జనం - జగన్

ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......

Thursday, December 9, 2010

మూడేళ్ల తర్వాత స్వ ర్ణపాలన * మూడేళ్లు కష్టాలకోర్చుకుంటే ఆ తర్వాత 30 ఏళ్లు స్వర్ణ పాలన అందిస్తానని యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు.

జగన్ ఉద్ఘాటన
ఈ మూడేళ్లూ కష్టాలకోర్చుకోవాలి
ఆ తర్వాత వందేళ్లు మహానేతను మరిచిపోకుండా చేస్తా
ఆ మహానేత మరణంపై ఎన్నో అనుమానాలున్నాయి..ఒక్కటీ నివృత్తి కాలేదు
నాన్న కోసం ప్రాణాలు విడిచిన వారి కుటుంబాలను ఇంకా ఓదార్చాల్సి ఉంది
మన పార్టీ జెండా మోసే ప్రతిఒక్కరూ మనతో ఉంటారు
నేను రాష్ట్రంవైపు నడవాలంటే పులివెం దులవాసుల ఆదరాభిమానాలు కావాలి
పులివెందుల, చక్రాయపేట మండలాల కార్యకర్తలతో జగన్‌మోహన్‌రెడ్డి భేటీ

మూడేళ్లు కష్టాలకోర్చుకుంటే ఆ తర్వాత 30 ఏళ్లు స్వర్ణ పాలన అందిస్తానని యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. పార్టీ వెంట ఎవరుంటారని భయపడాల్సిన అవసరం లేదని, మన పార్టీ జెండా మోసే ప్రతి ఒక్కరూ మనతోనే ఉంటారని.. మోయలేని వారు వెళ్లిపోతారని అన్నారు. పులివెందులలోని వైఎస్‌ఆర్ ఆడిటోరియంలో బుధవారం పులివెందుల, చక్రాయపేట మండలాల కార్యకర్తలు, నేతలతో ఆయన సమావేశమయ్యారు.

తన వెంట నడిచేవారు మూడేళ్లు కష్టాలకు ఓర్చుకుంటే 2014 తర్వాత 30 ఏళ్లు.. వైఎస్ రాజశేఖరరెడ్డి అందించిన స్వర్ణపాలనను మళ్లీ చూస్తారని కార్యకర్తల హర్షధ్వానాల మధ్య జగన్ చెప్పారు. తర్వాత 100 ఏళ్లు ప్రజలు మరిచిపోకుండా వైఎస్‌కు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం కల్పిస్తానని అన్నారు. మహానేత మరణించిన సంఘటనపై అనేక అనుమానాలున్నాయని, ఏ ఒక్క అనుమానం ఇంతవరకు తీర్చలేదని, ఎవరినీ దోషిగా చూపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాన్న మరణించటాన్ని తట్టుకోలేక చనిపోయినవారి కుటుంబాలను ఓదార్చడమే నేరమైపోయిందన్నారు. నల్లకాలువ సభలో ఇచ్చిన మాట ప్రకారమే ముందుకు నడిచానన్నారు.

తాను, అమ్మ విజయమ్మ ఆత్మగౌరవం చంపుకుని అడిగినా సోనియాగాంధీ ఓదార్పుయాత్రకు అంగీకరించలేదని చెప్పారు. అయినప్పటికీ సచ్ఛీలతను, వ్యక్తిత్వాన్ని నిలుపుకోవడానికి కష్టాలబా టలోనే నడవడానికి నిర్ణయించుకున్నానని వివరించారు. తర్వాత అడుగడుగునా తనను, తన కుటుంబాన్ని అవమానించారని తెలిపారు. కాంగ్రెస్‌లో ఉండి మాట్లాడితే క్రమశిక్షణ గల కార్యకర్తను కానని అన్నీ ఓర్చుకున్నట్లు చెప్పారు. చివరకు కుటుంబాన్ని చీల్చేందుకు కూడా సిద్ధపడ్డారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి రెండుసార్లు ప్రధాని కుర్చీలో కూర్చొనే అవకాశం ఎవరి వల్ల వచ్చింది?’ అని యువనేత ప్రశ్నిస్తుండగానే, కార్యకర్తలు పెద్దపెట్టున ‘వైఎస్ రాజశేఖరరెడ్డి’ అంటూ కేకలు వేశారు. అటువంటి రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని చీల్చే నీచ రాజకీయాలకు కూడా ఒడిగట్టారని జగన్ ఆవేదనగా మాట్లాడుతుంటే సమావేశంలో మౌనం రాజ్యమేలింది. అనేకమంది మహిళలు కంట తడి పెట్టడం కన్పించింది. కాంగ్రెస్‌లోనే ఉన్నా తన ఇంటిపై, సాక్షి పత్రికపై పోలీసులతో దాడులు చేయించారని చెప్పారు. నీచ రాజకీయాల వెనుక సోనియాగాంధీ ఉన్నారని తెలిసి ఎంతో బాధపడ్డానని తెలిపారు. ‘ఏది మాట్లాడినా క్రమశిక్షణ తప్పినట్లవుతుందనుకున్నాను. బయటకు వచ్చాను. మరో 45 రోజుల్లో ఇడుపులపాయలో నాన్న సమాధి సాక్షిగా మన పార్టీ, మనజెండా వస్తుంది’ అని జగన్ సభికుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ఉప ఎన్నికలు సెమీఫైనల్స్ అంటూ 2014లో జరగబోయే ఎన్నికల్ని ఫైనల్స్‌గా అభివర్ణించారు. ‘నేను రాష్ట్రం వైపు నడవాలంటే పులివెందులవాసుల ఆదరాభిమానాలు కావాలి. నాన్నను ఏ విధంగా ఆదరించారో, అనురాగంతో అభిమానించి రాష్ట్రంవైపు పంపారో, ఆ ప్రేమ ఆప్యాయతలతో ఆశీర్వదించి పంపండి’ అని విజ్ఞప్తి చేశారు.

పాపకు విజయలక్ష్మిగా నామకరణం

వేముల మండలం భూమయ్యగారిపల్లెకు చెందిన ప్రకాష్‌రెడ్డి, లక్ష్మి దంపతుల కుమార్తెకు విజయలక్ష్మి అని జగన్ పేరు పెట్టారు. బుధవారం వారు యువనేతను కలిసి తమ పాపకు నామకరణం చేయాలని కోరడంతో ఆయన పేరు పెట్టారు.

జగన్ పార్టీకి రూ. 1.11 లక్షల విరాళం

జగన్ పార్టీ పెడుతున్నట్లు ప్రకటించడంతో తమవంతు విరాళాలు అందించేందుకు దాతలు ముందుకొస్తున్నారు. బుధవా రం పులివెందుల మండల మాజీ ఉపాధ్యక్షుడు ఎం.పుష్పనాథరెడ్డి పార్టీ ఫండ్ కింద రూ.1.11 లక్షల విరాళాన్ని చెక్కు రూపంలో యువనేతకు అందజేశారు. కార్యక్రమంలో ఈసీ గంగిరెడ్డితోపాటు వైఎస్ భాస్కర్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి తదితరులున్నారు. ఎంపీ పదవికి, కాంగ్రెస్‌కు రాజీనామా చేశాక ఈనెల 1న ఇడుపులపాయకు వచ్చిన జగన్‌కు పెండ్లిమర్రి మండలం కొండూరు గ్రామ మాజీసర్పంచ్ చింతకుంట నాగిరెడ్డి రూ.10,305 తొలి విరాళంగా అందించడం తెలిసిందే.

1 comment: