జనం - జగన్

ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......

Saturday, August 7, 2010

పోరుకు 'సై' * రోశయ్యపై లేఖా యుద్ధం - అంబటి, సురేఖలపై క్రమ'శిక్ష'ణ ఆంటోనీ చేతిలో నివేదిక

ఢిల్లీ పెద్దలకు వరుసగా ఉత్తరాలు
సురేఖ బాటలో మరికొందరు ఎమ్మెల్యేలు..
జగన్ శిబిరం తాజా వ్యూహం
యువనేతతో మంత్రులు బాలినేని, ముఖేశ్ ముచ్చట్లు
కడప ఎంపీ జగన్ వర్గీయులు అధిష్ఠానంపై కాలు దువ్వేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యమంత్రి రోశయ్యపై లేఖల యుద్ధం ప్రారంభించనున్నారు. 'ఎంత మందిపై చర్యలు తీసుకుంటారో చూస్తాం!' అంటూ కొత్త సవాల్ విసిరేందుకు సమాయత్తమవుతున్నారు. రాష్ట్ర నాయకత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ, జగన్‌కు పగ్గాలు అప్పగించాలని డిమాండ్ చేస్తూ లేఖ రాసిన మాజీ మంత్రి కొండా సురేఖ బాటలో మరికొందరు నడవనున్నారు.

వీరంతా ఆమెలాగే అధిష్ఠానానికి లేఖలు రాయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. శనివారం జగన్‌ను శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, లబ్బి వెంకటస్వామి, శ్రీకాంత్ రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి (పీఆర్పీ) కలిశారు. శుక్రవారం రాత్రి జగన్‌తో మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి మంతనాలు జరిపారు. మంత్రి ముఖేశ్ తన కుమారునితోపాటు జగన్‌తో ముచ్చటించడం చర్చనీయాంశమైంది.

శాసన సభ్యులతో పాటు మరికొందరు నేతలు కూడా జగన్‌ను కలుసుకున్నారు. జగన్‌తో భేటీ అనంతరం శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి తదితరులు ఇకపై కొండా సురేఖ బాటలోనే నడవాలని, రాష్ట్ర ప్రభుత్వ పాలనా వైఫల్యాలపై సుదీర్ఘ లేఖాస్త్రాలను సంధించాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. వీలైనన్ని ఎక్కువ లేఖలను అధిష్ఠానానికి పంపాలని జగన్ శిబిరం భావిస్తోంది.

"ప్రభుత్వ పథకాలు అమలు కావడం లేదు. ప్రధానంగా వైఎస్ ప్రారంభించిన పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు నిధులు మంజూరు చేయకుండా ముఖ్యమంత్రి రోశయ్య తూట్లు పొడుస్తున్నారు. ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు'' అని ఢిల్లీకి లేఖలు పంపాలని నిర్ణయించారు. జగన్‌ను కలసిన అనంతరం బయటకు వచ్చిన ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి తన సన్నిహితులతో ఈ లేఖల ప్రస్తావన తీసుకొచ్చారు. ప్రజా ప్రతినిధులుగా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో అధిష్ఠానానికి వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు.

ఒక్కరు కాదు: అధిష్ఠానానికి రాసిన లేఖను మీడియాకు విడుదల చేసిన సురేఖపై చర్యలకు రంగం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలో... వీలైనంత ఎక్కువమందితో లేఖలు రాయించి, వాటిని బయటపెట్టి సురేఖపై చర్య తీసుకునే విషయంలో అధిష్ఠానాన్ని పునరాలోచనలో పడేయడమే జగన్ వర్గం వ్యూహంగా కన్పిస్తోంది. దీంతోపాటు జగన్ వెంట నడిచే ఎమ్మెల్యేల సంఖ్య తగ్గుతోందనే ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు కూడా ఈ లేఖల పర్వం ఉపయోగపడుతుందని వీరు భావిస్తున్నారు.

తన వర్గానికి చెందిన నేతలపై అధిష్ఠానం వరుసగా చర్యలు తీసుకుంటున్నా .. జగన్ మౌనం వీడడం లేదు. ప్రత్యక్షంగా తాను రంగంలోకి దిగకుండా.. తన సన్నిహితుల ద్వారా అధిష్ఠానంపై పరోక్ష యుద్ధానికి తెరతీయాలని ఆయన భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అనుచరగణం ఏం మాట్లాడినా, అధిష్ఠానంపై కవ్వింపు చర్యలకు దిగినా, వారిపై ఢిల్లీ పెద్దలు క్రమశిక్షణ చర్యలు చేపట్టినా వ్యూహాత్మక మౌనం పాటించాలని, సరైన సమయంలో తన నిర్ణయాన్ని వెల్లడించాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

అంబటి, సురేఖలపై క్రమ'శిక్ష'ణ
ఆంటోనీ చేతిలో నివేదిక

ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం!
పీసీసీ పరిధిలోనే 'గట్టు'
హైదరాబాద్, ఆగస్టు 7 : సస్పెన్షన్‌కు గురైన కాంగ్రెస్ నేత అంబటి రాంబాబు, అధిష్ఠానం ఆగ్రహాన్ని చవిచూసిన ఎమ్మెల్యే కొండా సురేఖల 'భవిష్యత్తు' ఒకటి రెండు రోజుల్లో తేలనుంది. వీరిపై పీసీసీ విచారణ కమిటీ ఇచ్చిన నివేదిక ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడు ఏకే ఆంటోనీ చేతిలో పడిం ది. సీఎం రోశయ్యపై సురేఖ తీవ్ర విమర్శలు చేస్తూ రా సిన లేఖను మీడియాకు వెల్లడించడంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి.. తగు నివేదిక అందించాలని అధిష్ఠానం ఢిల్లీలోనే ఉన్న పీసీసీ చీఫ్ డి.శ్రీనివాస్‌ను కోరింది.

దీనిపై విచారణ జరపాలంటూ సంబంధిత కమిటీ అధ్యక్షుడు కంతేటి సత్యనారాయణ రాజుకు డీఎస్ సిఫారసు చేశారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు, విమర్శలు చేశారంటూ అంబటిని సస్పెండ్ చేస్తున్నట్లు గతనెల 22న పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి వీరప్ప మొయిలీ ప్రకటించారు. అంబటిపైనా విచారణ జరపాలని అధిష్ఠానం పీసీసీని ఆదేశించింది.

నిజానికి అంతకంటే ముందే (గత నెల 8న) పీసీసీ విచారణ కమిటీ అంబటికి షోకాజ్ నోటీసు జారీ చేసింది. గత నెల 12న విచారణ కమిటీ ముందు హాజరైన అంబటి తనకు రెండు వారాల గడువు కోరారు. దీనికి కమిటీ సమ్మతించి 31 వరకు గడువు ఇచ్చింది. అయితే.. 31న కమిటీ సభ్యులు లేకపోవడంతో గాంధీ భవన్‌కు వచ్చినా అంబటి, తన వాదనను ఎవరికీ సమర్పించకుండానే వెళ్లిపోయారు.

కంతేటి కమిటీ శుక్రవారం నాడు భేటీ అయింది. అయితే.. తనకు లిఖిత పూర్వకంగా ఎలాంటి సమాచారం లేదంటూ కమిటీ ముందుకు అంబటి రాలేదు. అయితే... ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం ఇచ్చామని, దీనిని అంబటి బేఖాతరు చేశారని చెబుతూ పీసీసీ విచారణ కమిటీ డీఎస్‌కు నివేదిక సమర్పించింది. విచారణ కమిటీ నివేదిక ప్రకారం వాస్తవ పరిస్థితులను సమీక్షించి తగు నిర్ణయం తీసుకోవాలని అధిష్ఠానాన్ని పీసీసీ కోరింది.

కొండా సురేఖ, అంబటి రాంబాబులకు సంబంధించిన నివేదికను ఢిల్లీ పెద్దలు ఏఐసీసీ క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడు ఆంటోనికి పంపారు. దీనిపై అధిష్ఠానం ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకునే వీలుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా.. పీసీసీ కిసాన్ సెల్ గట్టు రామచంద్రరావును కార్యాలయ కార్యదర్శి పదవి నుంచి తొలగించడం పీసీసీ పరిధిలోనిదే అయినందున, దీనిపై మరో ఆలోచనకు ఆస్కారం లేనట్లే!

No comments:

Post a Comment