జనం - జగన్

ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......

Wednesday, July 14, 2010

జగన్‌తో భయం లేదు అధిష్ఠానం వద్ద రోశయ్య ధీమా! మధ్యేమార్గానికి యువనేత సంసిద్ధత?

 

అయినా నమ్మలేమని వ్యాఖ్య

మధ్యేమార్గానికి యువనేత సంసిద్ధత?  

విమర్శలు లేనిది అందుకే!  

ఢిల్లీలో రోశయ్య రాజకీయ మంతనాలు

అహ్మద్ పటేల్‌తో మరో మారు భేటీ
చిదంబరంతోనూ సమాలోచనలు
ద్వివేదీ, కేకేతోనూ మంతనాలు
అధిష్ఠానంపైన, రోశయ్య సర్కార్‌పైన తిరుగుబాటు చేసే ఆలోచనను కడప ఎంపీ జగన్‌మోహన్‌రెడ్డి విరమించుకున్నారని తెలుస్తోంది. మరోసారి మధ్యే మార్గాన్ని అనుసరించేందుకు నిర్ణయించుకున్నారని సమాచారం. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి రోశయ్య బుధవారం సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌కు చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

"జగన్ వల్ల నా సర్కార్‌కు భయం లేదు. ఇదే విషయం ఆయనకు (జగన్‌కు) కూడా అర్థమైనట్లు తెలుస్తోంది'' అని రోశయ్య చెప్పినట్లు ఈ వర్గాలు వెల్లడించాయి. మంగళవారం రాత్రి, బుధవారం మధ్యాహ్నం ఆయన అహ్మద్ పటేల్‌ను కలుసుకున్నప్పుడు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి, ఉప ఎన్నికల గురించి ఆయన వివరంగా చర్చించారు.


ప్రస్తుతానికి జగన్ వల్ల ప్రమాదమేమీలేదని, ఆయన కూడా తన మాటల తీవ్రతను తగ్గించుకున్నారని రోశయ్య చెప్పినట్లు తెలిసింది. అయితే జగన్ ఎప్పుడు ఏ విధంగా వ్యవహరిస్తారో చెప్పలేమని, ఆయన ప్రతి అడుగునూ పరిశీలించాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. జగన్‌కు ఎవరెవరు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది? వారి నేపథ్యమేంటి? అన్న అంశాలపై కూడా ఆయన అహ్మద్ పటేల్‌తో చర్చించారు.

కాగా ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి వీరప్ప మొయిలీ కూడా పరిస్థితి మరింత వేడెక్కకుండా చర్యలు తీసుకున్నారని తెలిసింది. జగన్ తల్లి విజయలక్ష్మి, వైఎస్ సన్నిహితుడు కేవీపీ రామచంద్రరావులతో మాట్లాడి.. జగన్ సంయమనం పాటించేలా చూశారని అంటున్నారు.

ఈ నేపథ్యంలో జగన్‌కూ, అధిష్ఠానానికి మధ్య జరుగుతున్న ప్రచ్చన్న యుద్ధం ప్రత్యక్ష యుద్ధంగా మారేందుకు మరింత సమయం పట్టవచ్చునని తెలుస్తోంది. నిజానికి అధిష్ఠానం జగన్‌కు ఒక దశలో షోకాజ్ నోటీసు ఇచ్చేందుకు సిద్ధమైందని, అయితే పరిస్థితి విషమించకుండా మధ్యవర్తులు రంగంలోకి దిగారని ఏఐసీసీ వర్గాలు అంటున్నాయి.

జగన్ పోకడను తాము గమనిస్తున్నామని, ఆయనతో మరిన్ని తప్పులు చేయనిచ్చి చర్యలు తీసుకుంటామని ఏఐసీసీ అధికార ప్రతినిధి కూడా ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ స్పష్టం చేయడం జగన్ శిబిరంలో కలవరం సృష్టించింది. అంతేకాక అన్ని రకాల రాజకీయ, ఆర్థిక ఆయుధాలను వాడేందుకు అధిష్ఠానం సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి.

దీనితో బలబలాలను అంచనా వేయకుండా కత్తి దూసి విఫలమవడం సరైంది కాదని జగన్ శిబిరం అభిప్రాయపడుతోందని సమాచారం. వారు అందుకే మొయిలీ ద్వారా మంతనాలు జరిపి, ముఖ్యమంత్రికి కూడా సంధి సంకేతాలు పంపారని, అధిష్ఠానానికి కూడా అవే సంకేతాలు పంపేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో జగన్ ఓదార్పు యాత్రను, మాటల్ని ఎప్పటికప్పుడు గమనించి తప్పనిసరైతేనే చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఆయనను వదిలి వేయాలని పార్టీలో ఒక వర్గం భావిస్తోంది. అయితే ఒకసారి అధిష్ఠానానికి ధిక్కార స్వరాన్ని వినిపించిన తర్వాత ఆయనపై పార్టీలో ఇప్పుడే సానుకూలంగా వ్యవహరించే అవకాశం లేదని అర్థమవుతోంది.

ఓదార్పు యాత్ర సందర్భంగా జగన్ చేసిన వ్యాఖ్యలను అధిష్ఠానం తీవ్రంగానే పరిగణిస్తోంది. నేరుగా ముఖ్యమంత్రిపై వ్యాఖ్యలు చేయడం ద్వారా జగన్ అధిష్ఠానం కట్టును దాటారని అంటున్నారు. అధిష్ఠానం జగన్‌తో పాటు ఆయన అనుచర గణంపైనా దృష్టి సారించింది. ప్రధానంగా వారి ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించిందని ఈ వర్గాలు వివరిస్తున్నాయి.

రాజకీయ అవసరాల కోసం సీబీఐ, ఐటీ శాఖలను దాడులకు వినియోగించడం అధికారంలో ఉన్న పార్టీలకు పరిపాటని.. గతంలో మాయావతి, లాలుల విషయంలోనూ ఇలాంటి చర్యలే తీసుకుని వారిని అదుపు చేసిన విషయాన్ని రాజకీయవర్గాలు గుర్తు చేస్తున్నాయి.

ఢిల్లీలో అంతా తానై..
ముఖ్యమంత్రి రోశయ్య రెండు రోజుల పర్యటన కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తిగొలిపింది. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంల సమావేశం కోసం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి.. పనిలో పనిగా.. రాష్ట్ర రాజకీయాలను అధిష్ఠానం పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. మంగళవారం రాత్రి అహ్మద్‌పటేల్‌ను కలిసిన రోశయ్య మళ్లీ బుధవారం కూడా 20 నిమిషాలు పాటు సమావేశమయ్యారు.

రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, జనార్దన్ ద్వివేదీలతోనూ సమావేశం కావడం.. చిదంబరంతో దాదాపు 40 నిమిషాల పాటు సమాలోచనలు జరపడం రాష్ట్ర నేతల్లో రాజకీయంగా ఆసక్తిని కలిగించాయి. గతంలో రోశయ్య ఢిల్లీకి వెళ్లినప్పుడు కొంతమంది ఆయన వెంట వెళ్లేవారు. ఈసారి తన వెంట సీఎం కార్యాలయ అధికారి మినహా పార్టీ నేతలెవరూ లేకుండా రోశయ్య జాగ్రత్త పడ్డారు.

ఇదిలా ఉండగా... ఓదార్పు యాత్రలో పాల్గొన్న రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌పై అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లాలో జరుగుతున్న ఓదార్పు యాత్రలో పాల్గొనే విషయమై ఆ జిల్లా ఎమ్మెల్యేలు తర్జన భర్జనలు పడుతున్నారు.

"మా మనసులు ఎక్కడో ఉన్నాయి. మేం ఇక్కడే ఉన్నాం.. అటు వెళ్లాలో ఇక్కడ ఉండాలో తెలియక మానసిక కల్లోలానికి గురవుతున్నాం. ఫలితంగా రక్తపోటు పెరిగిపోతోంది. అందుకే వైద్యపరీక్షలకు వెళ్తున్నా'' అని రాజమండ్రి ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు ఆన్‌లైన్‌తో అన్నారు.

శాసనసభ సమావేశాల అనంతరం యాత్రలో పాల్గొంటానని మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఘంటాపథంగా చెబుతుంటే.. అదే జిల్లాకు చెందిన పినిపె విశ్వరూప్ మాత్రం ఏ విషయాన్నీ స్పష్టం చేయడం లేదు.

వచ్చే నెల 8,9,10 తేదీల్లో ప్రకాశం జిల్లాలో జరిగే ఓదార్పు యాత్రలో పాల్గొంటానని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. తమ జిల్లాలో జరిగే ఓదార్పు యాత్రలో ఒకరిద్దరు మినహా మిగిలిన ఎమ్మెల్యేలందరూ పాల్గొంటారని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత రూట్‌మ్యాప్ రూపొందిస్తామని వివరించారు.

No comments:

Post a Comment