జనం - జగన్

ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......

Sunday, July 18, 2010

జగన్ వర్గంలో రాం'బాంబు' అంబటిపై వేటుతో విస్మయం - విష్యత్తు కార్యచరణపై మల్లగుల్లాలు

వైఎస్ సన్నిహితుడితో మంతనాలు
తన వర్గం ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సమీక్ష
తనకు, తన వర్గానికి పరోక్ష సంకేతాలేనని భావన
సమర్థంగా ఎదుర్కోవాలని నిర్ణయం!
బహిరంగ నిరసన వద్దని తీర్మానం
ద్వితీయ శ్రేణి నేతలచే ధిక్కార స్వరం
జగన్ సై అంటే మేమూ సై
ప్రజాదరణను ఓర్వలేకే అధిష్ఠానం ద్వంద్వ వైఖరి
ఓదార్పు యాత్రలో జక్కంపూడి విజయలక్ష్మి
అంబటి రాంబాబుపై అధిష్ఠానం సస్పెన్షన్ వేటు వేయడంతో రాష్ట్ర కాంగ్రెస్‌లో ముసలం మొదలైంది. అధిష్ఠానం నిర్ణయంతో కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కలత చెందితే.. ఆయన వర్గం విస్మయానికి గురైంది. మొయిలీ వ్యాఖ్యలతో యాత్రకు గ్రీన్‌సిగ్నల్ లభించిందని భావిస్తున్న 24 గంటల్లోనే.. ఊహించని రీతిలో అంబటిపై వేటు పడడం జగన్ వర్గాన్ని షాక్‌నకు గురి చేసింది.

పీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉంటూనే జగన్‌కు అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తూ వచ్చిన అంబటిపై పార్టీ క్రమశిక్షణ చర్య తీసుకోవడం ఆ వర్గానికి మింగుడు పడలేదు. పీసీసీ క్రమశిక్షణ సంఘం ఇచ్చిన సంజాయిషీ నోటీసుకు సమాధానం చెప్పేందుకు ఈ నెలాఖరు వరకు గడువు ఉన్నప్పటికీ.. శనివారం రాత్రే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి వీరప్ప మొయిలీ పేరిట అంబటిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటింపజేయడం పరోక్షంగా జగన్‌కు చెక్ పెట్టేందుకేనని ఆ వర్గం భావిస్తోంది. పైగా.. ఈ పరిణామం ఆ వర్గానికి పరువు ప్రతిష్ఠకు సంబంధించిన అంశంగా మారింది. దీంతో ఆ సస్పెన్షన్‌ను నిలుపుదల చేయించాలని జగన్ వర్గం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

జక్కంపూడి ఇంట్లో మంతనాలు అంబటి సస్పెన్షన్ అనంతర పరిణామాలపై జగన్ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలిసింది. తాజా రాజకీయ పరిణామాలపై శనివారం రాత్రి మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు నివాసంలో జగన్ తన సన్నిహితులతో సమీక్షించారు. అంబటిని సస్పెండ్ చేయడం ద్వారా.. పరోక్షంగా తనపైనా, తన వర్గం వారిపైనా మున్ముందు చర్యలు తప్పవన్న సంకేతాలు ఇచ్చారని, దీనిని సమర్థంగా ఎదుర్కొనాలని నిర్ణయించారు.

ఈ సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడైన రాష్ట్రానికి చెందిన ముఖ్య నేతతో టెలిఫోన్‌లో సంప్రదింపులు జరిపారని తెలిసింది. అలాగే, అంబటి సస్పెన్షన్‌పై రాష్ట్రవ్యాప్తంగా తన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతోనూ ఆయన తెల్లవారుజాము వరకు ఫోన్‌లో సంభాషించినట్లు తెలిసింది.

ఆదివారం ఉదయం కూడా జక్కంపూడి నివాసంలోనే జగన్‌ను కలిసిన పలువురు నేతలు కూడా ఇదే అంశంపై చర్చించినట్లు తెలిసింది. అయితే, అధిష్ఠానం నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేయాలి తప్పితే.. జగన్ గానీ, ఆయన వెంట ఉన్న ప్రజాప్రతినిధులు గానీ దానిని నిరసన రూపంలో బహిరంగంగా వ్యాఖ్యానించరాదన్న నిర్ణయానికి వచ్చినట్లు జగన్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

తనపై సస్పెన్షన్ వేటుకు సంబంధించి పత్రికల్లోనూ, మీడియాలోనూ చూడడం మినహా ఇంతవరకు అధికారికంగా తనకు ఎలాంటి ఉత్తర్వు అందలేదని అంబటి రాంబాబు చెబుతున్నారు. అధిష్ఠానం తనను సస్పెండ్ చేసిందో లేదో తెలియని సందిగ్ధావస్థలో ఉన్నానని ఆయన చెబుతున్నారు. ఇటీవల హైదరాబాద్ పర్యటనలో భాగంగా జగన్ ఓదార్పు యాత్రకు పూర్తి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేలా వీరప్ప మొయిలీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే.. తనపై సస్పెన్షన్ వేటు వేసేలా కొంతమంది అధిష్ఠానం వద్ద ఒత్తిడి చేసి ఉండవచ్చని తన సన్నిహితుల వద్ద అంబటి వాపోయినట్లు సమాచారం.

అయితే.. దీనిని అధిష్ఠానం అంబటి రాంబాబుపై తీసుకున్న చర్యగానే భావించలేమని, జగన్‌కు, ఆయన వర్గానికి భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయో రుచి చూపించే ఒక 'శాంపిల్' మాత్రమేనని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అదే సమయంలో, జగన్‌తో సహా ఆయన వర్గీయులు ఎవరూ కూడా ఈ చర్యలు అంబటితోనే ఆగిపోతాయని భావించడం లేదు.

ఇప్పటికిప్పుడు జగన్‌పై ఎలాంటి చర్యలూ చేపట్టకుండా.. ఆయన చుట్టూ ఉన్న ప్రజా ప్రతినిధుల కదలికలపై నిఘా పెట్టి.. అదను చూసి వారిపైనా క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముందుగా కొమ్మలను తుంచేసి ఆ తర్వాతే చెట్టును నరుకుతారని, ఈ సూత్రం కాంగ్రెస్‌లో సర్వసాధారణమేనని ఆ పార్టీ సీనియర్ నేతలు స్పష్టం చేస్తున్నారు.

ఇక, తనను సస్పెండ్ చేసినట్లు తనకు అధికారికంగా ఉత్తర్వులు అందలేదని అంబటి రాంబాబు చెబుతున్న నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీలో సస్పెన్షన్లు, చేర్చుకోవడాలూ ఉంటాయని, కానీ అవెక్కడా కాగితాలపై ఉండవని, అంబటి వ్యవహారంపై మొయిలీ స్పష్టం చేసిన తర్వాత ఇంకా సందేహాలు ఎందుకని ఒక మంత్రి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలో అధిష్ఠానమే ఫైనల్ అని చెబుతూనే.. నిన్నటివరకు బహిరంగంగా మాట్లాడిన ప్రజాప్రతినిధులు అంబటిపై చర్య ద్వారా అధిష్ఠానం తన వైఖరిని వెల్లడించిన తర్వాత ఎందుకు మౌనాన్ని ఆశ్రయించారని ఆయన ప్రశ్నించారు.

సై అంటే సై: జగన్ సమక్షంలోనే జక్కంపూడి విజయలక్ష్మి

అంబటి రాంబాబుపై వేటు నేపథ్యంలో.. అధిష్ఠానంపై లోలోన ఆగ్రహంగా ఉన్నా పైకి మాత్రం జగన్ ఆచితూచి మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ, ఆయన అనుచరవర్గం మాత్రం అధిష్ఠానం చర్యలపై తీవ్రంగానే మండిపడుతోంది. ఆదివారం జరిగిన ఓదార్పు యాత్రలో ఏఐసీసీ సభ్యురాలు, మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు సతీమణి విజయలక్ష్మి అధిష్ఠానాన్నే టార్గెట్ చేస్తూ తన ప్రసంగాలను కొనసాగించారు.

జగన్‌కు వస్తున్న ప్రజాదరణకు ఓర్వలేకే అధిష్ఠానం ద్వంద్వవైఖరిని అవలంబిస్తోందని ధ్వజమెత్తారు. పార్టీ నుంచి ఎంతమందిని సస్పెండ్ చేసినా జనం జగన్ వెంటే ఉంటారని ఉద్వేగంగా ప్రసంగించారు. కడియం మండలంలో పలుచోట్ల మాట్లాడిన ఆమె.. "జగన్ సై అంటే మేమూ సై అంటాం. మేమంతా జగన్ వెంటే ఉంటాం'' అని ఆవేశంగా వ్యాఖ్యానించారు.

జిల్లాలో కాంగ్రెస్ రాజకీయాలను శాసించే జక్కంపూడి కొంతకాలంగా అనారోగ్యంగా ఉండడంతో పార్టీ వ్యవహారాలను చూస్తున్న విజయలక్ష్మి ఈస్థాయిలో స్పందించడంపై జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక, చాలాచోట్ల విజయలక్ష్మి మాట్లాడిన తర్వాతే జగన్ మాట్లాడారు. తన సమక్షంలోనే విజయలక్ష్మి అధిష్ఠానంపై విరుచుకుపడినా జగన్ మౌనంగానే ఉంటున్నారు.

జగన్ నేరుగా మాట్లాడకుండా ఎక్కడికక్కడ స్థానిక నేతలతో తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారన్న అభిప్రాయాలూ నెలకొన్నాయి. అలాగే, అంబటి వ్యవహారంపై ప్రజాప్రతినిధులతో కాకుండా ద్వితీయ శ్రేణి నేతలతో మాట్లాడించాలని, అధిష్ఠానంపై ధిక్కార స్వరాన్ని వారితోనే వినిపించాలన్న కార్యాచరణలో జగన్ వర్గం ఉందన్న ప్రచారం జరుగుతోంది. అయితే, ద్వితీయ శ్రేణి నేతలు ఏం మాట్లాడితే అది చెల్లుబాటు కాదని రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి వ్యాఖ్యానించారు. 

నా సస్పెన్షన్.. జగన్‌కు హెచ్చరికా? కానీయండి
కలలా ముగుస్తుందనుకుంటున్నా

31 వరకు సమయం ఉంది
అధికారికంగా అందలేదు: రాంబాబు
హైదరాబాద్, జూలై 18 : తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు అధికారిక సమాచారమేదీ అందలేదని, ఇప్పటికీ తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని పీసీసీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఈ సస్పెన్షన్ ఉదంతం ఓ కలలా ముగిసిపోవాలని అనుకుంటున్నట్టు ఆయన చెప్పారు. పార్టీ నేతలు బాజిరెడ్డి గోవర్దన్, గట్టు రామచంద్రరావు, ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ నాగార్జున తదితరులతో కలిసి ఆదివారం తన నివాసంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో అంబటి మాట్లాడారు.

"వైఎస్ జగన్ ఓదార్పు యాత్రకు బయలుదేరుతున్న సందర్భంగా సీఎం రోశయ్యపై కొన్ని వ్యాఖ్యలు చేశా. 7వ తేదీన వ్యాఖ్యలు చేస్తే, 9న క్రమశిక్షణ సంఘం నోటీసు ఇచ్చింది. 12న నన్ను హాజరు కావాలని, షోకాజ్‌కు వివరణ ఇవ్వాలని కోరారు. ఆరోజు వెళ్లి హాజరై రెండు వారాల సమయం కోరా. ఉప ఎన్నికలు ముగిశాక 31న కూర్చుందామంటూ ఒక లేఖ కూడా ఇచ్చారు.

ఈలోగా వీరప్ప మొయిలీ సస్పెండ్ చేశారని మీడియా ద్వారా తెలుసుకున్నాను. పార్టీ బాధ్యులెవరూ నాకు గానీ, మీడియాకు గానీ సస్పెన్షన్ విషయం చెప్పలేదు. 31వ తేదీ వరకు అవకాశం ఇచ్చాక ఎందుకు సస్పెండ్ చేస్తారో నేనే కాదు..మీరూ ఊహించడం కష్టం. నాకు అధికారిక సమాచారం అందాక స్పందిస్తా''నన్నారు.

ఆ మాటలు అవాస్తవం: "ఒకే పత్రిక నా మాటలను అసభ్యంగా కోట్ చేసింది. ఆ పత్రికా ప్రతినిధులతో వ్యక్తిగతంగా మాట్లాడినట్టు రాశారు. అది చూస్తే నాకే అసహ్యం వేసింది. ఆ కలం అశుద్ధాన్ని కక్కింది. నామీద వ్యక్తిగత కక్ష ఆ పత్రిక యాజమాన్యానికి ఉందని తెలుసు. ఆ పత్రికలో రాసిన మాటలు అవాస్తవం. విషం కక్కే మాటలు ఆ పత్రిక రాసింది. వాటిని ప్రజలు, పార్టీ నేతలు నమ్మొద్దు.

కాంగ్రెస్ పార్టీని భ్రష్టుపట్టించాలన్నది ఆ పత్రిక ధ్యేయం. అవాస్తవాలను కుప్పలు కుప్పలుగా రాసే పత్రికది. సోనియా-జగన్‌కు మధ్య జరుగుతోంది ముంగిస-పాము పోరుగా రాశారు. ఒక్కోసారి రెండూ చచ్చిపోతాయన్నారు'' అని రాంబాబు ఆగ్రహం ప్రదర్శించారు. "పరువు నష్టం వేసే అర్హత ఆ పత్రికకు ఉండాలి.. ఆ విషయమై ఆలోచిస్తా'' అని ఓ ప్రశ్నకు బదులిచ్చారు.

హెచ్చరిక అవనీయండి: "నా సస్పెన్షన్ జగన్‌కు హెచ్చరిక అవుతుందా? అవనీయండి. అవుతుందేమో చూద్దాం. చర్య తీసుకున్న విషయమై పూర్తి సమాచారం లేనప్పుడు స్పందించకూడదు'.. ఇది జగన్‌కు హెచ్చరిక అవుతుందా అన్న ప్రశ్నకు రాంబాబు సమాధానం. సస్పెన్షన్ విషయమై అధిష్ఠానం పునరాలోచించాలని మీ అనుచరులు కోరారు కదా అని ప్రశ్నించగా, వాళ్లు అనుచరులు కాదు సహచరులని.. వారు మీడియాను నమ్ముతారని బదులిచ్చారు. రోశయ్యపై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నారా అని అడగ్గా, స్పందించవలసిన సమయంలో స్పందిస్తానన్నారు.
 

No comments:

Post a Comment