జనం - జగన్

ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......

Saturday, July 10, 2010

కౌంట్ డౌన్ మధ్యంతరానికి సై అంటున్న హై కమాండ్ సెప్టెంబర్ 2 లక్ష్యంగా జగన్


'సెప్టెంబర్ 2' వైఎస్ తొలి వర్ధంతి! ఆరోజున తన పంథా ప్రకటించేందుకు వైఎస్ జగన్ సిద్ధమవుతున్నారా?అధిష్ఠానంతో, రాష్ట్ర నాయకత్వంతో ఢీ అంటే ఢీ అంటున్న ఆయన...వేరుబాట పట్టేందుకు 'కౌంట్ డౌన్' మొదలుపెట్టారా? జగన్ తప్పులను కాంగ్రెస్ అధిష్ఠానం లెక్కపెడుతోందా? శిశుపాలుడి తప్పులు లెక్కపెడుతున్న శ్రీకృష్ణుడిలా వ్యవహరిస్తోందా? 'చర్యలు తీసుకోండి చూద్దాం' అంటూ జగన్ సవాలు విసురుతున్నట్లు భావిస్తోందా? చర్యల దిశగా 'కౌంట్‌డౌన్' మొదలుపెట్టిందా?

లక్ష్మణ రేఖలు ఎప్పుడో చెరిగిపోయాయి. విభజన రేఖలు బలపడుతున్నాయి. రాజీకి అవకాశం లేనంతగా పరిణామాలు సంక్లిష్టమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకీ, కడప ఎంపీ జగన్‌కూ మధ్య అగాథం పూడ్చలేనంతగా పెరుగుతోంది. రోజు రోజుకూ పదునెక్కుతున్న యువనేత స్వరాన్ని అధిష్ఠానం నిశితంగా గమనిస్తోంది.

ఏదిఏమైనా, సర్కారు పడిపోయినా, మధ్యంతరమే వచ్చినా... జగన్ ఒత్తిడికి లొంగరాదనే అది కృత నిశ్చయానికి వచ్చినట్లు తెలుస్తోంది. జగన్ విషయంలో కఠిన వైఖరి ప్రదర్శించాలన్నదే అధిష్ఠానం ఆలోచన. 'మొక్కై వంగనిది మానైవంగదు. ఇలా వదిలేస్తే పార్టీని హైజాక్ చేస్తారు' అని అధిష్ఠానం వర్గాలు భావిస్తున్నాయి.

ఓదార్పు యాత్ర ధిక్కారంగా భావించేంత తీవ్రమైన విష యం కాదని ముఖ్యమంత్రి రోశయ్య చెబుతున్నప్పటికీ... జగన్ బహిరంగ సభల్లో చేసే వ్యాఖ్యలను మాత్రం అధిష్ఠానం సీరియస్‌గా తీసుకుంటోంది. సోనియా గాంధీ రాష్ట్ర పరిణామాలపై వస్తున్న వార్తలను నిశితంగా పరిశీలిస్తున్నారు. "జగన్ తప్పులను లెక్కపెడుతున్నాం. ఆయన తనను తాను పార్టీకి అతీతంగా భావిస్తున్నారు.

సరైన సమయంలో అధిష్ఠానం తగిన చర్య తీసుకుంటుంది'' అని పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు అన్నారు. జగన్ మలి విడత ఓదార్పు యాత్ర పూర్తయిన తర్వాత పార్టీ నేతలు సమీక్షించి, ఆయనపై ఏ చర్య తీసుకునేదీ నిర్ణయిస్తారని చెబుతున్నారు.

"పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి వీరప్ప మొయిలీ సోమవారం రాత్రి లండన్ నుంచి తిరిగి వస్తారు. మంగళ లేదా బుధవారాల్లో ఆయనతో పార్టీ సీనియర్ నేతలు పరిస్థితిని సమీక్షిస్తారు. రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్న జగన్ ఈలోపు మరిన్ని వ్యాఖ్యలు చేసే అవకాశముంది. తూర్పు గోదావరిలో ఓదార్పు ప్రారంభమయ్యే నాటికి పరిస్థితి మరింత వేడెక్కుతుంది'' అని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఏం జరుగుతోంది?
జగన్ ఓదార్పు యాత్ర, రోజురోజుకూ పదునెక్కుతున్న విమర్శలు, ఇతర వివరాలపై కాంగ్రెస్ అధిష్ఠానానికి ప్రతిరోజూ సాయంత్రానికల్లా నివేదిక అందుతోంది. జగన్ పత్రికలో వస్తున్న వార్తలు, విశ్లేషణల అనువాదాలు కూడా ఢిల్లీకి చేరుతున్నాయి.

ఆయన బాధిత కుటుంబాలను ఓదార్చేందుకు తీసుకున్న సమయం ఎంత? రాజకీయ చర్యలకు కేటాయించిన సమయం ఎంత? ఓదార్చింది ఎవరిని? ఓదార్పును విజయవంతం చేయడానికి ఎవరు, ఎన్ని రోజులు శ్రమించారు? ఏయే ఏర్పాట్లు చేశారు? ఈ వివరాలను ఒకరిద్దరు నేతలు అదేపనిగా అధిష్ఠానానికి నివేదిస్తున్నారు. శ్రీకాకుళంలో జరిగే యాత్రకోసం అనంతపురం, కడప నుంచి వచ్చిన నేతలు తీసుకున్న చర్యలు కూడా అధిష్ఠానం దృష్టికి వచ్చాయి.
ఈ బలం నిజం కాదా?
'జగన్ చర్యలను ప్రతికూల ధోరణిలో చూడటం ఎందుకు? ఆయనకు జనంలో ఉన్న ఆదరణను పార్టీకి అనుకూలంగా ఉపయోగించుకోవచ్చు కదా?' అనే వాదనలకు అధిష్ఠానం తనదైన శైలిలో సమాధానం చెబుతోంది. "వైఎస్ వల్ల ఆర్థికంగా బాగుపడ్డవారు, ఇప్పుడు జగన్‌కు ఉన్న ఆర్థిక బలం వల్ల యాత్రకు ప్రతిస్పందన లభిస్తున్న మాట నిజమే.

వైఎస్ చనిపోయిన ఏడాదిలోపే వస్తున్న ఆయన కుమారుడు జగన్‌ను చూసేందుకు కొందరు జనం కూడా ఆసక్తి కనపరుస్తున్నారు. అంతమాత్రాన జగన్‌కు ప్రజల్లో చాలా బలం ఉందని చెప్పలేం. శ్రీకాకుళంలో జూనియర్ ఎన్టీఆర్ రోడ్‌షోలకు ఇంతకంటే ఎక్కువగా జనం వచ్చారు. చిరంజీవి సభకు వచ్చినంత జనం మరెవరికీ రాలేదు'' అనే వాదన వినిపిస్తోంది.

"ఇవన్నీ పక్కనపెట్టినా... జగన్ అధిష్ఠానానికి విధేయంగా ఉంటేనే ఆయనను పార్టీ కోసం ఉపయోగించుకోగలం. ఆయన తగిన రాజకీయ అనుభవం లేకుండానే ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్నారు. రోశయ్య సర్కారును ఇరుకునపెడుతూ... తద్వారా అధిష్ఠానం నిర్ణయాన్నే ప్రశ్నిస్తున్నారు. అటువంటప్పుడు జగన్ పట్ల పార్టీ అనుకూలంగా వ్యవహరించే అవకాశమెక్కడిది?'' అని ప్రశ్నిస్తున్నారు.

జగన్‌కు రాష్ట్ర వ్యాప్తంగా జనాన్ని ఆకర్షించే సత్తా ఉందనే వాదనతో కొంత ఏకీభవిస్తూనే... ఆ వ్యక్తిగత ఆకర్షణ తమకు అవసరం లేదని అధిష్ఠానం చెబుతోంది. "వైఎస్ తర్వాత పార్టీలో కొంత రాజకీయ శూన్యత ఏర్పడిన మాట నిజమే. కానీ, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పూర్తిగా వ్యక్తులపై ఆధారపడి మనుగడ సాగించలేదు. అవకాశం లభిస్తే ఎవరైనా నాయకుడు కాగలరు.

కాంగ్రెస్‌లో అన్ని వర్గాల్లో అనుభవజ్ఞులు, యువ నాయకులు ఇప్పటికీ ఉన్నారు. వారిని క్రమంగా పైకి తేవచ్చు. అయినా... జగన్ ఇప్పుడే అధిష్ఠానం మాట వినడం లేదు. ఆయన బెదిరింపులకు లొంగితే... భవిష్యత్తులో ఏకు మేకు కావడం ఖాయం. హర్యానా ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హుడా కుమారుడు కూడా వేల కోట్లు గుమ్మరించి ఎమ్మెల్యేలను తన వైపునకు తిప్పుకుని తనకే ముఖ్యమంత్రి పదవి కావాలని కోరితే ఏం చెప్పాలి?'' అని ప్రశ్నిస్తున్నారు.

మధ్యంతరం తథ్యమా?
అధిష్ఠానం లెక్కలు ఎలా ఉన్నా... ప్రస్తుత పరిణామాలు మధ్యంతరం దిశగా నడిచే అవకాశాలే అధికమని విశ్లేషకులు చెబుతున్నారు. అధిష్ఠానం వైఖరిని వ్యతిరేకిస్తూ జగన్ 'సెప్టెంబర్ 2'న కొత్త పార్టీ పెడితే, ఆయన వెంట 30 నుంచి 40 మంది ఎమ్మెల్యేలు నడిస్తే... రోశయ్య ప్రభుత్వం పడిపోయి మధ్యంతర ఎన్నికలు అనివార్యమవుతాయన్నద వీరి అంచనా.

ఓదార్పు దండయాత్రలా, జైత్రయాత్రలా ఉండొద్దన్నది అధిష్ఠానం సూచన. కానీ... ఇందుకు పూర్తి భిన్నంగానే ఓదార్పు జరుగుతోంది. యాత్రను క్రమంగా వేడెక్కించడం ద్వారా ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకునేలా జగన్ వ్యూహం రచిస్తున్నారని అంటున్నారు. జగన్ వ్యాఖ్యలు 'పార్టీ వేరు, నేను వేరు' అనేలా ఉన్నాయని భావిస్తున్నారు.

ఓదార్పులో బాధిత కుటుంబాలను పరామర్శించడంకంటే... వైఎస్ విగ్రహాల ఆవిష్కరణ, భారీ వాహన శ్రేణితో ర్యాలీలు, బహిరంగ సభల్లో ప్రసంగాలకే అధిక సమయం పోతోంది. ఇదంతా జగన్ రాజకీయంగా తన బలాన్ని, బలగాన్ని ప్రదర్శించేలా ఉందని చెబుతున్నారు. ఆయన భవిష్యత్ కార్యాచరణకు ఇవి స్పష్టమైన సంకేతాలేనని అంటున్నారు.
లెక్కల చిక్కులు
ప్రస్తుతం శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి 156 మంది ఎమ్మెల్యేలున్నారు. మరో ముగ్గురు ఇండిపెండెంట్లు, ఏడుగురు ఎంఐఎం సభ్యులు కాంగ్రెస్ పార్టీనే బలపరుస్తున్నారు. ఇక ప్రజారాజ్యం ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ పార్టీకే ఓటు వేస్తారా అనే అంశంపై సందేహాలున్నాయి.

జగన్ కుటుంబంతో బంధుత్వం కారణంగా పీఆర్పీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి కాంగ్రెస్‌కు సహకరించవచ్చు. పీఆర్పీలో కచ్చితంగా కాంగ్రెస్ వైపు ఉండేవారు, ఎంఐఎం, ఇండిపెండెంట్లను కలిపితే 25 మంది ఎమ్మెల్యేలు అవుతారు. అంటే... జగన్ వెంట 30 మంది వెళ్లినా రోశయ్య ప్రభుత్వం మైనారిటీలోకి వెళుతుంది. కానీ... జగన్‌కు రోశయ్య సర్కార్‌ను దెబ్బతీసేంత శక్తి ఉందని అధిష్ఠానం భావించడం లేదు.

జగన్ అనుయాయులు అధిష్ఠానాన్ని «ధిక్కరిస్తే శాసన సభ సభ్యత్వాన్ని కోల్పోతారు. ఒకవేళ జగన్ నిజంగా రోశయ్య సర్కారును పడగొట్టేంత బలం సంపాదిస్తే... అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లేందుకే సిద్ధం కావాలని అధిష్ఠానం భావిస్తోంది. జగన్‌కు మాత్రం లొంగరాదని గట్టిగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. "కేంద్ర ప్రభుత్వానికి నాలుగేళ్ల దాకా ఢోకా లేదు.

రాష్ట్రంలో మధ్యంతరం వచ్చి మరోపార్టీకి అధికారం లభించినా... ప్రస్తుత రాజకీయ, ఆర్థిక, సామాజిక సమస్యలను ఆ పార్టీ తట్టుకోలేదు. మళ్లీ కాంగ్రెస్ పార్టీయే తిరిగి అ«ధికారంలోకి వస్తుంది'' అని విశ్లేషించుకుంటున్నారు. అన్నింటికంటే మించి... ప్రభుత్వ మనుగడకు ముప్పు వస్తే నష్టపోయేది జగన్ వర్గమే అని అధిష్ఠానం చెబుతోంది. నాలుగేళ్ల వరకు జగన్ తన బలాన్ని స్థిరంగా ఉంచుకుంటారని పార్టీ భావించడం లేదు.

రాత్రి 9 గంటల వరకు ఇద్దరికి ఓదార్పు

ఎమ్మెల్యేలు ఇళ్లలో లేకపోయినా.. జగన్.. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వస్తున్నారు. సీతంపేటలో ఎమ్మెల్యే నిమ్మక సుగ్రీవులు ఇంట్లో జగన్ దాదాపు 30 నిమిషాలు గడిపారు. వారి కుటుంబ సభ్యుల క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. ఆ సమయంలో ఎమ్మెల్యే ఇంట్లో లేరు.

(శ్రీకాకుళం) : కడప ఎంపీ జగన్ ఓదార్పు యాత్ర ఆలస్యంగా సాగుతోంది. మూడో రోజైన శనివారం ఏడు కుటుంబాలను జగన్ ఓదార్చాల్సి ఉన్నప్పటికీ... రాత్రి 9 గంటల వరకూ కేవలం రెండు కుటుంబాలకే ఓదార్పు లభించింది. ఎల్ఎన్‌పేట మండలం యంబరాం గ్రామానికి ఉదయం ఐదు గంటలకు చేరుకొని కిలారి సరస్వతి కుటుంబాన్ని ఓదార్చారు.

ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి జీవన స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు. పది నిమషాల పాటు వారితో గడిపి లక్ష రూపాయల చెక్కు ఉన్న కవర్‌ను అందజేశారు. సాయంత్రం 6 గంటలకు వీరఘట్టం మండలం కంబర గ్రామానికి చేరుకొని అరసాడ శ్రావణ్‌కుమార్ కుటుంబాన్ని పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులతో పావు గంట గడిపారు. లక్ష రూపాయల చెక్కుగల కవరును అందజేశారు.

షెడ్యూలు ప్రకారం ఇంకా రేగిడి మండలం ఆముదాలవలసలో మేకా ప్రసాదరావు కుటుంబాన్ని, రాజాం మండలం దోసరిలో గొర్లె సూర్యనారాయణ కుటుంబాన్ని, జి.సిగడాం మండలం ముషినివలసలో దేవగుప్తాపు నర్సింగరావు కుటుంబాన్ని, పొందూరు మండలం నందివాడలో మజ్జి దాలినాయుడు కుటుంబాన్ని, లావేరు మండలం బుడుమూరులో పరసాన నర్సింహులు కుటుంబాన్ని జగన్ ఓదార్చాల్సి ఉంది. ఓదార్పు యాత్ర 12 గంటలు ఆలస్యంగా జరుగుతుండడంతో బాధిత కుటుంబాలు నిద్రాహారాలు మాని జగన్ కోసం ఎదురుచూస్తున్నాయి.

No comments:

Post a Comment