జనం - జగన్

ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......

Friday, August 13, 2010

చర్యలు నాస్తి - అన్నీ సందేహాలే

charyaluరాష్ట్రంలో 1983కు ముందున్న పరిస్థితి కనిపిస్తోంది. కాంగెస్‌ ప్రభుత్వంలో జరి గిన, జరుగుతున్న అవినీతి ఇప్పుడు క్షేత్ర స్థాయిలో చర్చనీయాంశమవుతోంది. సీబీ ఐ విచారణ జరపాలన్న డిమాండ్‌ అన్ని వర్గాల్లోనూ ఉధృతమవుతోంది. వైఎస్‌ హయాం నుంచి రోశయ్య వరకూ జరిగిన అవినీతిపై విచారణకు ఆదేశించాలన్న వాదన పెరుగుతోంది. వైస్‌ హయాంలో జరి గిన భూ కేటాయింపులు, ఏపిఐఐసి చేసిన భూ కుంభకోణాల్లో అక్రమాలు జరిగాయని స్వయంగా మంత్రి బొత్స సత్యనారా యణ ఒప్పుకున్నారు. వైఎస్‌ హయాంలో జరిగిన అవి నీతిపై సీనియర్‌ నేతలు జెసి, డిఎల్‌ బాహా టంగానే గళమెత్తుతున్నారు. రోశ య్య హయాంలో జరిగిన అమీర్‌పేట హెచ్‌ ఎండిఏ భూముల ఉత్తర్వుపైనా విచారణ జరిపించాలని అంబటి డిమాండ్‌ చేస్తు న్నారు. వైఎస్‌ వ్యతిరేక- అనుకూల వర్గాలు ఎదురెదురుగా నిల బడి పార్టీలో సవాళ్లు విసురుకుంటూ అగ్గి రాజేస్తున్నారు. పార్టీ లో- ప్రభుత్వంలో ఇంత రభస జరుగుతు న్నా, అవన్నీ మీడియాకెక్కుతున్నా..

ఒకరిపైమరొకరు బురద చల్లుకుంటున్నా, ముఖ్యమంత్రి రోశయ్య మాత్రం మౌనంగా ఉంటుండటమే విస్మయం కలిగిస్తోంది. తన ప్రభుత్వంపై ప్రతిపక్షం చేసే చిన్న ఆరోపణలు, విమర్శలకు సైతం యుద్ధప్రాతిపదికన స్పందించే ముఖ్యమంత్రి రోశయ్య.. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలుచేస్తున్న ఏపీఐఐసి, రహేజా, అమీర్‌పేట హెచ్‌ఎం డీఏ భూ సేకరణ ఉత్తర్వు వ్యవహారాలపై పెదవి విప్పక పోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. వీటిపై పత్రికల్లో పుంఖానుపుంఖాలుగా వ్యతిరేక వార్తా కథనాలు వెలువడుతున్నా రోశయ్య నుంచి స్పందన కరవయింది. వెటకారం, లౌక్యంతో ప్రత్యర్థులపై ఆయన తరచూ చేసే ఎదురుదాడి గత నాలుగయిదు రోజుల నుంచి కనిపించడం లేదు. ప్రధానంగా.. వైఎస్‌ హయాంలో జరిగిన ఏపీఐఐసి భూకేటాయింపులను తనకు మద్దతుదారులుగా ఉంటున్న వారే తెరపైకి తీసుకువచ్చినా, దానిపై ముఖ్యమంత్రి ఆయన స్థాయిలో ఘాటుగా స్పందించలేదు. ఏపీఐఐసి, రహేజాకు భూముల కేటాయింపు అంశాలకు సంబంధించి ఆరోపణలు చేస్తున్న నేతలంతా మీడియా సమావేశానికి వెళ్లే ముందు, సమావేశం తర్వాత రోశయ్యను కలుస్తున్నప్పటికీ.. రోశయ్య మాత్రం ఇప్పటిదాకా మౌనం వీడకపోవడం అనుమానాలకు, ఆశ్చర్యానికి, ఉత్కంఠకు గురిచేస్తోంది.

తాజా పరిణామాలు, పరస్పర ఆరోపణల నేపథ్యంలో ఏం మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? ఎవరి పక్షాన మాట్లాడాలి? విచారణ జరిపించాలా? వద్దా? ఒకవేళ రాష్ట్ర స్థాయిలో సీబీసీఐడి విచారణకు ఆదేశిస్తే ఆ పరిథిలో చేర్చవలసిన అంశాలేమిటి? అన్న ప్రశ్నలు రోశయ్యను వేధిస్తున్నట్లు కనిపిస్తున్నాయి. 2004 నాటి నుంచి జరిగిన భూ కేటాయింపులపై విచారిస్తే.. అప్పట్లో మంత్రులుగా ఉంటూ నిర్ణయాలు తీసుకున్న తమనూ, ప్రస్తుత మంత్రులనూ ఆ పరిథిలో చేర్చాలా? వద్దా అన్నదీ అయోమయంగా మారింది. కేవలం వైఎస్‌పై నెపం వేసి తప్పుకుంటే కుదరదని, అప్పట్లో మంత్రులుగా ఉన్న వారి బాధ్యత సంగతి ఏమిటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే పరిస్థితి ఏమిటన్నది మరో ఇరకాటం. ఈ కారణంతోనే రోశయ్య ఏపీఐఐసి వ్యవహారాలపై మౌనంగా ఉంటున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఇదిలాఉండగా.. రోశయ్య మౌనానికి మరికొన్ని కారణాలు లేకపోలేదన్న విశ్లేషణ కూడా వినిపిస్తోంది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉండగా ఆయన పక్కన ఉంటూ చక్రం తిప్పిన ఆత్మబంధువే ఇప్పుడు రోశయ్య పక్కన చేరి చక్రం తిప్పుతుండటం కూడా ఒక కారణమంటున్నారు. రోశయ్య ఈ విషయంలో ద్విపాత్రాభినయం చేస్తున్నారన్న వ్యాఖ్యలు కూడా వినిపించకపోలేదు. వైఎస్‌ లేకపోయినా ఆయన వర్గానికి చెందిన వారికి పనులు ఎలా పూర్తవుతాయని, రోశయ్య అనుమతి లేకుండా వైఎస్‌ వర్గానికి చెందిన కాంట్రాక్టర్లకు పనులు, బిల్లులు ఏ విధంగా కేటాయిస్తారన్న ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. ఈ విషయంలో రోశయ్య లౌక్యంగా వ్యవహరిస్తున్నారని, అటు అధిష్ఠానంతో -ఇటు జగన్‌ వర్గంతో సఖ్యతగానే ఉంటూ, ఎవరికి కావలసిన పనులు వారికి చేసి పెడుతున్నారన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అందుకే విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నా ఎవరిపైనా చర్యలు తీసుకోలేక దాటవేత వైఖరి అనుసరిస్తున్నారన్న వ్యాఖ్యలు రాజకీయ- అధికార వర్గాల్లో వినిపిస్తున్నాయి.

ఏపిఐఐసి, రహేజా, ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌పై అవినీతి మేఘాలు కమ్ముకుంటున్న నేపథ్యంలో వ్యవహారం పార్టీ అధిష్ఠానానికి చేరింది. దీనిపై సీబీఐ విచారణ జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంత సీరియస్‌ వ్యవహారంపై రోశయ్య మౌనముద్ర దాల్చడం పరిశీలిస్తే.. ఇదంతా తిరిగి తన ప్రభుత్వం మెడకే చుట్టుకుంటుందన్న ఆందోళన కూడా లేకపోలేదంటున్నారు.

చంద్రబాబునాయుడు 2002లో ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌కు ఇచ్చిన జిఓను వైఎస్‌ నిలిపివేశారు. ఆ కంపెనీకి స్థలం ఇవ్వాలా వద్దా అన్న అంశంపై నిర్ణయం తీసుకునేందుకు అప్పటి ఆర్థిక శాఖమంత్రి రోశయ్య ఛైర్మన్‌గా గీతారెడ్డితోపాటు అధికారులతో సబ్‌ కమిటీని ఏర్పాటుచేశారు. వారి సూచనల ప్రకారం ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌కు మరికొన్ని సవరణలో కొత్త జీఓ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ అంశమే రోశయ్య సర్కారుకు ఇరకాటంగా పరిణమించిందని చెబుతున్నారు. ఈ విషయంలో రోశయ్య ఆనాడు ప్రజాప్రయోజనాలు, ప్రభుత్వ ఆర్థిక ప్రయోజనాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదన్న ప్రశ్నలు వివాదాస్పదంగా మారే ప్రమాదం లేకపోలేదు. బహుశా ఈ కారణంతోనే రోశయ్య మౌనంగా ఉండవచ్చంటున్నారు.

అదేవిధంగా.. 2004 నుంచి వైఎస్‌ మృతి చెందిన ముందు వరకూ జరిగిన భూ కేటాయింపులు, ఇతర అక్రమాలపై విచారణ జరిపించాలన్న డిమాండ్‌, దానిపై అధిష్ఠానం కూడా దృష్టి సారిస్తోందన్న వార్తల నేపథ్యంలో.. అప్పటి సమయంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన రోశయ్య కూడా ప్రభుత్వ నిర్ణయాల్లో కీలకపాత్ర పోషించారు. నిధుల విడుదల అంశం కూడా రోశయ్య పరిథిలోనే ఉండటంతో ఇప్పుడు నాటి వ్యవ హారాలపై తానేం మాట్లాడినా వివాదాస్పదమవుతుందన్న తర్జనభర్జన కూడా ఆయనలో కనిపిస్తోంది. ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌లో నిత్యం తన వెంట ఉండే సలహాదారుకు సమీప బంధువు డైరక్టర్‌గా ఉన్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నా, దానిపై చర్య తీసుకుంటే ఏమవుతుందోనన్న భయం ముఖ్యమంత్రిలో స్పష్టంగా కనిపిస్తోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఏ కారణంతో మౌనంగా ఉంటున్నారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సొంత పార్టీ నేతలే శత్రు శిబిరాలుగా ఏర్పడి ఆరోపణల వర్షం కురిపించుకుంటున్నా రోశయ్య ఎవరిపైనా చర్యలు తీసుకోలేని నిస్సహాయ పరిస్థితిలో ఉన్నారు. పైగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బీపీ ఆచార్యను తానే పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించడం కూడా రోశయ్య ఏమీ మాట్లాడలేకపోవడానికి మరో ప్రధాన కారణమంటున్నారు. కొత్తగా చేరిన ‘పాత కలెక్టరు’ను నొప్పించలేక రోశయ్య సతమతమవుతున్నారని పార్టీ వర్గాలు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నాయి.

అన్నీ సందేహాలే
అధిష్ఠానానికీ జగన్‌కు పడదు. రోశయ్య అధి ష్ఠానం మాటను శిరసావహిస్తారు. అంటే జగన్‌, ఆయన సన్నిహితులకు కష్టాలేనన్న మాట. మరో వైపు రోశయ్య, జగన్‌కూ పడదు. ఆ ప్రకారంగా.. జగన్‌, ఆయన అనుచరుల సంస్థలు, కాంట్రాక్టర్ల బిల్లులూ ఆగిపోవాలి. ప్రతీదాంట్లోనూ ప్రతి బంధకాలు ఎదురవాలి. వారంతా అను క్షణం సమస్యలతో సతమతం కావాలి. కానీ.. ఆ వర్గీయుల పనులు మునుపటి మాదిరిగానే చకచకా జరిగిపో తున్నాయి. కాకపోతే వైఎస్‌ ఉన్నప్పుడు నేరుగా జగన్‌ ద్వారా అవి జరిగిపోయేవి.

ఇప్పుడు మరొక కీలక శక్తి ద్వారా జరిగిపోతున్నాయి. అదే తేడా! ఇదే ఇప్పుడు ప్రభుత్వంలో నడుస్తున్న‘ సమర సహకారం’. విచిత్రంగా ఉంది కదూ? పైకి కత్తులు దూసు కుంటూ లోపల కలసి పనిచేయడం ఆశ్చర్యంగా ఉంది కదూ? అదెలాగో మీరే చిత్తగించండి. చదివితే రకరకాల చిక్కు ప్రశ్నలు మెదడును తొలచక మానదు. అయితే, అవన్నీ ‘తెలిసిన’ జవాబులే. జగన్‌కు, ప్రస్తుతం రోశయ్యకు సలహాదారుగా పనిచేస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకుడికి చెందిన సంస్థలు, వారి సన్నిహితుల కంపెనీలు, కాంట్రాక్టర్లకు వైఎస్‌ మృతి చెందిన తర్వాత కూడా ప్రభుత్వ అనుమతులు, కేటాయింపులలో ఎక్కడా బ్రేకులు లేకుండా పనులు జరిగిపోతున్నాయన్న వ్యాఖ్యలు అన్ని వర్గాల్లోనూ వినిపిస్తున్నాయి. సీఎం పేషీ నుంచి జిల్లా కలెక్టర్ల వరకూ వారి ఫైళ్లు మునుపటి మాదిరిగానే పంచకల్యాణి గుర్రం మాదిరిగానే పరుగులు తీస్తున్నాయన్న గుసగుసలు బాహాటంగానే వినిపిస్తున్నాయి. దానికి పార్టీ వర్గాలు అనేక ఉదాహరణలు తమ అనుమానాలకు మద్దతుగా చూపిస్తున్నారు.

జగన్‌కు అత్యంత విశ్వసనీయుడైన కర్నాటక బిజెపి మంత్రి గాలి జనార్దన్‌రెడ్డికి చెందిన ఓఎంసీపై రోశయ్య సీబీఐ విచారణ కోరారు. ఆ సమయంలో ఆ కంపెనీపై రోశయ్య ఉక్కుపాదం మోపుతున్నారన్న ప్రచారం ఉధృతంగా సాగింది. అయితే.. ఆ ఆ కంపెనీ బళ్ళారి నుంచి కృష్ణపట్నం ఓడరేవు వరకూ గనులు రవాణా చేస్తున్న క్రమంలో రోడ్లు దెబ్బతింటున్నాయి. చాలామంది మృతి చెందుతున్నారు. ఆ వాహనాలు ప్రయాణించే మార్గంలోని కొన్ని వందల గ్రామాలు కాలుష్యానికి గురవుతూ ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు.

ఈ దృష్ట్యా ఓఎంసీ రవాణా చేస్తున్న వాహనాలపై రోడ్డుపన్నును రెట్టింపు చేస్తారని ‘ముఖ్యమంత్రి సీబీఐ విచారణ’ క్రమంలో చాలామంది భావించారు. అయితే, ఇప్పటికే ప్రభుత్వం ఆ పని చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

*  వైఎస్‌ కుటుంబానికి, ఆయన సలహాదారుకు బాగా కావలసిన మెగా ఇంజనీరింగ్‌ కంపెనీకి ఇటీవలే ఆర్టీసీ బస్సుల్లో టీవీల ఏర్పాటుకు సంబంధించిన కాంట్రాక్టుకు దక్కిన వైనం విమర్శలకు గురయింది. వాణిజ్య ప్రకటనల ద్వారా 15 ఏళ్లు ఆదాయం సంపాదించే వెసులుబాటు రోశయ్య ప్రభుత్వమే కల్పించడం గమనార్హం. ఆ సంస్థ జగన్‌, సలహాదారు కుటుంబానికి కావలసిందన్న విషయం రోశయ్యకు నిజంగా తెలియదా? లేక ఆర్టీసీ ఎండీనే సీఎంకు తెలియకుండా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నారా అన్నది ప్రశ్న.
 
* జగన్‌ బినామీ కంపెనీగా విమర్శలు ఎదుర్కొంటున్న ఇందు కంపెనీకి గత మూడు నెలల క్రితమే ఐటి సెజ్‌కు బదులు సాధారణ సెజ్‌, రియల్‌ఎస్టేట్‌గా మార్చమన్న అభ్యర్థనను ఈ సర్కారే మన్నించినట్లు ప్రచారం జరుగుతోంది.

* ప్రతిష్ఠాత్మకమైన పోలవరం ప్రాజెక్టులో సలహాదారు వర్గానికి చెందిన కంపెనీలకు లబ్ది చేకూర్చే విధంగా, పాత కంపెనీని తొలగించి 2163 కోట్ల మేరకు ఎస్టిమేట్లు పెంచిన వైనంపై అనేక ఆరోపణలు వచ్చినా దాని నుంచి రోశయ్య సర్కారు వెనక్కి తగ్గలేదు. పైగా.. హైడల్‌ పవర్‌, పోలవరానికి కలిపి ఒకే టెండరు పిలవడంతో ఎవరూ రాకపోవడంతో అదికాస్తా రద్దయిపోయింది. ఇవన్నీ ఒక వ్యక్తికి చెందిన కోటరీకి ప్రయోజనం కలిగించేవని తెలిసినా రోశయ్య ప్రభుత్వం లెక్కచేయకుండా వ్యవహరించిందన్న విమర్శలు ఎదుర్కొంది.

* రోశయ్య సర్కారుకు అప్రతిష్ఠగా పరిణమించిన ఏపీఐసిసిలో వైఎస్‌ ఉన్నన్ని రోజులూ చక్రం తిప్పి, ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ వ్యవహారంలోనూ చక్రం తిప్పిన బీపీ ఆచార్యపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నా లెక్కచేయకుండా.. ఏపిఐఐసిపై విచారణ జరిపించే అధికారం ఉన్న పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శిగా, ఏపిఐఐసి బోర్డు సభ్యుడిగా నియమించిన వైనం రోశయ్యను మరింత ఇరుకునపెడుతోంది. ఈ నియామ ంపై ఛైర్మన్‌తో సహా జెసి, డిఎల్‌ వంటి నేతలు అసంతృప్తిగా ఉన్నా పట్టించుకోకపోవడంతో సీఎం ఎవరి ప్రయోజనాలను పరిరక్షిస్తున్నారన్న ప్రశ్నలకు అవకాశం కలిగింది.

- నెల్లూరు-తడ, కరీంనగర్‌- ఆదిలాబాద్‌, నల్లగొండ-విజయవాడ, బైలదిల్ల జాతీయ రహదారి కాంట్రాక్టులు కూడా జగన్‌, సలహాదారు కోటరీకి చెందిన సంస్థలకే అప్పచెప్పిన వైనంపై ఎంపీలు ఫిర్యాదు చేసి, వాటిని రద్దు చేయాలని కేంద్రమంత్రికి ఫిర్యాదు చేసినా ఆ వర్గానిదే పైచేయి అయింది.

* గోదావరిపై వంతెన నిర్మాణానికి సంబంధించిన సఖినేటిపల్లి-నర్సాపురం వంతెన పనులను సలహాదారు కోటరీకి చెందినదిగా భావిస్తున్న కోస్టల్‌ ఇంజనీరింగ్‌ కంపెనీకి వందకోట్లు ఖజానాకు నష్టం వస్తున్నా ప్రభుత్వం దానికే కట్టబెట్టే సన్నాహాల్లో ఉండటం చర్చనీయాంశమవుతోంది.

దీనిని కాంగ్రెస్‌ ఎంపి హర్షకుమార్‌ సైతం బాహాటంగా వ్యతిరేకించి, సీఎం, కేంద్రమంత్రికీ ఫిర్యాదు చేసినా రోశయ్య సర్కారు పెద్దగా పట్టించుకున్నట్లు లేదు.

*  శ్రీకాకుళం జిల్లాలోని రెండు చోట్ల నిర్మిస్తున్న ధర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు సలహాదారు బినామీకి చెందినదిగా భావిస్తోన్న ఈస్ట్‌కోస్ట్‌తో పాటు ఎన్‌సిసి కంపెనీలకి దక్కేలా సర్కారు కూడా కృషి చేయడం విమర్శలకు గురిచేస్తోంది. ఇందులో సోంపేట ఎన్‌సిసికి పర్యావరణ అనుమతులు ఇచ్చేది లేదని కేంద్రం స్పష్టం చేయగా, ఈస్ట్‌కోస్ట్‌కు అనుమతుల కోసం ఢిల్లీ స్థాయిలో పైరవీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

No comments:

Post a Comment