జనం - జగన్

ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......

Thursday, July 15, 2010

సా(తా)పీగా సాగుతున్న జగన్‌ యాత్ర * జగన్‌ వైపు క్యూలు కడుతున్న నేతలు * మా కుటుంబ సభ్యులను ఓదార్చుకుంటే తప్పేంటిఃవైఎస్‌ జగన్‌

 సా(తా)పీగా సాగుతున్న జగన్‌ యాత్ర 
మెట్టప్రాంత ంలో వైఎస్‌ జగన్‌ ఓదార్పుయాత్ర సా(తా)పీగా సాగుతుంది. గురువారం ఉదయం 11గంటల నుంచి ప్రారంభమైన ఈ యాత్ర రాత్రి వరకు ఏకధాటిగా జగ్గంపేట, కిర్లంపూడి మీదుగా సాగింది. లింగంపర్తిలో మాజీ శాసనసభ్యులు వరుపుల సుబ్బారావు ఇంటిలో బసచేసిన జగన్‌ సామవరం, క్రిష్ణవరం, బొమ్మూరు, బూరుగుపూడి, రామవరం, జగ్గంపేట, నీలాద్రిపేట, తాళ్ళూరు, గుర్రంపాలెం, మల్లేపల్లి, గండేపల్లి, ఎన్‌టి రాజాపురం, మురారి, కె.గోపాలపురం, యల్లమిల్లి, పి.నాయకంపల్లి, సూరంపాలెం జంక్షన్‌, కాట్రావులపల్లి,జె.తిమ్మాపురం, కట్టముర్రు, కాండ్రకోట, జె.తిమ్మాపురం, రామచంద్రాపురం, పాలెం, ఎస్‌.తిమ్మాపురం, గెద్దనాపల్లి, చిల్లంగి, కిర్లంపూడి చేరుకున్నారు.

అక్కడ ముద్రగడ ఇంట రాత్రికి బసచేసి గురువారం పిఠాపురం నియోజకవర్గంలో ఓదార్పులో పాల్గొంటారు. ఎక్కడా ఎటువంటి విమర్శలు లేకుండా తన తండ్రిని స్మరించుకుంటు జగన్‌ తన యాత్రను కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు వైఎస్‌ జగన్‌ పర్యటనలో కనిపించని జగ్గంపేట శాసన సభ్యులు తోట నర్శింహం జగ్గంపేటలో జరిగిన వైఎస్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనటమే కాకుండా ఈ సందర్భంగా జరిగిన సభకు అధ్యక్షత కూడా వహించారు. ఈ యాత్రలో భాగంగా బూరుగుపూడిలో అత్యంత అందంగా తీర్చిదిద్దిన 10అడుగుల విగ్రహాన్ని జగన్‌ ఆవిష్కరించారు. ఈసందర్భంగా జగన్‌ తన ప్రసంగంలో ఈ ప్రదేశం నుండి తన తండ్రి పాదయాత్రను నిర్వహించిన సందర్భాన్ని, అలాగే ఇదే ప్రదేశం నుండి పల్లెబాటను ప్రారంభించిన గుర్తుకు తెచ్చుకుని ఉద్వేగానికి లోనయ్యారు.

ఈ పర్యటన సందర్భంగా ప్రజలు జగన్‌ చేతులు పట్టుకోవడానికి ప్రయత్నించినపుడు ఆయన చేతికి గాయం అవ్వడంతో ఆయన గండేపల్లిలో ఉన్న పరిమి వెంకటేశ్వరావు ఇంట్లో ప్రైవేటు వైద్యుడు ప్రసాద్‌తో చేతిని డ్రెసింగ్‌ చేసుకుని, అభిమానులకు అభివాదంతో సరిపెట్టారు. ఈ రోజు జగన్‌ పర్యటనలో కృష్ణాజిల్లా జిల్లాపరిషత్‌ ఛైర్మన్‌ కుక్కల నాగేశ్వరావు, పశ్చిమగోదావరి ఛైర్మన్‌ మేకా శేషుబాబులు కూడా పాల్గొన్నారు. ఈ పర్యటనలో తాళ్ళూరు, గండేపల్లి, మల్లేపల్లి గ్రామాల్లో జగన్‌పై పూల వ ర్షం కురిపించారు. మురారి గ్రామంలో వందలకోట్ల రూపాయిల వ్యయంతో 75వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించే తోట వెంకటాచలం పుష్కర ఎత్త్తిపోతల పథకానికి సంబంధించిన పార్కులో నిర్మించిన స్వర్గీయ తోట వెంకటాచలం, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలను జగన్‌ అవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జగన్‌ మాట్లాడుతూ తన తండ్రి దయవలన తాను ఇంత ఎత్తుకు ఎదిగానని అటువంటి గొప్ప నాయకుడి కొడుకునైన తనకు ఇంతమంది ప్రజల అభిమానాన్ని చూసి తను ఒంటరిని అనే ఫీలింగ్‌ పోయిందన్నారు.

తనను కొడుకుగా, తమ్ముడిగా ఆద రిస్తున్న ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అయన తనను ఆదరించిన జగ్గంపేట శాసనసభ్యులు తోట నర్శింహంను ఆలింగనం చేసుకుని అభినందించారు. ఈరోజు పలుచోట్ల జరిగిన సమావేశాల్లో రాజకీయాలు దిగజారుతున్న తరుణంలో తనకు ప్రజల మద్దతు వారు చూపిస్తున్న సానుభూతి ఎంతగానో ఆకట్టుకుందన్నారు. ఈ ఓదార్పుయాత్రలో భాగంగా కె.గోపాలపురం గ్రామంలో గోడినాగరాజు కుటుంబాన్ని ఓదార్చి వారి కుటుంబానికి వైఎస్‌ఆర్‌ ఫౌండేషన్‌ తరువున లక్ష రూపాయిలు చెక్కును అందజేశారు. ఓదార్పుయాత్ర మల్లేపల్లి నుంచి దాటుతున్న తరుణంలో సుబ్బాయ్యమ్మ పేట సర్పంచ్‌ గొల్లపల్లి తాతారావు తన గ్రామాన్ని సందర్శించి వైఎస్‌ విగ్రహాన్ని ప్రారంభించమని కోరగా షెడ్యూలులో లేకపోయిన ఆ గ్రామాన్ని సంద ర్శించి వైఎస్‌ విగ్రహాన్ని ప్రారంభించారు.

విశాఖ జిల్లా యుత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు తోట నగేష్‌ , తూర్పుగోదావరి యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు వరుపులు రాజాలు ఈ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. సోమవారం నుంచి ప్రారంభించిన ఈ యాత్ర ఇప్పటివరకు సుమారు 400 కిలో మీటర్లు వరకూ సాగింది. తూర్పులో ఓదార్పు యాత్ర షెడ్యూలు ప్రకారం 11 వందల కిలోమీటర్లు సాగవలసి ఉండగా గురువారం జరిగిన సభలో జగన్‌ తాను తూర్పులో మొత్తం 12వందల కిలోమీటర్లు ప్రయణించవలసి ఉందని ప్రకటించటంతో యాత్రను మరో వంద కిలోమీటర్లు పొడుగిస్తారనే అనుమానాలు కలుగుతున్నాయి. సోమవారం నుంచి గురువారం వరకు జగన్‌ సుమారు 80గ్రామాల్లో పర్యటించారు. ఇప్పటివరకు జరిగిన సభలన్ని సక్సెస్‌ అయ్యాయి. జగన్‌ చూడటానికి, ఆయనతో మాట్లాడటానికి ప్రజలు ఎక్కడపడితే అక్కడ ఎగబడుతున్నారు. ప్రజలను చూసి వైఎస్‌పై ఇంత అభిమానం ఉందా అంటూ జగనే ఆశ్చర్యపోతున్నారు. ఇదే విషయాన్ని తన సమావేశాల్లో ప్రస్థావిస్తున్నారు. బుధవారం వరకు ఎక్కడా ముందుగా నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం ఈ యాత్ర సాగకపోయినా, గురువారం మాత్రం అంతా టైం ప్రకారం సా(తా)ఫీగా సాగుతుందని భావిస్తున్నారు.
 
జగన్‌ వైపు క్యూలు కడుతున్న నేతలు
 ఓదార్పు యాత్రను వ్యూహాత్మకంగా దెబ్బతీయాలని ఆ యాత్రలో ఎమ్మెల్యేలు, మంత్రులతో సహా పెద్దలెవరూ పాల్గొనకుండా అసెంబ్లీ నెపంతో కట్టడి చేయాలని ప్రయత్నించారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో జగన్‌ వర్గం సైతం అంతే వ్యూహాత్మకంగా ఓదార్పు అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు పొడిగింపు చేసే ఆలోచనలు సత్ఫలితాలు ఇచ్చాయనే చెప్పాలి. 12వ తేదీన మొదలైన యాత్ర 4 రోజులపాటు తొండంగి నుండి చుట్టి చుట్టి కిర్లంపూడి చేరడానికి అన్ని రోజులు పట్టిందంటే అదీ వ్యూహాత్మకమనే భావిస్తున్నారు.


4 రోజుల్లో సుమారు 400 కి.మీ. 80 గ్రామాల్లో ఆయన ఓదార్పు సాగినట్లే. ఈ యాత్ర ఒక్క రోజులో ముగించాలని ముందుగా నిర్ణయించినా తీరా అసెంబ్లీ సమావేశాలు పరిగణనలోనికి తీసుకొని మరో 3 రోజులు ఇక్కడే చుట్టూ తిరిగేలా పెంచుకుపోయారు. అసెంబ్లీ సమావేశాలు ముగియడంతో ఇక జిల్లాకు ఎమ్మెల్యేలు, మంత్రుల రాక తప్పనిసరైంది. ఇప్పటికే జగ్గంపేట ఎమ్మెల్యేతోట నరసింహం అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పటికీ ఆదరాబాదరాగా హైదరాబాదు నుంచి సొంత నియోజకవర్గానికి రాక తప్పలేదు. తుని నియోజకవర్గం ఎమ్మెల్యే రాజా అశోక్‌బాబును ఓదార్పు యాత్రలో జగన్‌ ఆయన అందించిన ఆప్యాయత జీవితంలో మరువలేనిదని ఆలింగనం చేసుకున్న తీరు ప్రక్కన ఉన్న జగ్గంపేట నియోజకవర్గంపై పడక తప్పలేదు. ముఖ్యంగా ఆ ప్రభావం ఎమ్మెల్యే తోటపై పడింది. ఆదిలో మీమాంశలో ఉన్న ఎమ్మెల్యే తోట తన నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి నేతలు జగన్‌తో మమేకమయ్యే పరిస్థితిని గమనించారు.

ముందున్న మంత్రివర్గ విస్తరణ కన్నా నియోజకవర్గంలో పట్టు సాధింపే ముఖ్యమని భావించి ఓదార్పులో పాల్గొనక తప్పని పరిస్థితి అయ్యింది. చెరిసగం మంది ఎమ్మెల్యేలు తూర్పులో ఓదార్పులో తప్పక పాల్గొంటారని భావించిన పరిస్థితి ఒక్క ఏజెన్సీ ఎమ్మెల్యే సత్యనారాయణ రెడ్డి తప్ప ఇరువురు మంత్రులతోపాటు, 8 మంది ఎమ్మెల్యేలు, ఓడిపోయిన 8 మంది ఎమ్మెల్యేలు ఓదార్పుకు మద్దతిచ్చే పరిస్థితి ఎదురైంది. టిటిడి బోర్డులో ఉన్న రాజమండ్రి ఎమ్యెల్యే రౌతు సూర్యప్రకాషరావు సైతం ఆదిలో అటూఇటూగా ఉన్నప్పటికీ ఆయన సైతం ఓదార్పు యాత్ర ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మంత్రివర్గ విస్తరణ వైపు చూస్తున్న మరో ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి సైతం తన నియోజకవర్గంలో నిర్వహించే ఓదార్పులో తాను పాల్గొంటానని అది సహజమేనని ఆమె అంటున్నారు.

16న ఓదార్పు యాత్రలో జగన్‌ను కలుస్తానన్న మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ ఆరోజు క్యాబినెట్‌ సమావేశంలో పాల్గొని ముగిసిన వెంటనే విమానంలో జిల్లాకు వచ్చి ఓదార్పు యాత్ర ఎక్కడ ఉంటే అక్కడకు చేరుకుని జగన్‌కు సంఘీభావం ప్రకటించి ఆ తరువాత నియోజకవర్గంలో యాత్ర ఏర్పాట్లలో నిమగ్నమవుతానంటున్నారు. జగన్‌ ఓదార్పులో వెన్నంటి ఉంటున్న ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, రాపాక వరప్రసాద్‌లు ఆద్యంతం ఓదార్పుకు బలం చేకూరుస్తున్నారు. ఓదార్పులో వాడి వేడి వ్యాఖ్యానాలు తగ్గిన జగన్‌కు ప్రతి రూపంగా ఇద్దరు ఎమ్మెల్యేలు జగన్‌ను విమర్శించే నేతలపై విరుచుకుపడే పనిని వారి భుజాలపై పెట్టుకున్నారు. మిగిలిన ఎమ్మెల్యేలు నల్లమిల్లి శేషారెడ్డి, పొన్నాడ సతీష్‌లు సైతం ఓదార్పు యాత్రలో నిమగ్నమయ్యారు. ఎమ్మెల్యేల్లో ఒక్క రంపచోడవరం తప్ప మిగిలిన వారంతా ఓదార్పుకు సై అనే పరిస్థితి జనంలో జగన్‌ పై వస్తున్న ఆదరణతోనే ఇది ముడిపడిందని భావిస్తున్నారు. ఇది జగన్‌ వారి అనుచరుల వ్యూహాత్మక తీరుతోనే సాధ్యపడింది. భవిష్యత్తులో రాష్ట్రంలో చేపట్టే ఏ కార్యక్రమాలైనా తూర్పు కూర్పులో విజయవంతం చేసుకోవాలనే ఆలోచన. డా. వైఎస్‌కు ముఖ్య అనుచరుడుగా ఉండే మరో మంత్రి పినిపే విశ్వరూప్‌ ఇంతవరకు పెదవి విప్పకపోయినా ఆయన కుమారుడు కృష్ణారెడ్డి, ఆయన సన్నిహితుడైన మాజీ ఎమ్మెల్యే కుడుపూడి చిట్టబ్బాయిలు ఓదార్పును భుజాలపై వేసుకున్నారు.

రేపో మాపో మంత్రి విశ్వరూప్‌ సైతం జగన్‌తో చేయి కలిపి నియోజకవర్గంలో మకాం పెడతారని తెలుస్తుంది. ఎమ్మెల్సీల్లో ఒక్క గిడుగు, ఎంపిల్లో ఒక్క ఉండవిల్లి మాత్రం జగన్‌తో కరచాలనం చేశారు. ఎలాగూ బద్ధ విరోధిగా ఉన్న అమలాపురం ఎంపి హర్ష కుమార్‌ ఈ యాత్రను ఆది నుండి వ్యతిరేకిస్తుంటే మరో ఎంపి మంత్రిగా ఉన్న ఎంఎం పళ్లంరాజు మాత్రం 6 రోజుల పాటు జగన్‌ ఓదార్పు యాత్ర తన నియోజకవర్గంలో జరుగుతున్నా తనకు పట్టనట్లే ఆయన ఉన్నారు. ఇది జగన్‌కు కాస్త నిరాశకు గురిచేసినట్లు తెలుస్తుంది. ఓదార్పులో కాస్త నలతపడినా జగన్‌ నాలుగో రోజు తరలివస్తున్న ఎమ్మెల్యేలతో ఆ నలతను లెక్కచేయకపోయినా చివరకు గండేపల్లి మండలంలో ఎన్‌టి రాజపురంలో సర్పంచ్‌ పరిమి ఇంట్లో కాస్త విశ్రాంతి, డా. ప్రసాద్‌తో వైద్య చికిత్సలు చేయించుకున్నారు. స్వల్పంగా గాయాలైన చేతి వేళ్లకు ప్లాస్టర్‌లు వేయించుకున్నారు. ఓదార్పు పర్యటన ఆది నుంచి జేబుదొంగల హస్త లాభం కొనసాగుతూనే ఉంది.

ముఖ్యంగా లెక్కలేనన్ని సెల్‌ఫోన్లు గల్లంతయ్యాయి. చివరకు ఈ చేతివాటం ఓదార్పు నేత జగన్‌కు తప్పలేదు. మురారి గ్రామంలో ఆయన సమావేశంలో చేతివాటం చూపబోయిన దొంగను పట్టుకుని ఆనక తాపీగా పోలీసులు పట్టుకుపోయారు. ఇదిలా ఉండగా తొలి రోజే స్వాగతాలు పలికిన తూర్పుగోదావరి జిల్లా జడ్‌పి చైర్మన్‌, డిసిసి నేత అయిన చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు తోడు మరో ఇద్దరు జడ్‌పి చైర్మన్‌లు జగన్‌కు తోడయ్యారు. పశ్చిమ జడ్‌పి చైర్మన్‌ మేకా శశిబాబు, కృష్ణా జడ్‌పి చైర్మన్‌ కుక్కల నాగేశ్వరరావులు బుధవారం జగన్‌ ఓదార్పులో పాల్గొని ఆయనకు సంఘీభావాన్ని అందించారు. ఈ యాత్రలో స్వల్పంగా గాయపడ్డ ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు చివరకు ఆసుపత్రికి చేరారు. ఆయన ఇంట నుండి బుధవారం బయలుదేరిన ఓదార్పు యాత్ర ముగింపు కిర్లంపూడిలో మాజీ మంత్రి ముద్రగడ ఇంట చేరనుంది. గురువారం ముద్రగడ గత ఎన్నికల్లో పోటీచేసిన పిఠాపురం నియోజకవర్గంలో జగన్‌ను ఓదార్పులో తిప్పనున్నారు.
మా కుటుంబ సభ్యులను ఓదార్చుకుంటే తప్పేంటిఃవైఎస్‌ జగన్‌
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అకాల మరణాన్ని తట్టుకోలేక ఆయన అభిమానులు తమ ప్రాణాలను పోగొట్టుకుని మాకు కుటుంబ సభ్యులు అయ్యారని కడప ఎంపి, వైఎస్‌ తనయుడు వైఎస్‌ జగన్‌ అన్నారు. గురువారం కిర్లపూడి మండలలో జగన్‌ ఓదార్పు యాత్ర ప్రారంభమయింది. ఈ సందర్భంగాసోమవరంలో జగ్గంపేట ఎమ్మెల్యే తోట నరసింహం వర్గీయులు ఏర్పాటు చేసిన వైఎస్‌ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం బూరుగుపూడి గ్రామంలో వైఎస్‌ విగ్రహాన్ని ఆవిష్కరించి ఆయన మాట్లాడుతూ తన తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర చేపట్టిన సమయంలో బూరుగుపూడి గ్రామంలో విశ్రాంతి తీసుకున్న విషయం ,పల్లెబాట కార్యక్రమాన్ని ఈ గ్రామం నుంచే శ్రీకారం చుట్టడం వ ల్ల తన తండ్రి రాజశేఖరరెడ్డికి బూరుగుపూడి గ్రామం అంటే ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు.

ఆంధ్రరాష్ట్ర ప్రజలందరికి ఇష్టదైవమైన వైఎస్‌ఆర్‌ మరణాన్ని తట్టుకోలేక గుండే ఆగిన నిరుపేద కుటుంబాలను ఓదార్చడంలో తప్పేంమిటో ఇప్పటికి తనకు అర్ధం కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు .తన తండ్రి మరణం అనంతరం రాజకీయాలు దిగజారాయని,ఈ పరిస్థితులలో జన హృదయాలలో రాజశేఖర్‌రెడ్డికి సుస్థిర స్థానం కల్పించిన నా అక్కలు ,అన్నలు చెల్లెళ్ళు,తమ్ముళ్ళు చూపిస్తున్న ప్రేమానురాగాల వల్లే ఈ రోజు మీముందుకు,
 
మీరున్నారనే ధైర్యంతో ఈ యాత్రను కొనసాగిస్తున్నామని జగన్‌ పేర్కొన్నారు. నరసింహాన్న ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి కదలి వచ్చిన మా కుటుంబ సభ్యులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నామన్నారు. అనంతరం జగ్గంపేట ,గండేపల్లి మండలలో విగ్రహావిష్కరణలు,ఓదార్పు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. జగన్‌ ఓదార్పు యాత్రకు అడుగడుగున ఘనస్వాగతంతో ప్రజలు పూల వర్షం కురిపించారు.ఎమ్మెల్యే నరసింహం జగన్‌ యాత్రను విజయవంతంగా నడిపించారు.ఈ కార్యక్రమంలో జగన్‌వెంట ముద్రగడ పద్మనాభం తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment