సోనియాగాంధీని ఒకసారి ఎదిరిస్తే ఏమి జరుగుతుందో జగన్‌కు కూడా స్పష్టంగా తెలుసు. భావి పరిణామాలు ఎలా ఉన్నా అందుకు సిద్ధపడినందునే పార్టీ అధిష్ఠానం ఆలోచనలకు భిన్నంగా ఆయన ఓదార్పు యాత్రకు శ్రీకారం చుట్టారు. వాస్తవానికి మృతుల కుటుంబాలను పరామర్శించి, ఆర్థిక సహాయం చేయాలంటే ఒక్కొక్క జిల్లాలో అన్ని రోజులపాటు పర్యటించవలసిన అవసరం లేదు.

'ఓదార్పు' పేరుతో ప్రజలను నేరుగా తనవైపు తిప్పుకోవాలన్నదే జగన్ అభిమతం. ముఖ్యమంత్రి పదవి కోసం పది, పదిహేనేళ్లు వేచి ఉండే ఓపిక ఉన్న మనిషి కాదు కనుకే.. జగన్ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అధిష్ఠానంతో ఢీ అంటే ఢీ అంటున్నారు.

ఈ క్రమంలో జన హృదయాలను గెలుచుకుని, తన లక్ష్యమైన ముఖ్యమంత్రి పదవిని జగన్ సాధించుకుంటారా? లేక అటు జనాభిమానం చూరగొనలేక, ఇటు కాంగ్రెస్ పార్టీకి దూరమై రెండింటికీ చెడ్డ రేవడిగా మిగిలిపోతారా? అన్నది కాలమే నిర్ణయించాలి.

నిజానికి, జగన్ విషయంలో పలువురు ఎం.ఎల్.ఎ.లకు సానుభూతి ఉన్న విషయం వాస్తవం. అయితే ఆయా జిల్లాలలో జగన్ వర్గంగా ముందుగానే ప్రకటించుకున్న వారి వల్ల పలువురు జగన్‌కు దూరం అవడం ప్రారంభమైంది.

ఉదాహరణకు ప్రకాశం జిల్లా విషయాన్నే తీసుకుంటే, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహార శైలి నచ్చని కారణంగానే ఆ జిల్లాకు చెందిన మెజారిటీ శాసనసభ్యులు జగన్‌కు దూరమై, అధిష్ఠానానికి దగ్గరయ్యారు.

అలాగే వరంగల్ జిల్లాలో కొండా సురేఖ దంపతుల కారణంగా మిగతా ముఖ్య నాయకులెవరూ జగన్‌వైపు రావడానికి ఇష్టపడటం లేదు. గుంటూరు జిల్లా విషయానికి వస్తే, జనంతో సంబంధం లేని అంబటి రాంబాబు అధికార ప్రతినిధిగా చలామణి అవడం వల్ల, మెజారిటీ ఎం.ఎల్.ఎ.లు జగన్ వైపు చూడటానికి ఇష్టపడటం లేదు. అంతేకాదు.. మున్ముందు జగన్‌కు వ్యతిరేకంగా ప్రకటనలు చేయడానికి కూడా పలువురు శాసనసభ్యులు సిద్ధపడుతున్నారు.

కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ధిక్కరిస్తే ఏమవుతుందో అటు జగన్‌కు గానీ, ఇటు ఆయన వర్గంగా చలామణి అవుతున్న వారికి గానీ అనుభవం లేదు. అందుకే య«థాలాపంగా ఏ ప్రకటన అంటే ఆ ప్రకటన చేస్తున్నారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గురువారంనాడు ముఖ్యమంత్రి తనతో మాట్లాడిన తర్వాత చేసిన ప్రకటన ఈ కోవలోనిదే! అహ్మద్ పటేల్ ముఖ్యమంత్రికి స్వయంగా ఫోన్ చేసి మరీ ఓదార్పు యాత్రలో పాల్గొనవద్దని బాలినేనికి సూచించవలసిందిగా ఆదేశించారు.

అయినా తాను జగన్‌కే విధేయుడిగా ఉంటానని ప్రకటించడం ద్వారా కాంగ్రెస్ పార్టీలో తన రాజకీయ భవిష్యత్తుకు బాలినేని సమాధి కట్టుకున్నారు. జగన్ కాంగ్రెస్‌లో కొనసాగినా, కొనసాగకపోయినా, బాలినేని వంటి వారికి కాంగ్రెస్ అధిష్ఠానం భవిష్యత్తులో కత్తెర వేయడం ఖాయం.

ఎవరి విధేయతలు ఏమిటో తెలిసిన తర్వాత ఉపేక్షించేటంత పెద్ద మనసు కాంగ్రెస్ కేంద్ర నాయకత్వానికి ఉండదు. అంతేకాదు, రాష్ట్రంలో ఎదురవుతున్న తరహా సమస్యను కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం గతంలో ఎప్పుడూ ఎదుర్కొనలేదు.

విభేదాల కారణంగా పార్టీని చీల్చిన వారు ఉన్నారు గానీ, సాక్షాత్తు పార్టీ అధినాయకత్వం కంటే తానే గొప్ప అని ప్రకటించుకునే సాహసానికి ఒడిగట్టిన స్వతంత్ర రాజులను కాంగ్రెస్ పార్టీ గతంలో చూడలేదు.

ఈ నేపథ్యంలో సంధి కుదుర్చుకోవడం ద్వారా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న పలువురు మాజీ ముఖ్యమంత్రుల కుమారులలో ఒకరిగా తాను కూడా కొనసాగడానికి జగన్ సిద్ధపడతారా? లేక ఎలా జరగాలనుంటే అలా జరుగుతుందని తాను తరచుగా చెబుతున్నట్లుగానే తిరుగుబాటు బావుటా ఎగరేస్తారా? మరో వారం పది రోజులలో ఏదో ఒకటి తేలిపోతుంది. పార్టీని ధిక్కరించి నిలదొక్కుకోగలిగితే ఆ ఘనత జగన్‌కు ఒక్కరికే దక్కుతుంది.

ఈ ప్రయత్నంలో విఫలమైతే తన సామాజిక వర్గానికి మాత్రమే పరిమితమైన నాయకుడిగా జగన్ మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఎదుటి వ్యక్తులు వాస్తవాలను గుర్తించలేని స్థితిలో ఉంటారని గట్టిగా నమ్మే జగన్.. పనిలో పనిగా అటు పార్టీ నాయకులను, ఇటు సాటి పత్రికలను కూడా ఆడిపోసుకోవడం అప్పుడే ప్రారంభించారు.

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆలోచనలు గానీ, అహ్మద్ పటేల్ చర్యలు గానీ రాష్ట్రంలో చిన్న పిల్లలకు సైతం అర్థం అవుతున్నా.. అధిష్ఠానం నుంచి తనను దూరం చేయడానికి కొన్ని పత్రికలు, కొంతమంది కాంగ్రెస్ నాయకులు కుతంత్రాలు పన్నుతున్నారంటూ వార్తలు ప్రచురించడం ద్వారా తన సొంత పత్రికను ఒక రోత పత్రికగా జగన్ తీర్చిదిద్దుతున్నారు.

గడచిన నాలుగైదు రోజులుగా ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ వీరప్ప మొయిలీ పాత్ర లేకపోవడానికి కూడా స్థానిక పత్రికలే కారణమని జగన్ భావించినా ఆశ్చర్యపోవలసింది లేదు. జగన్‌లాంటి వ్యక్తులను ఎవరూ ఏమీ చేయనవసరం లేదు. మంచి గానీ, చెడు గానీ వారికి వారే చేసుకోగల సమర్థులు!
 - ఆదిత్య