జనం - జగన్

ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......

Tuesday, December 21, 2010

ఈ రాష్ట్రంలో ఉన్నందుకు సిగ్గు సిగ్గు




ఈ ప్రభుత్వం బండరాయి
రైతు ఘోష ఢిల్లీకి వినబడాలి
స్పందించకపోతే ఉద్యమం
మాజీ ఎంపీ జగన్ ప్రకటన
48 గంటల లక్ష్య దీక్ష మొదలు
విజయవాడలో భారీ సభ
దీక్షలో కనిపించని రైతులు
కాబోయే సీఎం జగన్: వక్తలు
జగన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన 23 మంది ఎమ్మెల్యేలు
కాంగ్రెస్ నేతల్లో కలకలం
కృష్ణా ఎమ్మెల్యేలు దూరం
ఛాయలకు రాని నగర నాయకత్వం 
రైతులను ఆదుకోలేని ప్రభుత్వం ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్నందుకు సిగ్గుతో తలదించుకుంటున్నానని కడప మాజీ ఎంపీ వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. ఎన్నికలు ఇంకా మూడేళ్లు ఉన్నాయి కదా అని భావిస్తే, ఆ మూడేళ్లు కళ్లు మూసుకుని తెరిచేలోగా ముగుస్తాయని, అప్పుడు ఈ ప్రభుత్వానికి కనీసం డిపాజిట్లు కూడా రావని హెచ్చరించారు. రైతు సమస్యల పరిష్కారం కోరుతూ 48 గంటల పాటు విజయవాడ కృష్ణా నదీ తీరాన జగన్ మంగళవారం నిరాహారదీక్షకు కూర్చున్నారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సామూహిక దీక్షకు హాజరైన రైతు ఘోష.. ఢిల్లీలోని పెద్దలకు వినబడితే అప్పుడైనా వారికి కనువిప్పు కలుగుతుందేమోనని వ్యాఖ్యానించారు. రైతు సమస్యలపై స్పందించని సర్కారును ఆయన బండరాయితో పోల్చారు. రంగుమారిన ధాన్యాన్ని శాతాలతో నిమిత్తం లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం స్పందించని పక్షంలో ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తానని జగన్ వెల్లడించారు. రైతు సమస్యలపై ఏర్పాటు చేసిన ఈ దీక్షకు భారీగా రైతులు వస్తారని తొలుత ప్రకటించినప్పటికీ.. అసలు రైతులే కనిపించకపోవడం గమనార్హం. జగన్ అభిమానులు మాత్రం పెద్ద సంఖ్యలోనే హాజరయ్యారు. మరోవైపు 23 మంది ఎమ్మెల్యేలు జగన్‌కు మద్దతు పలుకుతూ దీక్షలకు హాజరు కావడం కాంగ్రెస్‌లో సంచలనం రేపింది.


రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రైతు ప్యాకేజీపై నేరుగా యుద్ధం ప్రకటించిన జగన్ దీక్షలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాల్గొనడం పట్ల మంగళవారం పార్టీ నేతల మధ్య విస్తృత చర్చ జరిగింది. దీక్షకు హాజరైన వారిపట్ల కఠినంగా వ్యవహరించాలన్న అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తుంటే.. ఇప్పుడే క్రమశిక్షణా చర్యల అవసరం లేదని కొందరంటున్నారు.

దీక్షకు వారు హాజరు కావడం వెనుక గల కారణాలపై నేతలు ఆరా తీస్తున్నారు. జగన్ దీక్షకు హాజరైన ప్రజా ప్రతినిధుల్లో అధికులకు... జగన్ దీక్షకు హాజరు కాకుంటే నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని తమ పార్టీలో చేర్చుకుని, వచ్చే ఎన్నికల్లో ఓటమి రుచి చూపిస్తామంటూ బెదిరింపులు వస్తున్నందునే ఆందోళనకు గురై దీక్షలో పాల్గొన్నారని పార్టీ నేతలు వివరిస్తున్నారు.


శాసనసభ్యుల పరేడ్‌తో ప్రభుత్వంపై మానసిక యుద్ధం చేయాలన్న జగన్ వ్యూహానికి.. ప్రజా బలమే ప్రతివ్యూహమని.. దీనితోనే సమాధానం చెప్పాలని రాష్ట్ర నేతలు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ప్రజల్లో ప్రభుత్వ పాలనపై విశ్వాసాన్ని పెంచుకోవచ్చని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి భావిస్తున్నారు.

అందుకే రాష్ట్ర నాయకత్వం జగన్ దీక్షలను అసలు గుర్తించడం లేదని తేల్చేసింది. కాగా.. రైతు సమస్యలపై ఏర్పాటు చేసిన లక్ష్య దీక్ష.. రాజకీయ లక్ష్య దీక్షగానే సాగిందనే విమర్శలు వినిపించాయి. దీక్ష వేదికపై మాట్లాడిన పలువురు నేతలు, ఎమ్మెల్యేలు జగన్‌ను పొగడ్తల్లో ముంచెత్తడానికి, భావి సీఎంగా స్తుతించడానికి పోటీలు పడ్డారు.

జగన్ ఉపన్యాసం కూడా ఎన్నికలు.. డిపాజిట్లు అంటూ సాగింది. ఇదిలా ఉండగా.. దీక్ష జరుగుతున్న జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఒక్కరూ సభా స్థలి ఛాయలకు కూడా రాకపోవడం ఆశ్చర్యకరమైతే... నగర కాంగ్రెస్ ముఖ్య నాయకత్వం దీక్షకు దూరంగా ఉండటం కొసమెరుపు!!

ఢిల్లీ దిగిరావాలి... రైతన్నని ఆదుకోవాలి
jagans 
‘కల్లాల్లోకి వెళ్లి రైతులు కన్నీళ్లు పెడుతున్నారు... చేనేత కార్మికులు దీన స్థితిలో దిక్కుతోచక చూస్తున్నారు. చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో, రైతులు ముఖ్యంగా కౌలు రైతుల సమస్యలపై ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా బండగా మారినందుకు సిగ్గుగా ఉందని’ దివంగత ముఖ్యమంత్రి వై.యస్‌. రాజశేఖరరెడ్డి కుమారుడు, కడప లోక్‌సభ మాజీ సభ్యుడు వై.యస్‌.జగన్మోహనరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలపై ఇక్కడ చేసే నినాదం కేంద్రాన్ని మేలు కొలిపి రాష్ర్ట ప్రభుత్వాన్ని కదిలి స్తుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి కృషితో ఏర్పడిన ప్రభుత్వానికి ఆయన స్ఫూర్తి కొరవడిందని విమర్శించారు.

కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలపై ఏకకాలంలో విమర్శనాస్త్రాలు సంధించి రైతు పక్షాన వై.యస్‌. తర్వాత తానేనని చెప్పకనే చెప్పుకు న్నారు. రైతులు, చేనేత కార్మికులు ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ జగన్‌ 48గంటల పాటు చేపట్టిన లక్ష్యదీక్ష మంగళవారం ఉదయం సీతమ్మవారి పాదాల దిగువన కృష్ణానది ఒడ్డున ప్రారంభమైంది. నిర్ధేశిత సమయానికంటే రెండు గంటలు ఆల స్యంగా ప్రారంభమైన ఈ కార్యక్రమానికి కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి వేలాది మంది హాజరయ్యారు. వీరిని ఉద్దేశించి జగన్‌ మాట్లా డుతూ రైతాంగం నేడు ప్రత్యేక పరిస్థితుల మధ్య బతుకుతున్నట్టు చెప్పారు. ఏడాది కాలంగా రైతులు దెబ్బ మీద దెబ్బ తింటున్నట్టు తెలిపారు. ప్రత్యేక పరిస్థితుల్లో ప్రభుత్వం పట్టించుకోకుంటే ఇంక ఎప్పుడు పట్టించుకుంటారని, ఎంతమంది రైతులు చావాలని ఆయన ప్రశ్నించారు.

rojaa 

దివంగత వై.యస్‌. స్ఫూర్తి అంతో ఇంతో ఉందనుకుంటున్న ప్రభుత్వానికి అది ఏమైందని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. గతంలో వై. యస్‌. ప్రతిపక్ష నేతగా ఉచిత విద్యుత్‌ వాగ్దానం చేస్తే కొందరు తీగలపై దుస్తులు ఆరేసుకోవాలని ఎగతాళి చేశారని ఆయన చెప్పారు. తాను అధికా రంలోకి రాగానే కష్టమైనా, నష్టమైనా ఉచిత విద్యుత్‌ ఫైలుపై సంతకం చేసి వై.యస్‌.ఆర్‌ ఆదుకు న్నట్టు తెలిపారు. ఇబ్బం దుల్లోని రైతులను ఆదుకు నేందుకు ఎకరాకు రు.5వేల చొప్పున, 1800 కోట్లకు సంబంధించిన ఫైలుపై నిమిషం కూడా ఆలోచించకుండా వైయస్‌ సంతకం చేశారని చెప్పారు. రైతుల పక్షాన నిలబడని ప్రభుత్వానికి పోయే కాలం వచ్చినట్టేనని గుర్తుంచుకోవాలని ఆయన పేర్కొన్నారు.

ఇన్‌పుట్‌ సబ్సిడీ రెట్టింపు చేయాలని అడిగితే ఆరొందలు మాత్రమే పెంచుతామంటున్నారని, రూ.600లతో బస్తా యూరియా కూడా రాదనే విషయం ప్రభు త్వం గుర్తించుకోవాలని ఆయన చెప్పారు. తడిసిన, రంగు మారిన, మొలకెత్తిన ధాన్యం కొనుగోలు చేయమంటే ప్రభుత్వం కనీస మద్దతు ధరకు 10 శాతం మాత్రమే కొంటామని చెప్పడం సిగ్గుచ ేటన్నారు. 10 శాతం పోను మిగిలినది 50శాతం నిబంధనల మేరకు కొంటే రైతుకు ఒరిగేదేమీ లేదన్నారు. కర్నాటకలో రైతులకు బోనస్‌ ఇస్తారని, ఇక్కడి పరిస్థితి చూస్తే రాష్ట్రానికి చెందిన వాడిగా సిగ్గు పడుతున్నానని ఆయన తెలిపారు.

dhrana 

ఈ రాష్ట్రాన్ని మిగిలిన రాష్ట్రాల కంటే గొప్పగా చేయా లంటే రబీలో రైతులకు ఎరువులు, విత్తనాలు ఉచితంగా అందజేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. గతంలో వై.యస్‌.రాజశేఖర రెడ్డి మాదిరి గానే ఎకరాకు రు.5వేలు వెంటనే ఇవ్వాలన్నారు. కౌలు రైతుల బాధలు వింటుంటే గుండె తరుక్కు పోతుందని చెపుతూ ఇప్పటి వరకు కౌలు రైతులకు సంబంధించి ప్రభుత్వం ఆలోచన కూడా చేయ కపోవడం శోచనీయమన్నారు. వీరికి తగిన న్యా యం చేయాలని జగన్‌ డిమాండ్‌ చేశారు. చేనేత రై తులు పూర్తి కష్టాల్లో కూరుకుపోయారని ఆయన చెెప్పారు. చేనేత కార్మికుల కష్టాలు తీర్చేం దుకు నా డు వై.యస్‌.రాజశేఖర రెడ్డి బడ్జెట్‌లో చీ.312 కేటా యిస్తే, నేడు ప్రభుత్వం రు.38కోట్లు ఇచ్చి చేతులు దులుపుకోవడం సిగ్గుగా ఉందన్నారు. గతంలో చేనే త కార్మికులకు వై.యస్‌. పావలా వడ్డీకే రుణాలు ఇస్తే, నేడు ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు.

ఎన్నికలకు మరో మూడేళ్లు వ్యవధి ఉందనుకుంటే పొరపాటని, మూడేళ్లు కళ్లు తెరచి మూసేలోగా పూర్తవుతాయని అన్నారు. ఆ తర్వాత జరిగే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావనే విష యాన్ని కాంగ్రెస్‌ పార్టీ గుర్తుంచుకోవాలని ఆయన చెప్పారు. మనం చేపట్టిన 48 గంటల నిరాహార దీక్ష ధ్వని ఢిల్లీదాకా వినిపించాలని, అక్కడి నుంచి ఫోన్‌ వస్తే ఇక్కడేమైనా కదు లుతారేమోనని ఆయన అన్నారు. రైతులకు, చేనేత కార్మికులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని ఈ సందర్భంగా జగన్‌ డిమాండ్‌ చేశారు. 


ఇంకెందరు చనిపోవాలి?

‘లక్ష్య దీక్ష’లో సర్కారుపై వైఎస్ జగన్ ధ్వజం
 
* సర్కారు బండరాయిలా మారిపోయింది* అన్నదాతల ఆకలి కేకలు పట్టవా?* ఈ ప్రభుత్వానికి వైఎస్ స్ఫూర్తి కొరవడింది?* ఈ రోజు ఎక్కడ చూసినా రైతు కంట కన్నీరే కనిపిస్తోంది* ప్రభుత్వానికి మాత్రం ఆ కన్నీళ్లు కనిపించడం లేదు* సర్కారుకు, వ్యాపారులకు తేడా లేకుండాపోయింది* పూర్తి పంటను కొనాలి.. మద్దతు ధర పూర్తిగా ఇవ్వాలి* రైతు గుండె చప్పుడు కేంద్రానికి వినపడాలి.. అక్కడి నుంచి ఫోన్లు వస్తే అయినా వీరు కదులుతారని ఆశిద్దాం

రైతు సోదరుల ఆకలి కేకలను పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం బండరాయిలా మారిపోయిందని యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. ప్రభుత్వం స్పందించాలంటే ఇంకా ఎంతమంది రైతులు చనిపోవాలని ఆయన ప్రశ్నించారు. ‘రైతుల గుండె చప్పుడు కేంద్రానికి వినపడాలి. అక్కడి నుంచి ఫోన్లు వస్తే అయినా వీరు కదులుతారని ఆశిద్దాం’ అని అన్నారు. రైతులు, కౌలు రైతులు, చేనేత కార్మికులను ఆదుకోవాలని కోరుతూ జగన్ చేపట్టిన 48 గంటల సామూహిక నిరాహార దీక్ష.. విజయవాడ కృష్ణానదీ తీరంలో సీతమ్మవారి పాదాల వద్ద మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. యువనేత ఉదయం నంద్యాల నుంచి ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడ చేరుకున్నారు. కనకదుర్గ గుడిలో పూజలు చేసి, వన్‌టౌన్‌లోని హజరత్ సయ్యద్ గాలిబ్ దర్గాలో ప్రార్థనలు నిర్వహించిన అనంతరం వైఎస్‌ఆర్ దీక్షా ప్రాంగణానికి చేరుకున్నారు. అక్కడ మౌనముద్రలో ఉన్న వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి ‘లక్ష్య దీక్ష’ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా యువనేత ప్రసంగం ఆయన మాటల్లోనే..

ఇది వైఎస్ స్థాపించిన ప్రభుత్వం కాదా?
‘ఈ ఏడాది కాలంలో మూడుసార్లు వచ్చిన తుపాన్లతో దెబ్బమీద దెబ్బ పడుతూ ఉంటే రైతు సోదరులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఈ ప్రత్యేక పరిస్థితుల్లో అయినా ప్రభుత్వం స్పందించకపోతే మరింకెప్పుడు స్పందిస్తుంది? ఇంకా ఎంతమంది రైతులు చనిపోవాలి? దివంగత ముఖ్యమంత్రి వైఎస్ స్థాపించిన ప్రభుత్వం కాదా ఇది? నాడు రైతులపై చూపిన ఔదార్యం నేడు ఏమైంది? ఇంకా వైఎస్‌పై ప్రేమ, వాత్సల్యం ప్రభుత్వానికి ఉన్నాయనుకున్నాను. ఒక మాట ఇస్తే కష్టమైనా, నష్టమైనా మాటపై ఎలా నిలబడాలనే విషయం వైఎస్ దగ్గర నేర్చుకోవాలి.’

రైతు పక్షాన లేకుంటే పోయేకాలమే
‘ఎంతకాలం బతికామన్నది ముఖ్యం కాదని, బతికినంత కాలం ఎలా బతికామన్నది ముఖ్యమని వైఎస్ చెప్పేవారు. 2004 ఎన్నికల సందర్భంగా రైతులకు ఉచిత కరెంట్ ఇస్తామని వాగ్దానం చేశారు. ఉచిత కరెంట్ ఇస్తే తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందేనని నాటి పాలకపక్షమైన టీడీపీ ఎద్దేవా చేసింది. వైఎస్ మాట ఇచ్చారు కాబట్టి అధికారంలోకి రాగానే ఎంత కష్టమైనా, నష్టమైనా ఉచిత విద్యుత్‌కు సంబంధించిన ఫైలుపైనే తొలిసారిగా సంతకం పెట్టారు. వరదల వల్ల పంట దెబ్బతింటే రైతులకు రుణమాఫీ కోసం రూ. 1,800 కోట్లు ఖర్చయినా ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆ ఫైల్‌పై సంతకం చేశారు. రైతుల పక్షాన నిలబడకపోతే ఏ ప్రభుత్వానికైనా పోయే కాలం వచ్చినట్లే.’

రైతు ముఖాన కన్నీళ్లే కనబడుతున్నాయి
‘ఏనాడైతే రైతు కంట కన్నీరు వస్తుందో ఆనాడు రాష్ట్రం అధోగతి పాలవుతుంది. ఈ రోజు పొలాలకు పోయి చూస్తే రైతు ముఖాన కన్నీళ్లు తప్ప మరోటి కనపడడం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం అవి కనపడడం లేదు. ఇక్కడ ప్రభుత్వం తరపున ఇంటెలిజెన్స్ వారు ఉంటారు... రైతు గుండె చప్పుడు వారికి వినపడితే అదే పదివేలు.’

సాయమంటే ఇదా?
‘ప్రసుతం ఇస్తున్న ఇన్‌పుట్ సబ్సిడీని రూ.1,800 నుంచి రూ. 3,600 పెంచాలని డిమాండ్ చేస్తే కేవలం రూ. 600 పెంచి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకుంది. పెంచిన మొత్తం ఒక యూరియా బస్తాకు కూడా సరిపోదు. ఈ విషయం ప్రభుత్వానికి ఎందుకు అర్థం కావడం లేదు. తడిసిన, రంగుమారిన, మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరగా, పది శాతం మాత్రమే కనీస మద్దతు ధరకు కొనడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. పంట చేతికి రాక నష్టపోయిన రైతన్న వద్ద 50 శాతం ధాన్యం మాత్రమే కొంటాననడం ఎంతవరకూ సమంజసం. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యాపారులకు తేడా కనపడడం లేదు. పూర్తి పంటను కొనాలి. పూర్తి కనీస మద్దతు ధర ఇవ్వాలి. 50 శాతం ధాన్యం మాత్రమే కొంటే బస్తాకు ఐదారు వందల రూపాయలు మించి రావు. కనీసం బస్తాకు రూ. వెయ్యి అయినా ఇవ్వాలి.’

సిగ్గుపడుతున్నాను
‘ఇలాంటి ప్రభుత్వం ఉన్న రాష్ట్రంలో ఉన్నందుకు నేను సిగ్గుపడుతున్నాను. కర్ణాటకలో రైతులకు గిట్టుబాటు ధరతో పాటు బోనస్ కూడా ఇస్తున్నారు. వైఎస్ స్ఫూర్తితో ఎన్నికైన ప్రభుత్వం కాబట్టి మిగిలిన ప్రభుత్వాలకన్నా ఎక్కువ ధర ఇవ్వాలి. రైతులకు రబీలో విత్తనాలు, ఎరువులు ఉచితంగా ఇవ్వాలి. ప్రతి రైతు సోదరుడికీ ఎకరాకు రూ. ఐదు వేలు అందాల్సిందే. కౌలు రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. డ్వాక్రా మహిళలు పావలా వడ్డీతో తీసుకున్న డబ్బులకు మరికొంత వడ్డీకి తీసుకువచ్చి పంటపై పెట్టుబడి పెట్టారు. వారికి బ్యాంకులు రుణాలు కూడా ఇవ్వడం లేదు. కౌలు రైతుల గురించి ఇప్పటికైనా ఆలోచించకపోతే మరెప్పుడు ఆలోచిస్తారు.’

నిర్లక్ష్యం చేస్తే డిపాజిట్లు కూడా రావు
‘నూలురేట్లు పెరిగాయని ధర్మవరంలో చేనేత కార్మికులు పది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. గత ఏడాది తొమ్మిది వందలు ఉన్న నూలు ధర ఆరుసార్లు పెరిగి రూ.1,800 అయితే ఈ ప్రభుత్వం నిద్రపోతోందా? వైఎస్ బతికి ఉన్నపుప్పడు చేనేత కార్మికులకు అప్పు మాఫీ చేసేందుకు బడ్జెట్‌లో రూ. 312 కోట్లు కేటాయించారు. ఈ ప్రభుత్వం కేవలం రూ. 38 కోట్లు మాత్రమే కేటాయించడం సిగ్గుగా ఉంది. చేనేత కార్మికులకు పావలావడ్డీకి రుణాలు ఇవ్వడం లేదని ప్రకటించిందని, ఈ ప్రభుత్వం బండరాయిగా మారిందని చెప్పడానికి సిగ్గుగా ఉంది. లక్షల మంది రైతన్నలు ఇక్కడ చేరి తమ ఆకలి కేకలు వినాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని చేతులు జోడించి ప్రార్థిస్తున్నా. ఇంకా మూడేళ్ల సమయం ఉంది కదా.. అని ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావు.’

కేంద్రం దిగిరావాలి
రైతన్న, నేతన్నల సమస్యల పరిష్కారం కోసం యువనేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన లక్ష్యదీక్షలో ప్రతిధ్వనించే నినాదం కేంద్ర ప్రభుత్వంలో వణుకు పుట్టించాలని, కేంద్రం దిగిరావాలని మాజీ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. కృష్ణానదీ తీరంలోని వైఎస్సార్ ప్రాంగణంలో మంగళవారం లక్ష్యదీక్షకు హాజరైన అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఈ దీక్షను విఫలం చేసేందుకు చాలా శక్తులు పని చేస్తున్నాయని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ‘జగన్ ప్రభంజనాన్ని వేయి కళ్లు పరిశీలిస్తున్నాయి, భవిష్యత్ కార్యాచరణ ఏమిటని నిఘా నేత్రాలు వెంటాడుతున్నాయి, ఎన్ని ఇబ్బందులు, ఆటంకాలెదురైనా సత్తా చూపించి జగన్‌కు అండగా ఉండాలి’ అని అన్నారు. వైఎస్ చనిపోయినప్పటి నుంచి రాష్ట్రం సమస్యల సుడిగుండంలో చిక్కుకుందని, అధికారాన్ని కాపాడుకుంటూ కాంగ్రెస్ నేతలు కాలం వెళ్లదీస్తున్నారని చెప్పారు. ‘జగన్ చేపట్టిన 48 గంటల దీక్షతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగిరావాలి. అన్ని దారులూ బెజ వాడ చేరుకోవడం దేశమంతా చర్చనీయాంశమైంది. చివరకు కాంగ్రెస్ ప్లీనరీలో కూడా అభద్రతాభావం నెలకొంది. అన్ని పార్టీలనూ జగన్ ఫోబియా పీడిస్తోంది’ అని తెలిపారు. తొమ్మిదేళ్ల పాలనలో రైతులను పట్టించుకోని చంద్రబాబు నేడు దీక్ష చేస్తుంటే ఒక్క రైతు కూడా రాలేదని.. టీడీపీ శ్రేణులు తరలించిన కార్యకర్తలే దీక్షలో పాల్గొన్నారని ఎద్దేవా చేశారు. రైతులంటే ఎవరికి నిజమైన ప్రేమ ఉందో, ఎవరిది కపట ప్రేమో ప్రజలు అర్థం చేసుకుంటున్నారన్నారు. ‘జోహార్ వైఎస్సార్.. జై జగన్..’ అంటూ ఆమె చేసిన నినాదాలకు.. అభిమానులూ గళం కలపడంతో వైఎస్సార్ ప్రాంగణం మార్మోగింది.

కాంగ్రెస్‌కు పోయేకాలం దగ్గరైంది

కాంగ్రెస్ ప్రభుత్వానికి పోయే కాలం దగ్గర పడింది. రైతాంగం స్వచ్ఛం దంగా తరలివస్తున్నా మంత్రులు డీఎల్ రవీంద్రారెడ్డి, శంకర్రావు అవాకులు చవాకులు పేలుతున్నారు. డబ్బులిచ్చి జనాన్ని సభకు తరలించారని, వచ్చిన వాళ్లు రైతులే కాదని అంటున్న మంత్రులు.. దమ్ము, ధైర్యం ఉంటే ఇక్కడకు వచ్చి మాట్లాడాలి.

-రాజశేఖర్, సినీ హీరో

ఆశయాలు అమలు చేయమనడమే నేరమా?

పుట్టినరోజు వేడుకలు చేసుకోవాల్సిన రోజున జగన్.. రైతు, చేనేత కార్మికుల సమస్యలపై దీక్షలో కూర్చున్నారు. వైఎస్ పథకాలను, ఆశయాలను అమలు చేయాలని కోరడమే జగన్ చేసిన నేరమా?
-జీవిత, సినీ నటి

మాజీ మంత్రి కొండా సురేఖ, యన్‌టిఆర్‌ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు లక్ష్మీ పార్వతి, సినీనటి రోజా తమ ప్రసంగాల్లో రైతు లను ఆదుకోవాలన్నారు. టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూ మన కరుణాకర రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్య క్రమంలో జగన్‌ సన్నిహితులు అంబటి రాంబాబు, వై.యస్‌. తోడల్లుడు వై.వి.సుబ్బారెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, మాజీమంత్రులు, సినీరంగ ప్రముఖు లు పాల్గొని జగన్‌కు మద్దతుగా నిలిచారు. 
యువనేత వెంటే మేమూ..

జగన్‌కు ఒక ఎంపీ, 23 మంది ఎమ్మెల్యేల మద్దతు

మద్దతు తెలిపిన ఎమ్మెల్యేల్లో ఇద్దరు టీడీపీ, ఒకరు పీఆర్పీకి చెందినవారు
దీక్షలో పాల్గొన్న ముగ్గురు ఎమ్మెల్సీలు
అనేక మంది మాజీ మంత్రులు,
ప్రముఖ నేతల మద్దతూ యువనేతకే



యువనేత జగన్ లక్ష్య దీక్షకు అభిమాన జనంతోపాటు ప్రజా నేతలూ పెద్దఎత్తున తరలివచ్చారు. 23 మంది ఎమ్మెల్యేలు, అనకాపల్లి ఎంపీ సబ్బం హరి వేదికపై జగన్ వద్దకొచ్చి మద్దతు ప్రకటించారు. ఎమ్మెల్యేల్లో 20 మంది కాంగ్రెస్‌కు చెందిన వారు కాగా, ఇద్దరు టీడీపీ, ఒకరు పీఆర్పీ వారు కావడం గమనార్హం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాసరెడ్డి (ఒంగోలు), కొండా సురేఖ (పరకాల), పిల్లి సుభాష్‌చంద్రబోస్ (రామచంద్రపురం), శ్రీకాంత్‌రెడ్డి (రాయచోటి), మేకపాటి చంద్రశేఖరరెడ్డి (ఉదయగిరి), నల్లమిల్లి శేషారెడ్డి (అనపర్తి), ఆళ్ల నాని (ఏలూరు), జయసుధ (సికింద్రాబాద్), డి.బాబూరావు (పాయకరావుపేట), గుర్నాథరెడ్డి (అనంతపురం), కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి (ధర్మవరం), కాపు రామచంద్రారెడ్డి (రాయదుర్గం), ఆదినారాయణరెడ్డి (జమ్మలమడుగు), మద్దాల రాజేష్ (చింతలపూడి), టి.బాలరాజు (పోలవరం), ఎం.ప్రసాదరాజు (నరసాపురం), పి.అంజిబాబు (భీమవరం), ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి (కాకినాడ టౌన్), రేగ కాంతారావు (పినపాక), లబ్బి వెంకటస్వామి (నందికొట్కూరు), టీడీపీ ఎమ్మెల్యేలు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి (కోవూరు), బాలనాగిరెడ్డి (మంత్రాలయం), పీఆర్పీకి చెందిన మహేశ్వర్‌రెడ్డి (నిర్మల్) ఉన్నారు. ఎమ్మెల్సీలు పుల్లా పద్మావతి, టీవీజీవీ కృష్ణారెడ్డి, జూపూడిప్రభాకర్ దీక్షలో పాల్గొన్నారు.

మరెందరో మాజీలు


మాజీ మంత్రులు అనేక మంది జగన్‌కు మద్దతు తెలిపారు. వీరిలో జంగా కృష్ణమూర్తి, చల్లా వెంకటకృష్ణారెడ్డి, కొణతాల రామకృష్ణ, మూలింటి మారెప్ప, జలీల్‌ఖాన్, మాజీ ఎమ్మెల్యేలు రావి వెంకటరమణ, వరుపుల సుబ్బారావు, ముద్రగడ పద్మనాభం, కొర్రి పున్నారెడ్డి, మాకినేని పెదరత్తయ్య, గండి బాబ్జి, సామినేని ఉదయభాను, భూమా నాగిరెడ్డి, మేకా ప్రతాప్ అప్పారావు, మాజీ ఎమ్మెల్సీ రెహ్మాన్ తదితరులు దీక్షా శిబిరానికి వచ్చారు.

లక్ష్య దీక్షలో ప్రముఖులు: టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఏపీఐఐసీ మాజీ చైర్మన్ అంబటి రాంబాబు, వైవీ సుబ్బారెడ్డి, హాస్య నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం, సినీ నటి రోజా, సినీ హీరో రాజశేఖర్, జీవిత, గోనె ప్రకాశరావు, నందమూరి లక్ష్మీపార్వతి, శాప్ మాజీ చైర్మన్ పీఎన్‌వీ ప్రసాద్, తాడి శకుంతల, ఆళ్ల దశరథరామిరెడ్డి, చిక్కా విజయభాస్కరరెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ మేరుగ నాగార్జున, తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి, సినీ నటుడు విజయచందర్, అదిలాబాద్‌కి చెందిన జానకీప్రసాద్, నెల్లూరు జిల్లా నేత కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, జొన్నా సూర్యనారాయణ, ఏవీ సూర్యనారాయణ, జక్కంపూడి విజయలక్ష్మి, లేళ్ల అప్పిరెడ్డి, గౌతంరెడ్డి, వైవీ భద్రారెడ్డి, కృష్ణప్రసాద్, కూచిపూడి సాంబశివరావు తదితరులు వేదికపై ఉన్నారు.

పంట దెబ్బతిని కడుపు మండిన లక్షలాది మంది రైతన్నల పదఘట్టనలతో విజయవాడ దద్దరిల్లింది.. తాము ఓటేస్తే గెలిచి తమను పట్టించుకోని సర్కారు తీరుపై నిరసన నినాదం రణన్నినాదంలా మార్మోగింది.. తమ తరఫున పోరాడుతున్న యువనేత జగన్‌మోహన్‌రెడ్డికి తోడుగా వచ్చిన అన్నదాతలు, చేనేత కార్మికులతో మంగళవారం బెజవాడ స్తంభించిపోయింది.. లక్ష మందితో సామూహిక నిరాహార దీక్ష చేస్తానని యువనేత ప్రకటిస్తే... తొలిరోజే రెండు లక్షలకుపైగా తరలివచ్చిన జనంతో ‘లక్ష్య దీక్ష’ ప్రాంగణం హోరెత్తిపోయింది.. కృష్ణా తీరాన ఏర్పాటు చేసిన ‘వైఎస్సార్ దీక్షా ప్రాంగణం’ జనప్రవాహంతో పోటెత్తింది. వెల్లువెత్తిన లక్షలాది మంది జనం నడుమ, కృష్ణమ్మ సాక్షిగా, సీతమ్మ పాదాల వద్ద యువనేత వైఎస్ జగన్ ఉదయం ‘లక్ష్య దీక్ష’ ప్రారంభించారు. కృష్ణా ప్రవాహంలా తరలి వచ్చిన రైతులు, చేనేత కార్మికులు ఆయనతోపాటు 48 గంటల నిరాహార దీక్షలో కూర్చున్నారు. మెతుకు ముట్టబోమని, మడమ తిప్పబోమని తేల్చి చెప్పారు.

ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆశీస్సులు, దర్గాలో దీవెనలు అందుకున్న జగన్ మంగళవారం ఉదయం 11.00 గంటలకు నిరాహార దీక్ష చేపట్టారు. సోమవారం కడప, కర్నూలు జిల్లాల్లో అలుపెరగకుండా పర్యటించి, రాత్రంతా రైల్లో ప్రయాణించి వచ్చిన ఆయన కొద్దిసేపైనా విశ్రాంతి తీసుకోకుండానే నిరాహార దీక్ష మొదలు పెట్టారు. యువనేత వైఎస్సార్ ప్రాంగణానికి చేరుకునే సమయానికే ఇసుక తిన్నెల ప్రాంతం జనంతో కిక్కిరిసిపోయింది. వందలాది మంది నేతలు, అభిమానులు స్వాగతం పలుకుతుండగా జగన్ వేదికపైకి వచ్చి, వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి దీక్షలో కూర్చున్నారు.


ఆయనతోపాటు మాజీ మంత్రులు కొండా సురేఖ, బాలినేని శ్రీనివాసరెడ్డి, పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్సీలు జూపూడి ప్రభాకర్, పుల్లా పద్మావతి, వందలాది మంది నేతలు దీక్ష చేపట్టారు. ఎమ్మెల్యేలు, పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నేతలు వైఎస్సార్ ప్రాంగణానికి వచ్చి జగన్‌కు మద్దతునిచ్చారు. నందమూరి లక్ష్మీపార్వతి, రోజా, రాజశేఖర్-జీవిత దంపతులు, రాజా, విజయచందర్ తదితరులు దీక్షా శిబిరానికి వచ్చారు. వేదికపై నేతల ప్రసంగాలు సాయంత్రం వరకూ సాగాయి. సాయంత్రం 4.30 గంటలకు జగన్ మాట్లాడారు. ఆయన మాట్లాడుతున్నంత సేపూ అభిమానులు కృష్ణా తీరాన్ని హోరెత్తించారు. అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి జగన్ చేసిన ప్రసంగం పదునైన పదాలతో కొత్తపుంతలు తొక్కింది.


బెజవాడ హౌస్‌ఫుల్
* కిక్కిరిసిన రహదారులు * నగరం అంతటా దీక్ష ప్రభావం


జగన్ చేస్తున్న లక్ష్య దీక్షకు జనం పోటెత్తడంతో విజయవాడ కిటకిటలాడింది. సోమవారం సాయంత్రం నుంచి మొదలైన జనప్రవాహం మంగళవారానికి మరింత ఉద్ధృతమైంది. దీంతో దసరా ఉత్సవాలు, భవానీ దీక్షల విరమణ సమయంలో ఇంద్రకీలాద్రి పరిసరాల్లో ఉండే వాతావరణం కనిపించింది. సీతమ్మవారి పాదాల ఇసుక తిన్నెలు, కృష్ణలంక హైవే సహా నగరమంతటా జగన్ దీక్ష ప్రభావం కనిపించింది. లాడ్జీలు, హోటళ్లు, మార్కెట్లు, రోడ్లు.. ఎక్కడ చూసినా జనమే కనిపించారు. దీక్షకు తరలివచ్చిన వారిలో కొందరు ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకుని మళ్లీ దీక్షాస్థలికి వచ్చారు. దీంతో దుర్గ గుడిలోనూ సందడి నెలకొంది. వివిధ జిల్లాల నుంచి అనేకమంది సొంత వాహనాల్లో తరలివచ్చారు.

పోలీస్ కంట్రోల్‌రూమ్ వద్ద ఎన్నడూ లేని స్థాయిలో వాహనాల రద్దీ పెరిగిపోయింది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన లారీలు, కార్లతో భారీగా ట్రాఫిక్ జాం అయింది. వాహనాలను పార్క్ చేసుకునేందుకు అనువైన ప్రాంతాలు తక్కువగా ఉన్నందున వాహనాలను పోలీసులు నగర శివార్లలోనే నిలిపివేశారు. వేలాది మంది నడుచుకుంటూనే దీక్షా ప్రాంగణానికి వచ్చారు. దీంతో ఇబ్రహీంపట్నం నుంచి విజయవాడ కనకదుర్గ వారధి వరకూ తొమ్మిదో నెంబరు జాతీయ రహదారి కిక్కిరిసిపోయింది. బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు, వన్‌టౌన్, రింగ్‌రోడ్డు, సింగ్‌నగర్, సత్యనారాయణపురం తదితర ప్రాంతాల్లో రోడ్లన్నీ బ్లాక్ అయ్యాయి. రైళ్ల ద్వారా కూడా జనం పెద్దఎత్తున రావడంతో స్టేషన్ కిటకిటలాడింది.

ట్రాఫిక్ మళ్లింపు..
విజయవాడలో రోడ్లన్నీ జనసంద్రంగా మారడంతో పోలీసులు నగరంలోని సిటీ బస్సులను అప్పటికప్పుడు వేరే రూట్ల గుండా మళ్లించారు. బందరు, ఏలూరు రోడ్ల నుంచి బస్టాంట్ సిటీ టెర్మినల్‌కు వెళ్లే వాహనాలను అటువైపు వెళ్లనీయకుండా కాళేశ్వరరావు మార్కెట్‌వైపునకు మళ్లించారు. ట్రాఫిక్‌ను అదుపుచేసేందుకు, జనాన్ని కంట్రోల్ చేయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.

అందరిలోనూ ఇదే చర్చ..
ప్రభుత్వోద్యోగులు, వ్యాపారులు, సాధారణ జనంతోపాటు బందోబస్తు డ్యూటీ చేస్తున్న పోలీసులు సైతం... దీక్షకు వస్తున్న జనం, జగన్ గురించే చర్చించుకోవడం కనిపించింది. పోలీసులు... ఎంత మంది జనం వచ్చారు, ఏ జిల్లాల నుంచి వచ్చారు, ఎలా వచ్చారు వంటి వివరాలను పదేపదే అడిగి తెలుసుకున్నారు. ఇంటెలిజెన్స్ అధికారులు, సిబ్బంది సమాచారం కోసం ఉరుకులు పరుగులు పెట్టారు. ప్రతి నిమిషానికీ ఇక్కడి పరిస్థితి ఉన్నతాధికారులకు చేరవేశారు. లక్ష్య దీక్ష ప్రభావం ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార సంస్థలపైనా తీవ్రంగా కనిపించింది.

జగన్ దీక్షకు జయప్రద మద్దతు

యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహిస్తున్న లక్ష్యదీక్షకు ఎంపీ, సినీనటి జయప్రద మద్దతు తెలిపారు. రైతులు, చేనేత కార్మికుల సమస్యలపై నిరాహారదీక్ష చేస్తున్న జగన్‌తో ఆమె ఫోన్‌లో మాట్లాడినట్లు ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు తెలిపారు.

నేడు విజయవాడకు మంద కృష్ణ

ఎమ్మార్పీస్ రాష్ట్ర అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ బుధవారం యువనేత జగన్‌ను కలిసి, దీక్షకు మద్దతు ప్రకటించనున్నారు. దీక్షలో కూడా పాల్గొననున్నారు. ఈ మేరకు ఎమ్మార్పీస్ జిల్లా అధ్యక్షుడు మానికొండ శ్రీధర్ మీడియాకు తెలిపారు. దీక్షకు మద్దతుగా నిలవాలని ఎమ్మార్పీస్ కార్యకర్తలను ఆయన కోరారు.

చీమల బారుల్లా.. తరలి వచ్చి..
దీక్షలో పాల్గొనేందుకు, మద్దతు తెలిపేందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి అభిమానులు, నాయకులు తండోపతండాలుగా కృష్ణాతీరానికి చేరుకున్నారు. ఉదయం 9 గంటలకే వైఎస్సార్ ప్రాంగణం సగానికి పైగా నిండిపోయింది. సాయంత్రమయ్యేసరికి జనం చీమలబారుల్లా ఉవ్వెత్తున ఇసుక తిన్నెలకు చేరుకున్నారు. పాదయాత్రలు, ప్రదర్శనలుగా తరలివస్తున్న వారితో కృష్ణలంక హైవే, కెనాల్ రోడ్డు, కాళేశ్వరరావు మార్కెట్, కంట్రోల్‌రూమ్ తదితర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. అంత రద్దీలోనూ యువనేతను చూసేందుకు పసి పిల్లలను చంకన వేసుకుని కొందరు కుటుంబ సమేతంగా ఆ ప్రాంతానికి రావడం విశేషం.

జగన్‌ను చూడాలి.. చేయి కలపాలి..
ఓ సమయంలో జగన్ చూసేందుకు అభిమానులంతా వేదిక వద్దకు దూసుకొచ్చేశారు. బ్యారికేడ్లు దాటుకుని లోనికి ప్రవేశించారు. ఓ గంటసేపు అతికష్టం మీద వారిని ఆపగలిగిన పోలీసులు ఆ తర్వాత చేతులెత్తేశారు. దీంతో వేదిక చుట్టూ వేలాది మంది జనం చేరిపోయారు. వారంతా యువనేతను పలుకరించేందుకు, చేయి కలిపేందుకు ప్రయత్నించారు. దీంతో చేసేదిలేక చాలామందిని వేదికకు అనుబంధంగా వేసిన మార్గంలోకి అనుమతించి యువనేత వద్దకు పంపారు. మరోవైపు వెనుక మార్గం నుంచి అనేక మంది వేదిక పైకి ఎక్కేశారు. పలుమార్లు నేతలతోపాటు జగన్ వారిని వారించినా ఫలితం లేకపోవడంతో పలుమార్లు పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ గందరగోళంలో బ్యారికేడ్లు, లైట్లు వంగిపోయాయి. మంగళవారం రాత్రి వరకూ వాహనాలు అసంఖ్యాకంగా నగరంలోకి వస్తూనే ఉండడంతో కృష్ణాతీరం జగన్నినాదంతో మార్మోగింది.

ప్రజాప్రతినిధుల మద్దతు
ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు కూడా అధిక సంఖ్యలో తరలివచ్చారు. 23 మంది ఎమ్మెల్యేలు విజయవాడ వచ్చి జగన్‌కు మద్దతు పలికారు. వీరిలో కొందరు జగన్‌ను ప్రభుత్వ అతిథి గృహంలో కలిశారు. మరి కొందరు ఆయనతో దీక్షలో పాల్గొన్నారు. వీరితోపాటు ఇతర జిల్లాల నుంచి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో వచ్చారు.

పార్టీలకూ.. ప్రాంతాలకూ అతీతంగా..
రైతులకోసం జగన్ ఇచ్చిన 48 గంటల దీక్ష పిలుపుకు రాష్టవ్య్రాప్తంగా లభించిన స్పందన పార్టీలకూ.. ప్రాంతాలకూ అతీతంగా ఉంది. ప్రస్తుతానికి ఏపార్టీకీ చెందని జగన్ ఇచ్చిన పిలుపునకు స్పందనగా కాంగ్రెస్, పీఆర్‌పీ, తెలుగుదేశం పార్టీ నేతలు పలువురు సంఘీభావం ప్రకటించారు. మరో పదిరోజుల్లో తెలంగాణ అంశంపై శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చే సమయంలో కూడా ప్రాంతాలకు అతీతంగా నల్గొండ, వరంగల్, ఖమ్మం తదితర జిల్లాలనుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావడం విశేషమే అన్న వ్యాఖ్యానాలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

ఒకే ఒక్కడు: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ విడుదల చేసిన బహిరంగ లేఖలో జగన్ ఒక మాటన్నారు.‘ నన్ను ఒంటరిని చేసి పార్టీనుంచి పంపేయాలని మీరు రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. అందుకోసం నా కుటుంబాన్ని చీల్చడానికి కూడా మీరు వెనకాడలేదు. మీరు నన్ను ఒంటరిని చేసి పంపాల్సిన అవసరం లేదు. నేనే ఒక్కడిగానే వెళ్లిపోతున్నాను’ అని నవంబర్ 29న లేఖలో పేర్కొన్నారు. ఇప్పుడు జగన్ ఒంటరి కాదు.. లక్షలాది ప్రజల ఆకాంక్షలను ప్రతిఫలించే ఒకే ఒక్క నాయకుడన్న వాస్తవం ‘సీతమ్మ పాదాల’ సాక్షిగా కృష్ణా నదీతీరంలో ఆవిష్కృతమైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మాకోసం దీక్ష చేస్తున్నారు

దీక్షకు ముఖ్యంగా భారీ వర్షాలకు పంట పొలాలు దెబ్బతిన్న ప్రాంతాల రైతులు, కౌలు రైతులు, చేనేత కార్మికులు అధిక సంఖ్యలో వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ప్యాకేజీలో కౌలు రైతుల ప్రస్తావన లేకపోవడంతో ఆ వర్గానికి చెందిన రైతులు, వరి సాగుతో కుదేలైన ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల రైతులు ఈ దీక్షకు హాజరయ్యారు. వీరితోపాటు చేనేత కార్మికుల సమస్యలపై జగన్ సమరభేరి మోగించడంతో ఆ వర్గం కార్మికులు, రాష్ట్ర నాయకులు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి వచ్చిన రైతులు మంగళవారం రాత్రికి తిరుగుప్రయాణమయ్యారు. దూర ప్రాంతాలకు చెందిన వారంతా రెండు రోజులపాటు శిబిరంలో కొనసాగేందుకు అవసరమైన సరంజామాతో తరలివచ్చారు. కృష్ణానది ఇసుక తిన్నెలపై జగన్‌తోపాటు శిబిరంలో రెండు రోజులు గడుపుతామని దూర ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు పేర్కొన్నారు. ‘మా కోసం జగన్ రెండు రోజులు చలిలోనూ, ఎండలోనూ దీక్ష చేస్తున్నాడు. అతనితోపాటు నేనూ దీక్షలో కొనసాగుతా’ అని తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు చెందిన దిగవల్లి రాంబాబు పేర్కొన్నాడు.

‘ఖరీఫ్ సాగులో ఖర్చులు కూడా రాని దుస్థితిలో ఉన్న మాకు ప్రభుత్వం రబీలో విత్తనాలు, ఎరువులు ఉచితంగా ఇవ్వాలని జగనన్న ప్రభుత్వంపై వత్తిడి తీసుకువచ్చాడు. అవేమీ పట్టించుకోకుండా ఇన్‌పుట్ సబ్సిడీని అరకొరగా ప్రకటించి ప్రభుత్వం చేతులు దులుపుకుంది’ అని పశ్చిమ గోదావరి జిల్లా యండగండి గ్రామానికి చెందిన కలిదిండి రామరాజు పేర్కొన్నాడు. ‘మా కోసం ఆయనంత కష్టపడుతుంటే మేమెలా హోటల్‌లో బస చేస్తామండీ’ అంటూ ఖమ్మం జిల్లా మధిర నుంచి వచ్చిన కర్నాటి వేణుగోపాల్ అనే యువకుడు ప్రశ్నించాడు. ‘నూలు రేట్ల పెరుగుదల, పవర్‌లూమ్ పోటీ కారణంగా చితికిపోతున్న మా కుటుంబాల కోసం ప్రభుత్వంపై జగన్ పోరాటం చేస్తున్నాడు. మా బతుకుల బాగుకోసం జగన్ పార్టీలో చేరి క్రియాశీలక బాధ్యతలు నిర్వహిస్తా’ అని కృష్ణాజిల్లా గూడూరు మండలం కప్పలదొడ్డి గ్రామానికి చెందిన రవీంద్ర పేర్కొన్నాడు.

No comments:

Post a Comment