జనం - జగన్

ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......

Monday, December 20, 2010

నేటి నుంచే జగన్ ‘లక్ష్య దీక్ష’ * రైతుల డిమాండ్ల సాధన కోసం 48 గంటలపాటు జగన్ నిరాహార దీక్ష

ఏడాది సేద్యం.. ఆరుగాలం రెక్కల కష్టం.. ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోతే.. రైతుకు అండగా ఉండి అక్కున చేర్చుకోవాల్సిన సర్కారు.. కంటితుడుపు చర్యలతో సరిపెట్టుకుంటే... నిలదీయాల్సిన ప్రతిపక్షం...రాజకీయ లాభనష్టాల బేరీజులో మునిగిపోతుంటే.. మీకు నేనున్నానని రైతన్నకు భరోసా ఇస్తూ యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన సామూహిక నిరాహార దీక్ష నేడే ప్రారంభం కానుంది. ఆయన ఇచ్చిన ‘లక్ష్య దీక్ష’ పిలుపునకు స్పందించి రాష్ట్రం నలుమూలల నుంచి అన్నదాతలు విజయవాడబాట పట్టారు. ఇక్కడ కృష్ణా తీరంలో లక్ష మందితో 48 గంటలపాటు చేపట్టదలచిన ఈ దీక్షకు అన్ని సన్నాహాలు పూర్తయ్యాయి. అయితే అంచనాలకు మించి జనం వస్తే.. ఎలా? అన్న సంశయం అటు నిర్వాహకులనూ.. ఇటు జిల్లా అధికారులనూ వేధిస్తోంది.

దుర్గమ్మ ఆశీస్సులు.. సీతమ్మ పాదాలు: రైతులు, చేనేత కార్మికుల కోసం జగన్ చేయనున్న ఈ దీక్ష మంగళవారం ఉదయం సీతమ్మవారి పాదాల వద్ద ఇసుక తిన్నెలపై ప్రారంభం కానుంది. యువనేత ఉదయం ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో వచ్చి రైల్వేస్టేషన్ నుంచి నేరుగా స్టేట్ గెస్ట్‌హౌస్‌కు వెళ్తారు. అక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకుంటారు. అమ్మవారి ఆశీస్సులు తీసుకుని నేరుగా సీతమ్మవారి పాదాల వద్ద ఏర్పాటు చేసిన దీక్షా ప్రాంగణానికి చేరుకుంటారు. దీనికి ‘వైఎస్‌ఆర్ లక్ష్య దీక్షా ప్రాంగణం’గా పేరుపెట్టారు. ఇక్కడ 100 అడుగుల వెడల్పు, పది అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన భారీ వేదికపై సహచరులు, రైతులతో కలిసి యువనేత దీక్షలో కూర్చుంటారు. ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో దీక్ష ప్రారంభం అయితే 12గంటల తర్వాత యువనేత ప్రసంగం ఉంటుంది. తర్వాత దీక్షకు సంఘీభావం తెలపడానికి వచ్చిన వారందరినీ యువనేత కలుస్తారు. దీనికోసం వేదిక ఎదురుగా ప్రత్యేక ర్యాంపు ఏర్పాటు చేస్తున్నారు. దీని మీదుగా వచ్చి యువనేతను పరామర్శించే విధంగా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. కాగా పలువురు ప్రముఖులు ఈ దీక్షలలో పాల్గొనేందుకు వస్తున్నట్లు సమాచారం. మాజీ మంత్రులు, ప్రజా ప్రతినిధులతో పాటు సినీ ప్రముఖులు సంఘీభావం ప్రకటించనున్నట్లు తెలిసింది.


పూర్తయిన ఏర్పాట్లు: యువనేతతోపాటు లక్షలాది మంది పాల్గొనే రెండ్రోజుల లక్ష్య దీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇసుక తిన్నెలను జనం కూర్చునేందుకు అనువుగా మార్చారు. ప్రాంగణమంతా టెంట్లు వేశారు. దీక్షలో కూర్చునేవారికి, మద్దతుగా వచ్చేవారికి అవసరమైన మంచినీటి వసతికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వైద్య శిబిరాల్లో ప్రథమ చికిత్సకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచారు. దీక్షలో కూర్చునేవారికి సహకరించడానికి 400 మంది వాలంటీర్లను నియమించారు.

రాత్రి నుంచే జన సందోహం: యువనేత దీక్షకు రాష్టవ్య్రాప్తంగా పలు జిల్లాల నుంచి లక్షల మంది జనం తరలి వస్తున్నారు. లారీలు, బస్సులు, కార్లలో జనం రావడం సోమవారం సాయంత్రం నుంచే మొదలైంది. దీంతో వైఎస్‌ఆర్ ప్రాంగణంలో సోమవారం రాత్రే రద్దీ కనిపించింది. జనం, వాహనాలతో కృష్ణలంక హైవే నిండిపోయింది. అభిమానులు ప్రాంగణం వద్ద టపాసులు పేల్చి హడావుడి చేశారు. జగన్ ఎప్పుడొస్తాడా అంటూ అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. గుంటూరు, ప్రకాశం, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి అత్యధిక సంఖ్యలో రైతులు తరలి వస్తున్నట్లు సమాచారం. ఖమ్మం, నల్లగొండ జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో జనం విజయవాడ చేరుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. నెల్లూరు, కర్నూలు తదితర జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో జనం విజయవాడకు బయలుదేరుతున్నారు. నల్లగొండ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో మోటార్ బైక్ ర్యాలీలో యువత విజయవాడ చేరుకునేందుకు సన్నాహాలు చేసుకున్నారు. ఇక రెండు రోజుల పాటు జగన్‌కు సంఘీభావంగా వచ్చీపోయే జనాల అంచనాలు అందడంలేదు.


కుటిలయత్నాలకు కళ్లెం: డిసెంబర్ 13న రైతు సమస్యల పరిష్కారానికి రెండు రోజుల నిరాహార దీక్షను యువనేత ప్రకటించినప్పటి నుంచీ.. దీక్షను నీరుగార్చే ప్రయత్నాలు ఆరంభమయ్యాయి. యువనేత 48 గంటల దీక్షను ప్రకటించగానే.. హడావుడిగా ప్రతిపక్షనేత చంద్రబాబు నిరాహారదీక్షకు కూర్చోవడం విదితమే. అటు ప్రభుత్వ పరంగా కూడా దీక్షకు జనం రాకుండా చేయడానికి పలు అవరోధాలు కలుగచేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. దానికి నిదర్శనంగా పలు చోట్ల అద్దెకు ఆర్టీసీ బస్సులు ఇచ్చేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఒక్క ఆర్టీసీ బస్సుకూడా అధికారులు అద్దెకు ఇవ్వలేదు. దీంతో వారు ప్రైవేటు వాహనాల్లో బయలుదేరుతున్నట్లు సమాచారం. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మాత్రం కొన్ని బస్సులను అద్దెకిచ్చారని, మిగతా వారంతా ప్రైవేటు వాహనాల్లో బయలుదేరుతున్నారని అక్కడి నేతలు తెలిపారు.


జగన్ దీక్ష ఏర్పాటు చూస్తున్న నాయకులకు, అభిమానులకు విజయవాడలోని స్థానిక అధికారుల నుంచి ఇబ్బందులు ఎదురు కాకున్నా.. స్థానిక అధికారులపై మాత్రం హైదరాబాద్ నుంచి విపరీతమైన ఒత్తిళ్లు వస్తున్నట్లు సమాచారం. ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న అంబటి రాంబాబు, కరుణాకర్ రెడ్డి తదితర నేతల బసకు ప్రభుత్వ అతిథి గృహాలు ఎందుకు ఇచ్చారని? వారిని ఖాళీ చేయించండని, చేయకపోతే కరెంటు, నీళ్లు బంద్ చేయండని.. హైదరాబాద్ నుంచి ఒత్తిళ్లు వస్తున్నట్లు స్థానిక అధికారి ఒకరు వాపోయారు. జగన్ దీక్షను అడ్డుకునేందుకు ఇలాంటి చిల్లరమల్లర ప్రయత్నాలు ఎన్ని జరుగుతున్నా ఎక్కడికక్కడ జనం తమకు అందుబాటులో ఉన్న వాహనాల్లో విజయవాడకు ప్రయాణమవుతున్నారు.


రైతు కుటుంబానికి జగన్ పెద్ద కొడుకు : ఓ అభిమాని


తన తండ్రి వైఎస్‌ఆర్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను ఓదార్చేందుకు ఒక కొడుకుగా బయలుదేరిన జగన్ జనంతో తన అనుబంధాన్ని బలంగా ముడివేసుకున్నారని ఓ అభిమాని విశ్లేషించారు. ‘మహానేత వైఎస్ సామాన్యుల జీవితాల్లో ఎంతటి బలమైన ముద్రవేసి పోయారో కళ్లారా చూశాం. రైతు సౌభాగ్యమే పరమావధిగా పాలన సాగించిన నేత మరణించిన ఏడాదికే.. రైతు కడగండ్లపై ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం చూపుతుంటే.. ఆ రైతుకు ఆసరాగా జగన్ స్పందించారు. జగన్ స్పందనలోని స్వచ్ఛత జనానికి అవగతమైంది కాబట్టే ఇంతటి అపూర్వ స్పందన కనిపిస్తోంద’ని వేదిక ఏర్పాట్లలో పాల్గొన్న ఆ అభిమాని విశదీకరించారు. ఇలా జగన్ ఈ రోజు రాష్ట్రంలోని ప్రతి రైతు కుంటుంబానికీ పెద్దకొడుకుగా పరివర్తన చెందాడంటూ తన భావాలను పంచుకున్నాడు ఆ అభిమాని.

జగన్‌ దీక్షకు... సర్వం సిద్ధం
canel 
రాజకీయ ఉద్యమాలకు పురిటిగడ్డగా పేరొందిన బెజవాడలో దివంగత ముఖ్యమంత్రి వై.యస్‌.రాజశేఖర రెడ్డి తనయుడు, మాజీ ఎంపి జగన్మోహన రెడ్డి మంగళవారం నుంచి 48గంటల పాటు చేపట్టనున్న ‘లక్ష్యదీక్ష’కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అధిక వర్షాలు, వరదలతో నష్టపోయిన రైతాంగాన్ని పూర్తిగా ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ పవిత్ర కృష్ణానది తీరాన ఉదయం 9గంటల నుంచి జగన్‌ నిరశన దీక్ష చేపడు తున్నారు. నిరశన దీక్ష జరిగే ప్రాంతానికి వై.యస్‌.ఆర్‌ ప్రాంగణంగా నామకరణం చేశారు. ఇటీవల భారీగా కురిసిన వర్షాలకు కోస్తా రైతాంగం పూర్తిగానష్టపోయింది. వరుసబెట్టి ప్రకృతి వైపరిత్యాలతో రైతుల పరిస్థితి దీనంగా మారింది.

ఈ క్రమంలో వారం రోజుల కిందట కృష్ణా, గుంటూరు జిల్లాలో జగన్‌ నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించారు. ఇన్‌పుట్‌ సబ్సిడీగా ఎకరాకు రూ.10వేలు ఇవ్వాలని, రుణాల రీ షెడ్యూలుతో పాటు రబీకి ఎరువులు, విత్తనాలు ఉచితంగా అందజేయాలని రెండు జిల్లాల పర్యటనలో జగన్‌ డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలోనే వారం రోజుల కిందట మచిలీపట్నంలో జరిగిన భారీ బహిరంగ సభలో రైతులకు న్యాయం చేసేందుకు 21, 22 తేదీల్లో 48గంటల పాటు విజయవాడలో నిరసన దీక్ష నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా గత నాలుగు రోజుల నుంచి కృష్ణాతీరాన దీక్షకు అవసరమైన ఏర్పాట్లను జగన్‌ వర్గీయులైన అంబటి రాంబాబు, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌, ఇతర అగ్రనేతలు విజయవాడలోనే ఉండి ఏర్పాట్లు చేశారు.

కృష్ణానది తీరాన లక్షన్నర మందికి పైగా వచ్చేందుకు అవకాశం ఉండటంతో ఆ దిశగా ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు.ఉష్ణోగ్రత తగ్గిపోవడంతో చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని లక్ష్యదీక్షలో పాల్గొనేవారు దుప్పట్లు తెచ్చుకోవాలని నిర్వాహకులు చెపుతున్నారు. అలాగే దీక్ష ప్రాంగణంలో తొక్కిసలాటకు ఆస్కారం లేకుండా బారికేడ్లను ఏర్పాటు చేయడంతో పాటు ఫ్లడ్‌ లైట్లను ఏర్పాటు చేశారు. ప్రాంగణంలో చలి గాలి వేయకుండా ప్రత్యేకంగా షామియానాలు ఏర్పాటయ్యాయి.

ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో మంగళవారం ఉదయం నగరానికి చేరుకుని జగన్‌ దీక్షలో పాల్గొంటున్నారు. ఇదిలా ఉండగా మరికొద్ది రోజుల్లో కొత్త పార్టీ పెట్టనున్నట్టు ప్రకటించిన జగన్‌ కోస్తాలో బలం పెంచుకునేందుకు లక్ష్యదీక్షను అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఈ దిశగా ఆయన ఏమేరకు సఫలీకృతం అవుతారనేది రెండు రోజుల దీక్షతో తేలనుంది. గతంలో రైతుల పక్షాన పాదయాత్ర చేసిన వై.యస్‌.రాజశేఖర రెడ్డి తదుపరి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారు. తండ్రి బాటలోనే జగన్‌ పయనించి రైతులను ఆకట్టుకునేందుకు తొలి ప్రయత్నం చేస్తున్నారు. మరో 10రోజుల్లో శ్రీకృష్ణ కమిటీ నివేదిక వెలుగు చూడనుంది. ఆ నివేదిక రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఉండొచ్చనే అభిప్రాయం సీమాంధ్రలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో ప్రాబల్యం పెంచుకునేందుకు కూడా జగన్‌ దీక్ష దోహదపడే అవకాశం ఉందంటున్నారు.

కోస్తాంధ్రలో ఎక్కువ శాతం మంది రైతులు వరి పండించే వారే. పైగా వీరిలో అత్యధికులు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు. రాష్ట్ర మంత్రివర్గంలో తగిన ప్రాధాన్యత లేదని ఆ సామాజిక వర్గంలో ఉన్న అసంతృప్తిని కూడా తనకు అనుకూలంగా మార్చుకునేందుకు జగన్‌ పావులు కదుపుతున్నారు. పైగా కీలక శాఖలు దక్కలేదనే అభిప్రాయంతో ఉన్న కాపు సామాజిక వర్గాన్ని కూడా తనవైపుకు తిప్పుకునే ప్రయత్నాలు ఆయన చేయవచ్చు.

నేటినుంచి జగన్ లక్ష్యదీక్ష

48 గంటలు నిర్వహణ... భారీ ఏర్పాట్లు.. తిరునాళ్ల సందడి... విశాలంగా వేదిక ఏర్పాటు.... ప్రాంగణంలో ఎల్‌సిడి టీవీలు... ఏర్పాట్లు పరిశీలించిన లక్ష్మీపార్వతి.......
 రైతులు, చేనేత కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎంపి, యువనేత వైఎస్ జగన్మోహనరెడ్డి తలపెట్టిన 48గంటల నిరాహార దీక్షకు విజయవాడలో కృష్ణానది ఇసుక తినె్నలపై ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. వేదిక ప్రాంగణంలో, వెలుపల మైక్‌లను ఏర్పాటు చేశారు. 100- 50 అడుగుల పొడవు, వెడల్పు, 10అడుగుల ఎత్తున భారీ వేదికను ఏర్పాటు చేశారు. ఎక్కడ నుంచి అయినా జగన్ కనపడేలా ఎల్‌సిడి స్క్రీన్‌లను, షామియానాలు ఏర్పాటు చేశారు. నదీగర్భంలో సగభాగం పైగా నీరు ఉండటంతో ఎవరూ అటువైపు వెళ్లకుండా బ్యారికేడ్లు నిర్మించారు. ఇక ఏర్పాట్లను చూడటానికి వచ్చిపోయే వారితో అక్కడ తిరునాళ్ల వాతావరణం నెలకొంది. సోమవారం ఉదయానే్న నందమూరి లక్ష్మీపార్వతి వచ్చి ప్రాంగణంలో కలియతిరిగి ఏర్పాట్లను పరిశీలించారు. రైతుల కోసం జగన్ చేపట్టిన దీక్షకు తాను సంపూర్ణ మద్దతునిస్తున్నానని, దీక్షలో కూడా పాల్గొంటానని ఆమె చెప్పారు. టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఎపిఐఐసి మాజీ చైర్మన్ అంబటి రాంబాబు, వైఎస్ తోడల్లుడు వైవి సుబ్బారెడ్డి, మాజీ కార్పొరేటర్ పి గౌతంరెడ్డి తదితరులు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మాజీ మంత్రి కొండా సురేఖ రెండు రోజుల నుంచి జన సమీకరణ కోసం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో మాజీ శాసనసభ్యులు జలీల్ ఖాన్, జ్యేష్ఠ రమేష్‌బాబు, కఠారి ఈశ్వరకుమార్, తదితర నేతలు జగన్‌కు మద్దతు పలికారు. ఈ రెండు రోజుల దీక్షలో మరికొందరు తెరపైకి వస్తారని చెబుతున్నారు. మాజీ మంత్రులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, బాలినేని శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, సినీనటులు జీవిత, రాజశేఖర్ మరికొందరు శాసనసభ్యులు ఈ దీక్షలో పాల్గొంటారని చెబుతున్నారు. వంగపండు ఉషా వేదికపై కళారూపాలను ప్రదర్శించబోతున్నారు. గుంటూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్, తాడి శకుంతల, ఏలేశ్వరరావు జగన్మోహన్ రాజు తదితరులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. వైఎస్ జగన్ మంగళవారం తెల్లవారుఝామున నంద్యాల నుంచి ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో నగరానికి చేరుకోనున్నారు. సరిగ్గా ఉదయం 9గంటలకు దీక్ష ప్రారంభిస్తారు. గురువారం ఉదయం దీక్షను ముగిస్తారు. రంగుమారిన ధాన్యాన్ని వెంటనే కొనాలని, ఇన్‌పుట్ సబ్సిడీని రెట్టింపు చేయాలని, రబీకి ఉచితంగా విత్తనాలు, ఎరువులు అందించాలని, రుణాలు రీషెడ్యూల్ చేసి తొలి ఏడాది వడ్డీ వసూలు చేయకుండా మారిటోరియం విధించాలని, ప్రతి రైతుకు అదనంగా 5వేల రూపాయల సహాయం అందించాలని, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందచేసి పావలా వడ్డీపై రుణాలందించాలని, చేనేత కార్మికులకు 10వేల రూపాయల ఆర్థిక సహాయం అందించాలనే డిమాండ్లతో జగన్ ఈ దీక్షను చేపడుతున్నారు. దీక్షను పురస్కరించుకొని పోలీసులు తొమ్మిదో నెంబర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. పలు ప్రాంతాల్లో పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేసి భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. బందోబస్తు ఏర్పాట్లను నగర పోలీస్ కమిషనర్ పి సీతారామాంజనేయులు పర్యవేక్షిస్తున్నారు.

గట్టి పోలీసు భద్రత
రెండు రోజుల పాటు జగన్‌ చేపట్టిన నిరసన దీక్షలో సీమాంధ్ర, తెలంగాణా జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు, రైతులు రానున్నందున పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు తీసుకుంటున్నారు. తొక్కిసలాటకు ఆస్కారం లేకుండా చర్యలు చేపట్టడంతో పాటు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరిస్తున్నారు.

No comments:

Post a Comment