జనం - జగన్

ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......

Saturday, July 10, 2010

ఒక్కరికే ఓదార్పు పదినిమిషాలు... మిగతా... జైత్రయాత్రే , 'ఓదార్పు'లో రాజకీయం లేదనడం అవివేకం: మందా., జగన్ యాత్రలో స్థానికేతర నేతలదే హవా

'ఓదార్పు యాత్ర'లో రెండో రోజైన శుక్రవారం ఒక్క కుటుంబానికే ఓదార్పు లభించింది. ఉదయం పదిన్నరకు టెక్కలిలో రెండో రోజు యాత్రను మొదలు పెట్టిన జగన్... రాత్రి ఏడు గంటల సమయంలో గార మండలం హుకుంపేట గ్రామానికి చేరుకున్నారు. ఆ గ్రామంలో మరువాడ జానకిరాం కుటుంబాన్ని ఓదార్చారు. అక్కడ పదినిమిషాలు గడిపారు.

లక్ష రూపాయల చెక్ ఉన్నట్లు చెబుతున్న కవర్‌ను కుటుంబ సభ్యులకు అందించారు. మిగిలిన సమయమంతా వివిధ ప్రాంతాల్లో ఉపన్యాసాలకు, రోడ్లకు ఇరువైపులా ఉన్న జనాన్ని పలకరించేందుకు, నేతల ఇళ్లలోకి వెళ్లి.. పరామర్శించేందుకు కేటాయించారు.

రెండో రోజు షెడ్యూల్‌లో రెండు కుటుంబాలను ఓదార్చాలని నిర్ణయించినా... యాత్ర ఆరు గంటల ఆలస్యంగా సాగుతున్నదన్న కారణంతో ఒక్క కుటుంబంతోనే సరిపెట్టారు. ఎల్ఎన్‌పేట మండలం యంబరాం గ్రామంలో కిలారి సరస్వతి కుటుంబాన్ని ఓదార్చడం ఈ రోజుకు సాధ్యం కాకపోవచ్చని జగన్ సన్నిహిత వర్గాలు తెలిపాయి.

యాత్ర మరో రోజు పొడిగింపు:
శ్రీకాకుళం జిల్లాలో జగన్ యాత్రను మరో రోజు పొడిగిస్తున్నట్టు ఆయన సన్నిహితవర్గాలు తెలిపాయి. మొదట నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు మూడు రోజులపాటు ఓదార్పు యాత్ర సాగించాల్సి ఉంది. కానీ కుటుంబాలను ఓదార్చడంతో పాటు.. విగ్రహావిష్కరణలు, నేతల ఇళ్లలో పలకరింపులు, అడిగిన చోటల్లా ఉపన్యాసాలతో మొదటిరోజు నుంచి యాత్రలో జాప్యం జరుగుతోంది.

ఫలితంగా కార్యక్రమాలు షెడ్యూల్ ప్రకారం పూర్తి కావడంలేదు. దీంతో ఈ నెల 11న ఆదివారం ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఓదార్పు యాత్రను పూర్తి చేసి తర్వాత తూర్పు గోదావరి జిల్లాకు వెళ్లడానికి జగన్ నిర్ణయించుకున్నట్టు సమాచారం.

'ఓదార్పు'లో రాజకీయం లేదనడం అవివేకం: మందా

న్యూఢిల్లీ : జగన్ చేపట్టిన ఓదార్పు యాత్ర వెనుక రాజకీయ కోణం లేదనుకోవడం తెలివి తక్కువతనమని కాంగ్రెస్ ఎంపీ మందా జగన్నాథం వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అధిష్ఠానం ఓదార్పు యాత్ర వద్దనలేదని అన్నారు. ఆర్భాటాలతో చేస్తున్న యాత్ర వల్ల జరగబోయే పరిణామాలను దృష్టిలో ఉంచుకుని వారించిందన్నారు.

వైఎస్ కుమారుడిగా జగన్‌ను పార్టీ, ప్రజలు గుర్తించారన్నారు. అయితే ఆయన సీఎం కావాలని కోరుకున్నారని, వైఎస్ అకాల మరణం తర్వాత అధిష్ఠానం అన్ని కోణాల్లో ఆలోచించి రోశయ్యను పీఠంపై కూర్చోబెట్టిందని జగన్నాథం అన్నారు. జగన్ యాత్రలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొంటున్నారన్న దానిపై స్పందిస్తూ, వైఎస్ఆర్ కొడుకుగా ఆయనను చూడటానికి జనం రావడంలో విశేషమేమీ లేదన్నారు. 

జగన్ యాత్రలో స్థానికేతర నేతలదే హవా

రెండో రోజు స్థానికేతర నేతల హవా ప్రముఖంగా కన్పించింది. విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ తన అనుచరులతో 200 వాహనాల వరకు జగన్ కాన్వాయ్‌లో ఏర్పాటు చేయించారు. వీరితోపాటు రాయచోటి ఎమ్మెల్యే జి.శ్రీకాంత్‌రెడ్డి, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని తదితరులు బలగాలను తెచ్చారు.

స్థానిక ప్రజలతో వీరు కలిసిపోవడంతో జగన్ అడుగుపెట్టిన చోటల్లా వేలాది మంది కన్పించారు. రెండో రోజు యాత్రలో జిల్లాకు చెందిన రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఆయన సోదరుడు నరసన్నపేట ఎమ్మెల్యే కృష్ణదాస్‌ల హవా బాగా కనిపించింది. ప్రసాదరావు కుమారుడు రామమనోహర్ హైదరాబాద్ నుంచి హుటాహుటిన టెక్కలి చేరుకొని యాత్ర పొడవునా జగన్‌తో ఉన్నారు.

నరసన్నపేట పట్టణంలో వైఎస్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి జగన్‌ను ఆహ్వానిస్తున్నట్టుగా ధర్మాన ప్రసాదరావు, కృష్ణదాస్‌ల ఫొటోలతో ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. కార్యక్రమం ఎలా జరుగుతోందంటూ నరసన్నపేటలో నాయకులకు కృష్ణదాస్ ఫోన్ చేసి ఆరా తీశారు. యాత్రలో కృష్ణదాస్ సతీమణి పద్మప్రియ, కుమారుడు రామలింగంనాయుడు కూడా పాల్గొన్నారు. 

బాధితుల కన్నా నేతలే మిన్న
జగన్ యాత్ర రెండో రోజూ అదే తీరు

అడిగిన చోట కాదనకుండా ఉపన్యాసాలు
వీధి వీధికీ వైఎస్ విగ్రహావిష్కరణలు
ఏడు కుటుంబాల కోసం గంట
ఎమ్మెల్యేలు, నేతల ఇళ్లలో ఐదు గంటలు
శ్రీకాకుళం: బాధితుల ఇళ్లలో ఐదేసి నిమిషాలు.. నేతల ఇళ్లలో మాత్రం కనీసం అరగంట పాటు మంతనాలు! వందల కార్లతో కాన్వాయ్‌లు! అడిగిన చోటల్లా కదనకుండా ప్రసంగాలు.. వీధి వీధికీ వైఎస్ విగ్రహావిష్కరణలు! బాధితుల కన్నా నేతలే మిన్నగా సాగుతున్న జగన్ ఓదార్పు యాత్ర తీరు ఇది! తొలి రోజు ఆరు కుటుంబాలకు ఐదారు నిమిషాల పాటు కేటాయించిన జగన్.. రెండో రోజు కూడా అదే తీరులో పర్యటించారు.

స్థానిక నాయకుల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం ప్రస్ఫుటమైంది. రెండో రోజు రెండు కుటుంబాలను ఓదార్చాలనుకున్నా... ఒక్క కుటుంబంతోనే సరిపెట్టారు. మొత్తంగా యాత్రలో పది శాతం సమయాన్ని కూడా బాధిత కుటుంబాల 'ఓదార్పు'నకు కేటాయించడం లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

గురువారం మధ్యాహ్నం ఇచ్ఛాపురంలో ప్రారంభించిన ఓదార్పు యాత్ర తొలిరోజును శుక్రవారం ఉదయం 8 గంటలకు టెక్కలితో ముగించారు. సుమారు 22 గంటలపాటు కంటి మీద కునుకు లేకుండా యాత్ర కొనసాగించినప్పటికీ బాధిత కుటుంబాలను పరామర్శించడానికి కేటాయించింది గంట సమయం మాత్రమే! మిగిలిన సమయమంతా నేతలతో గడిపేందుకు, రోడ్డుపక్కల జనాన్ని పలకరించేందుకు వినియోగించారు.

టెక్కలిలో డీసీసీ అధ్యక్షురాలు, ఎంపీ కిల్లి కృపారాణి స్వగృహంలో శుక్రవారం ఉదయం రెండున్నర గంటలు విశ్రాంతి తీసుకున్నారు. తర్వాత ఉదయం 10.30 గంటలకు రెండోరోజు యాత్రను ప్రారంభించారు. 11 గంటలకు టెక్కలి రైల్వే గేటు వద్ద వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. 12 గంటలకు కోటబొమ్మాళిలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు.

మధ్యాహ్నం 3 గంటలకు నరసన్నపేటలో భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడే పెద్ద సంఖ్యలో ఉన్న ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రాత్రి 7 గంటల సమయంలో గార మండలం హుకుంపేటకు చేరుకొని మరువాడ జానకిరాం కుటుంబాన్ని ఓదార్చారు. అక్కడ పది నిమిషాలు గడిపారు.

అడిగిన చోటల్లా ప్రసంగాలు
జగన్ ఓదార్పు యాత్రలో రెండో రోజు కూడా జనం కోరిన దగ్గరల్లా ప్రసంగాలు చేశారు. పాత ప్రసంగాలనే వల్లెవేసినప్పటికీ... తన తండ్రి చనిపోయిన 9 నెలల్లో రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా అట్టడుగుకు దిగజారిపోయాయని కాంగ్రెస్ పాలనపై సంచలన విమర్శలు గుప్పించడం ఇందులో కొత్తదనం. ఓదార్పు యాత్రను శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించగానే ఎక్కడికక్కడ వైఎస్ విగ్రహాలు పుట్టుకొచ్చేశాయి.

చాలా మంది ఫైబర్‌తో తయారైన తేలికపాటి రెడీమేడ్ విగ్రహాలను ఏర్పాటు చేశారు. 3గంటల ఆలస్యంతో మొదలైన యాత్ర తొలి రోజు ముగిసే సరికి 12 గంటల ఆలస్యంతో ఉంది. శుక్రవారం నిర్ణీత సమయం కన్నా 6గంటల ఆలస్యంగా జరుగుతోంది.

నేతలకే సమయం
ఎక్కువ సమయం నేతల ఇళ్లలో గడపడానికి జగన్ ప్రాధాన్యం ఇచ్చారు. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో పీసీసీ సంయుక్త కార్యదర్శి నర్తు రామారావు, మాజీ ఎమ్మెల్యే నరేష్ కుమార్ అగర్వాలా ఇళ్లలో అర గంట సమయం చొప్పున గడిపారు. మందస మండలం హరిపురంలో పలాస ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు ఇంటికి వెళ్లారు.

ఎమ్మెల్యే హైదరాబాద్‌లో ఉన్నప్పటికీ వారి కుటుంబ సభ్యులను పలకరించి అక్కడ అర గంట గడిపారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు పలాస- కాశీబుగ్గ చేరుకున్న జగన్ టెక్కలి ఎమ్మెల్యే కొర్ల భారతి ఇంటికి వెళ్లారు. ఆమె అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనడానికి హైదరాబాద్ వెళ్లినప్పటికీ వారి కుటుంబ సభ్యులతో అరగంటపైన మాట్లాడారు.

జగన్‌తో కరచాలనం చేసేందుకు పలువురు ఎగబడ్డారు. నరసన్నపేటకు జలుమూరు, పోలాకి, సారవకోట, నరసన్నపేట మండలాల నుంచి ప్రజలను లారీలతో తీసుకువ చ్చారు. యాత్ర ఆలస్యమౌతున్న కొలదీ జనం పలచబడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. రెండో రోజూ కూడా చిన్న అపశ్రుతి దొర్లింది.

గారలో విద్యుత్ షాక్‌కు గురై సింహాచలం అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఓదార్పు యాత్రతో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని అర్థం వచ్చేవిధంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ఉన్న ఇందిరా విజ్ఞాన భవన్‌లో ఏర్పాటు చేసిన వైఎస్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని రద్దు చేశారు.


No comments:

Post a Comment