జనం - జగన్

ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......

Wednesday, August 4, 2010

జగన్‌కు ఝలక్‌ !

ముఖ్యమంత్రి రోశయ్యను ఇబ్బందిపెడుతున్న కడప ఎంపి వైఎస్‌ జగన్‌పై కాంగ్రెస్‌ అధిష్ఠానం క్రమంగా ఉచ్చు బిగుస్తోంది. జగన్‌కు ఎవరు మద్దతు పలికినా వారిపై కఠిన చర్యలుంటాయన్న సంకేతాలు పంపిం చడంలో ఇప్పటికే విజయవంతమైన నాయకత్వం.. తాజాగా వైఎస్‌కు బలమైన మద్దతుదారయిన శాయం పేట ఎమ్మెల్యే కొండా సురేఖపై దృష్టి సారించింది. ముఖ్యమంత్రి రోశ య్యపై విమర్శనాస్త్రాలు సంధించిన ఆమెను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

అందులో భాగంగా ముందు ఆమెకు షోకాజ్‌ నోటీసు జారీ చేసి, వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని అధిష్ఠానం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. దీనిద్వారా ఆమెను సస్పెండ్‌ చేసి, జగన్‌ వర్గానికి అతి పెద్ద షాక్‌ ఇచ్చేందుకు నిర్ణయిం చింది. ఆమె ఎలాంటి వివరణ ఇచ్చినా దానిని పరిగణనలోకి తీసుకోకూడదని భావిస్తోంది. అంతకంటే ముందు.. పిసిసి క్రమశిక్షణ, దర్యాప్తు సంఘం అధ్యక్షుడు కంతేటి సత్యనారాయణ రాజు ముఖ్యమంత్రి రోశయ్యతో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా తనపై కొండా సురేఖ మంగళవారం చేసిన వ్యాఖ్యలను రోశయ్య ప్రస్తావించి, ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.

ముఖ్యమంత్రి అయిన తనపైనే అడ్డూ అదుపూ లేకుండా మాట్లాడితే, ఇక వారిని అదుపు చేసే వారెవరని ఆయన ప్రశ్నించినట్లు తెలిసింది. ఆమెకు షోకాజ్‌ నోటీసులు ఇవ్వడం ద్వారా ఇలాంటి క్రమశిక్షణా రాహి త్యాన్ని అణచివేయాలని ఆయన సూచించారు. ఆ వెంటనే కొండా సురేఖకు షోకాజ్‌ నోటీసు జారీ చేస్తు న్నట్లు ఢిల్లీ నుంచి ప్రకటన వెలు వడటం గమనార్హం.

ఈవిషయంలో రోశయ్య పట్టుదల ఫలించినట్లు స్పష్టమవుతోంది. ధిక్కార స్వరం వినిపిస్తోన్న జగన్‌ వర్గాన్నికఠినంగా అణచివేయాలని, ఇకపై రాష్ట్రం నుంచి ఎలాంటి తలనొప్పులూ ఎదురుకాకుండా చూడాలన్న ఆలోచననను అధిష్ఠానం ఆచరణ లో పెడుతోంది. అందులో భాగంగా.. జగన్‌కు తిరుగులేని మద్దతుదారయిన ఎమ్మెల్యే కొండా సురేఖపై సస్పెన్షన్‌ వేసేందుకు నిర్ణయించినట్లు సమాచారం. బుధవారం సాయంత్రం దానికి సంబంధించిన ప్రకటన కూడా వెలువడింది. నిజానికి, ఆమెను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసేం దుకు రంగం సిద్ధమయిందని, షోకాజు నోటీసు కేవలం సంప్రదాయమేనని బుధవారం ఉద యం నుంచే ఢిల్లీ వర్గాల్లో ప్రచారం జరిగింది.

జగన్‌ కోసం మంత్రి పదవిని కూడా త్యాగం చేసిన కొండా సురేఖ.. తాను రోశయ్యను ము ఖ్యమంత్రిగా చూడలేకపోతున్నానని, ప్రజలు కూడా ఆయనను సీఎంగా గుర్తించడం లేదని ప్రకటించి సంచలనం సృష్టించిన విషయం తెలి సిందే. తాజాగా రోశయ్య పరిపాలనా తీరుపై ధ్వజమెత్తిన సురేఖ.. రాష్ట్ర పార్టీ పరిస్థితుల గురించి పార్టీ అధినేత్రి సోనియా, ఆమె రాజ కీయ సలహాదారు అహ్మద్‌పటేల్‌కు 11 పేజీల లేఖ రాసి, వాటి వివరాలు వెల్లడించడంతో రభస మొదలయింది. ఒక ఎమ్మెల్యేను సస్పెండ్‌ చేయడం ద్వారా, జగన్‌ను సమర్థిస్తున్న మిగిలిన ఎమ్మెల్యేలకు హెచ్చరిక జారీ చేయాలన్న వ్యూ హంతోనే అధిష్ఠానం కొండాపై వేటు వేసేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది.

రోశయ్య సూచనల మేరకే కొండా సురేఖపై చర్యలు తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతు న్నాయి. తనను విమర్శించిన పీసీసీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు, జగన్‌కు మరో మద్దతుదారయిన గట్టు రాంచందర్‌రావును పార్టీ నుంచి సస్పెండ్‌ చేయించడంలో విజయం సాధించిన రోశయ్య.. తనను మొదటి నుంచి లెక్కచేయకుండా వ్యవహరిస్తు, అవమానపరిచే విధంగా మాట్లాడుతున్న కొండా సురేఖపై రోశయ్య తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పుడు మళ్లీ తనను లక్ష్యంగా చేసుకుని కొండా చేసిన ఆరోపణలను అడ్డుపెట్టుకుని, ఆమెపై వేటు వేయించేందుకు రోశయ్య సిద్ధమవుతున్నారు.

ఇదిలాఉండగా వైఎస్‌కు అత్యంత సన్నిహితు లయిన అధికారులు, ఆయన హయాంలో జరిగిన నియామకాలపై కూడా రోశయ్య దృష్టి పెట్టినట్లు సమాచారం. వైఎస్‌కు మేనల్లుడయిన ఉన్నత విద్యామండలి కార్యదర్శి క్రిష్టోఫర్‌పై కూడా బదిలీ వేటు పడవచ్చంటున్నారు. వైఎస్‌ బంధువుగా ప్రచారంలో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్‌ రేమాండ్‌ పీటర్‌ను కూడా బదిలీ చేయవచ్చంటున్నారు. అదేవిధంగా వైఎస్‌కు మిత్రుడయిన ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ కెసి రెడ్డిపై కూడా వేటు పడే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఇప్పటికే ఆయనను తొలగించా లని బీసీ సంఘాలు కూడా డిమాండ్‌ చేస్తు న్నాయి.

రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన 25 మంది వీసీల నియామకాలపైనా రోశయ్య ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. వేమన, నన్నయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, రాయలసీమ, శాతవాహన, బిఆర్‌అంబేద్కర్‌, విక్రం సింహపురి, కృష్ణా యూనివర్శిటీల వీసీలను కూడా తొలగించే అవకాశాలున్నాయని చెబుతుతున్నారు. వైఎస్‌కు సన్నిహితంగా వ్యవహరించే టిడిడి ప్రత్యేకాధికారి ధర్మారెడ్డిని కూడా బదిలీ చేయవచ్చని ప్రచారం జరుగు తోంది. తాజాగా వైఎస్‌ కుటుంబానికి సన్నిహితు రాలయిన కృష్ణదేవరాయ వీసీ కుసుమకుమారి ని తొలగించిన ప్రభుత్వం.. రెండురోజుల వ్యవధిలోనే వైఎస్‌కు కొమ్ముకాశారని ఆరోప ణలు ఎదుర్కొన్న ఐపిఎస్‌ అధికారి మల్లారెడ్డిని హైదరాబాద్‌ ట్రాఫిక్‌కు బదిలీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో నెల్లూరు నుంచి కడపకు బదిలీ చేసిన మల్లారెడ్డిపై, ఆరు నెలలు కూడా తిరగకుండానే రెండోసారి బదిలీ వేటు వేసింది.

వీరు కాకుండా వైఎస్‌ హయాంలో మంచి పోస్టింగులు సంపాదించిన ఐపిఎస్‌, ఐఏఎస్‌లపై కూడా బదిలీ వేటు వేసేందుకు రోశయ్య సర్కారు సిద్ధమవుతోంది. వీరిలో ఐపిఎస్‌కు సంబంధించి.. అర్హత లేకున్నా కులం, విధేయ త, వర్గ కోణంలో హవా సాగించిన అధికారు లను కూడా పక్కకు తప్పించాలని నిర్ణయించి నట్లు తెలిసింది. అయితే.. వీరిలో సమర్థులు ఉంటే వారిని మాత్రం మినహాయించవచ్చు అంటున్నారు. వైఎస్‌ హయాంలో పోస్టింగులు పొందినంత మాత్రన వారందరినీ బదిలీ చేయకూడదని, వారిలో బాగా పనిచేసే నైజం ఉన్న వారిని మాత్రం ముట్టుకోకపోవచ్చని అధికారవర్గాలు చెబుతున్నాయి.

rekaనేను ఏం మాట్లాడినా పార్టీ సంక్షేమం కోసమే మాట్లాడా. తెలంగాణ ఏర్పడితే జగన్‌ మా నాయకుడు కాదు కదా?- సురేఖ

నేడు గళం విప్పనున్న జగన్‌
కొండా సురేఖకు షోకాజ్‌ నోటీసు జారీ చేసినప్పటికీ ఇంతవరకూ జగన్‌ దానిపై స్పందించకపోవడం చర్చనీయాంశమ యింది. ఆయన ఢిల్లీలో ఉన్నప్పటికీ మీడియాను పిలిపించేందుకు ప్రయ త్నించలేదు. అయితే, గురువారం ఆయ న మీడియా ముందుకు రావచ్చని తెలు స్తోంది. తనకు అండగా నిలుస్తున్నం దుకే కొండా సురేఖ, అంబటి రాం బాబుకు న్యాయం చేసేందుకు ఎవరితో నయినా మాట్లాడతానని కాకినాడ సభ లో జగన్‌ చెప్పిన విషయం తెలిసిందే.
Jagan-babu

ఢీ అంటే ఢీ
కత్తులు దూస్తున్న అధిష్ఠానం
కాస్కోమంటున్న జగన్ వర్గం

ధిక్కారంపై ఢిల్లీ గరంగరం
'జగన్ చెట్టు' కొమ్మలపై వేటు
సురేఖకు శ్రీముఖంతో మరో సంకేతం
వైఎస్ అనుకూల అధికారులపైనా దృష్టి
కడప ఎస్పీ బదిలీతో గట్టి హెచ్చరికలు
జగన్ వర్గంలో అదే దూకుడు
పరిణామాలు ఊహించే అడుగులు
సానుభూతి వాదనతో ప్రజల్లోకి వెళ్లే వ్యూహం
స్వరం పెంచిన అంబటి, కొండా సురేఖ
కాంగ్రెస్ అధిష్ఠానం కత్తి పదునెక్కుతోంది. ఒక్కొక్కరిపై వేటు పడుతోంది. యువనేత వర్గీయుల పరిభాషలోనే చెప్పాలంటే... 'జగన్ అనే వృక్షం' కొమ్మల్ని ఒక్కొక్కటిగా నరుకుతోంది. గీత దాటే క్షణం కోసం కాచుకు కూర్చున్నట్లుగా... అలా గీత దాటగానే, ఇలా వేటు వేస్తోంది. 'కాంగ్రెస్ కొమ్మల్ని ఒక్కొక్కటిగా నరుకుతున్నారు' అంటూ వాపోయిన కొండా సురేఖకు తాజాగా శ్రీముఖం సిద్ధమైంది.

మొన్న అంబటి రాంబాబు, నిన్న గట్టు రామచంద్రరావు, నేడు కొండా సురేఖ! ఈ 'వేటు పర్వం' జగన్ వర్గంలోని రాజకీయ నాయకులకే పరిమితం కాలేదు. వైఎస్‌కు అనుకూలురుగా పేరొందిన ఉన్నతాధికారులపైనా పూర్తిగా వేటు వేయడమో, బదిలీ వేటు వేయడమో మొదలైంది. మొన్న ఎస్కే యూనివర్సిటీ వీసీ కుసుమ కుమారి, నేడు కడప జిల్లా ఎస్పీ మల్లారెడ్డి! కుసుమ కుమారికి పూర్తిగా ఉద్వాసన పలుకగా... మల్లారెడ్డికి అప్రాధాన్య పోస్టు దిక్క యింది. ఒకేసారి జగన్ వర్గీయులైన నేతలకు, అధికార గణానికి హెచ్చరికలు పంపడమే అధిష్ఠానం ఉద్దేశమని తెలుస్తోంది.

కాంగ్రెస్ అధిష్ఠానం ఈస్థాయిలో కత్తులు నూరుతున్నా జగన్ వర్గం మాటల్లో పదును తగ్గడంలేదు. వారిలో జంకు కనిపించడంలేదు. సై అంటే సై అంటున్నారు. 'కమాన్' అంటూ కవ్విస్తున్నారు. వీరి చర్యలు తదనంతర పరిణామాలను ఊహించి... ఇంకా చెప్పాలంటే తాము ఆశించి చేస్తున్నట్లుగా ఉన్నాయని పార్టీ నేతలు అభిప్రాయపడటం గమనార్హం.

అంబటి రాంబాబు, గట్టు రామచంద్రరావులపై చర్యల తర్వాత కూడా కొండా సురేఖ గళమెత్తడం... ఆమెతో అంబటి రాంబాబు స్వరం కలపడం ఇందుకు నిదర్శనం. "ఎక్కడికి పోతున్నారు? ఎంతమందిని సస్పెండ్ చేస్తారు? ఎందుకు సస్పెండ్ చేస్తున్నారు?'' అంటూ అంబటి తాజాగా నిలదీశారు. 'నాపై చర్య తీసుకుంటే వైఎస్‌పై తీసుకున్నట్లే. పార్టీలోని మెజారిటీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలనే లేఖ ద్వారా సోనియాకు తెలిపాను' అని సురేఖ తెలిపారు. రాష్ట్రానికి, పార్టీకి జగన్ అవసరం ఉందని వీరిద్దరూ తేల్చి చెప్పడం విశేషం.

ఇదీ అధిష్ఠానం దెబ్బ...
కొండా సురేఖకు షోకాజ్ ద్వారా రాష్ట్ర నాయకత్వాన్ని, అధిష్ఠానాన్ని ధిక్కరించేలా బహిరంగ వ్యాఖ్యలు చేయడాన్ని ఏమాత్రం సహించబోమని అధిష్ఠానం తేల్చిచెప్పినట్లయింది. దీంతో నిన్న మొన్నటి వరకూ అధిష్ఠానం అంటే ఏమిటో తమకు తెలియదని.. వైఎస్ మాత్రమే తెలుసునని బహిరంగంగా వ్యాఖ్యానించిన మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ వంటి వారిపైనా చర్యలు తప్పవని పార్టీ నేతలు చెబుతున్నారు.

ఇన్నాళ్లు జగన్ వర్గం ఎలాంటి ప్రకటనలు చేసినా చూసీ చూడనట్లుగా వ్యవహరించిన అధిష్ఠానం... ఇకపై ఈ ధోరణితో ఉంటే పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని గ్రహించిందని తెలిపారు. అందువల్లే హైకమాండ్ అంటే ఏమిటో వెల్లడించేందుకు సన్నద్ధమైందని అంటున్నారు. 'ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో అధిష్ఠానానికి తెలుసు' అని కొండా సురేఖ లేఖపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేది స్పందించారు.

సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామన్నారు. లేఖను పార్టీ అధ్యక్షురాలికి రాసి... దానిని మీడియాకు విడుదల చేయడంపై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి వీరప్ప మొయిలీ నుంచి సమాచారం అందాల్సి ఉందన్నారు. జగన్ విషయంలో అధిష్ఠానం వైఖరి ఒక్క ముక్కలో చెప్పేది కాదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

అయినా... అడుగు ముందుకే!
'అధిష్ఠానాన్ని గుర్తించాలి, గౌరవించాలి! ఆ తర్వాతే ఎవరైనా, ఏమైనా, ఏదైనా!' అని ఢిల్లీ పెద్దలు తేల్చి చెబుతుండగా... కష్టాల్లో ఉన్న కాంగ్రెస్‌ను రెండుసార్లు అధికారంలోకి తెచ్చిన వైఎస్ వర్గీయులకు పార్టీలో ఆదరణ కరువైందని జగన్ అనుచరుల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 'పోరాడితే పోయేదేముంది...' అనే తరహాలో వీరు అధిష్ఠానాన్ని ఢీకొంటున్నారు.

గత కొద్ది రోజులుగా జగన్ వర్గం అనుసరిస్తున్న వ్యూహాన్ని గమనిస్తే... 'ఒంటి చేత్తో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన వైఎస్‌ను విస్మరిస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులను, వర్గాన్ని అణగదొక్కుతున్నారు' అనే వాదనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే వారి లక్ష్యంగా కన్పిస్తోందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

తాము ఏం మాట్లాడినా తప్పు పడుతూ, క్రమశిక్షణ పేరుతో బయటకు గెంటేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రజల్లోకి వెళ్లే ఆలోచన కన్పిస్తోందని... దీని వెనుక వైఎస్ పట్ల ప్రజల్లో ఉన్న సానుభూతిని తమకు అనుకూలంగా మార్చుకోవాలనే వ్యూహం ఉందని అంటున్నారు. మున్ముందు జగన్ వర్గానికి చెందిన మరికొందరు బహిరంగంగా రాష్ట్ర ప్రభుత్వంపైనా, నాయకత్వంపైనా బహిరంగంగా నిప్పులు చెరిగే అవకాశాలున్నాయని అభిప్రాయపడుతున్నారు.

'రోగి కోరుకున్నదే వైద్యుడు రాసిచ్చినట్లు' జగన్ వర్గం కోరుకుంటున్నదే అధిష్ఠానం చేస్తోంది. గొంతెత్తిన వారిపై వేటు వేస్తోంది. తద్వారా తమ వర్గంపై అధిష్ఠానం కక్ష కట్టిందన్న వాదనతో జగన్ వేరు కుంపటి పెట్టేందుకు రంగం సిద్ధమవుతోందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

వైఎస్ తొలి వర్ధంతి (సెప్టెంబర్ 2) నాటికి.. జగన్ కొత్త పార్టీని ఏర్పాటు చేసేలా పావులు కదులుతున్నాయని, అందులో భాగంగానే ఈ దూకుడు ప్రదర్శిస్తున్నారని నేతలు చెబుతున్నారు. బహుశా... అధిష్ఠానాన్ని పరీక్షించేందుకు కావాలనే లేఖలు రాస్తున్నారేమోనని ఆయన అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా జగన్ వర్గానికి చెందిన సురేఖకు షోకాజ్ నోటీసు ఇవ్వడం రాష్ట్ర రాజకీయాల్లో పలు పర్యవసానాలకు కారణమవుతుందని అంటున్నారు.

జగన్ సెప్టెంబర్ 4 నుంచి మరో విడత ఓదార్పు యాత్ర చేపడతారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. బుధవారం పార్లమెంట్‌కు వచ్చిన జగన్ మధ్యాహ్నం వరకు ఒకరిద్దరు ఎంపీలతో గడిపి తర్వాత ఇంటికి వెళ్లిపోయారు. కొండా సురేఖ వ్యవహారంపై ఆయన స్పందించలేదు. భవిష్యత్తు కార్యాచరణ గురించి ఆయన ఢిల్లీ నుంచే తన సన్నిహితులతో మాట్లాడినట్లు తెలిసింది.

No comments:

Post a Comment