జనం - జగన్

ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......

Monday, August 23, 2010

జగన్‌పై వేటు ఖాయం సెప్టెంబర్ 4న షోకాజ్ నోటీసు!

పార్టీలో ఉంటూ పార్టీకే చిచ్చు
ఇక ఏ మాత్రం ఉపేక్షించరాదు
ఇదీ అధిష్ఠానం భావన
డీఎస్‌తో సోనియా చర్చలు
మెయిలీకి మార్గ నిర్దేశం
  "ఓదార్పుపై పార్టీ శ్రేణుల్లో అయోమయం సృష్టిస్తున్నారు. అధిష్ఠానం వైఖరిపై అర్ధ సత్యాలు, అసత్యాలు ప్రచారం చేశారు. మొత్తంగా పార్టీలోనే చిచ్చు పెడుతున్నారు. కడప ఎంపీ జగన్‌ను ఇక ఏమాత్రం ఉపేక్షించరాదు'' అని అధిష్ఠానం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. పార్టీ నుంచి ఎందుకు తొలగించరాదో చెప్పాలని కోరుతూ ఆయనకు వచ్చేనెల 4న షోకాజ్ నోటీసు జారీ చేయాలని యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెప్పాయి.

ఓదార్పు యాత్ర వల్ల పార్టీలో లేనిపోని అయోమయం ఏర్పడిందని, వైఎస్ మరణించిన నాటి నుంచే జగన్ పార్టీకి తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తున్నారని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలిసింది. జగన్ పార్టీ నుంచి పోకుండా, పార్టీలోనే చిచ్చు రేపుతున్నారని... అందువల్ల ఆయనను సాధ్యమైనంత త్వరగా పార్టీ నుంచి తప్పించడమే మంచిదని పార్టీకి చెందిన ఒక సీనియర్ నాయకుడు సోనియాకు సలహా ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

"ఒకసారి జగన్‌పై చర్య తీసుకుంటే రాష్ట్ర రాజకీయాల్లో స్పష్టత ఏర్పడుతుంది. పార్టీపరంగా, ప్రభుత్వపరంగా చేయాల్సిన పనులు సాఫీగా జరిగిపోతాయి. ఎన్నికలు జరిగేందుకు ఇంకా నాలుగు సంవత్సరాలున్నందువల్ల జగన్ నిలదొక్కుకోవడం కష్టం. ఎమ్మెల్యేలు కూడా జగన్ వైపు వెళ్లేందుకు వెనుకాడతారు'' అని ఆ నేత సోనియాకు చెప్పినట్లు తెలిసింది.

ఓదార్పు విషయంలో అధిష్ఠానం ఇప్పటికే జగన్‌కు తన వైఖరి స్పష్టం చేసినందున ఇక ఉపేక్షించడం సరైంది కాదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. వైఎస్ మరణించిన ఏడాదిలోపే జగన్‌పై చర్యలు తీసుకుంటే తప్పుడు సంకేతాలు వెళతాయని... అందుకే ఏడాది పూర్తయిన తర్వాత, ఆయన ప్రకాశం జిల్లా యాత్ర ప్రారంభించిన వెంటనే చర్య తీసుకోవాలని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

మేడమ్ మంతనాలు
సోమవారం తనను కలిసిన పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌తో సోనియా దాదాపు అరగంటసేపు చర్చించారు. డీఎస్ తనను కలిసే ముందు ఆమె ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి వీరప్ప మొయిలీని కూడా పిలిపించుకుని రాష్ట్రంలో పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. తదుపరి తీసుకోవాల్సిన చర్యలను మొయిలీకి నిర్దేశించారు.

కాగా, డీఎస్‌తో అధిక భాగం ఓదార్పుపైనే సోనియా చర్చించినట్లు సమాచారం. అయితే, తమ మధ్య ఓదార్పుపై చర్చ జరగలేదని డీఎస్ విలేకరులకు తెలిపారు. అదే సమయంలో... 'నేను చెప్పాల్సిన విషయాలను అధిష్ఠానానికి చెప్పాను. పార్టీ అంతర్గత విషయాల గురించి బయట మాట్లాడను. అవసరమైన దానికంటే ఎక్కువ ప్రశ్నలు వేయకూడదు'' అని మీడియాకు సూచించారు.

ఇటీవల జరిగిన ఉప ఎన్నికలపై సోనియాకు నివేదిక ఇచ్చానని, ఎన్నికల ఫలితాలను విశ్లేషించామని చెప్పారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అ«ధ్యక్షురాలిని మొట్టమొదటిసారి కలిశానని, రాష్ట్రంలో పార్టీ పరిస్థితుల గురించి చర్చించానని చెప్పారు.

జాతీయ స్థాయికి డీఎస్?
జగన్‌పై డీఎస్ ద్వారానే చర్యలు తీసుకోవాలని సోనియా భావిస్తున్నట్లు తెలిసింది. డీఎస్ హయాంలోనే జగన్‌పై వేటుపడుతుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. జగన్ వ్యవహారానికి సంబంధించి పార్టీని ప్రక్షాళన చేసిన తర్వాతే కొత్త పీసీసీ అధ్యక్షుడు వస్తారని అంటున్నారు. సోనియా డీఎస్‌ను చాలా సాదరంగా ఆహ్వానించారని, ఆయనతో అన్ని విషయాలు అరమరికలు లేకుండా మాట్లాడారని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఉప ఎన్నికల్లో ఓటమి చెందినందుకు బాధపడవద్దని డీఎస్‌ను సోనియా అనునయించినట్లు సమాచారం. పార్టీ ఆదేశాల మేరకు పోటీ చేసినందుకు డీఎస్‌ను అభినందించారని కూడా తెలిసింది. తనను ఢిల్లీకి (జాతీయ స్థాయి) పిలిపించుకుంటే పూర్తి అండగా నిలుస్తానని డీఎస్ చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తనకు ఏ పదవి ఇచ్చినా ఫర్వాలేదని, ఆ బాధ్యతలను శిరోధార్యంగా భావిస్తానని చెప్పినట్లు తెలిసింది. జగన్‌కు అధిష్ఠానం ఇప్పటికే ఎంతో స్పష్టంగా తన వైఖరి చెప్పిందని, మళ్లీ మళ్లీ ఆ విషయం చెప్పనవసరం లేదని సోనియాను కలిసిన తర్వాత డీఎస్ తన సన్నిహితులకు చెప్పినట్లు తెలిసింది.

"ఆయన పర్యవసనాలను ఎదుర్కొనాల్సిందే. అధిష్ఠానానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఎన్నికలు జరిగేందుకు ఇంకా మూడు సంవత్సరాల 9 నెలలుంది'' అని డీఎస్ చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. డీఎస్ సోనియాతో భేటీ తర్వాత వీరప్ప మొయిలీని కలిసి రాష్ట్ర రాజకీయాల గురించి డీఎస్ చర్చించారు. బుధవారం ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ, సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌ను కలుసుకుంటారు.

No comments:

Post a Comment